రంగారెడ్డి, మార్చి 21 (నమస్తే తెలంగాణ): ఐదు ఎంపీ స్థానాలతో ఉన్న అనుబంధం కారణంగా సార్వత్రిక ఎన్నికల్లో రంగారెడ్డి జిల్లా కీలక భూమిక పోషించనున్నది. జిల్లాలో 8 అసెంబ్లీ నియోజకవర్గాలుండగా..అవి చేవెళ్ల, భువనగిరి, మహబూబ్నగర్, నాగర్కర్నూల్, మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలో ఉన్నాయి. జిల్లాలో 35,85,426 ఓటర్లుండగా..మే 13న జరుగనున్న లోక్సభ ఎన్నికల్లో అభ్యర్థుల విజయావకాశాలపై రంగారెడ్డి జిల్లా ఓటర్లు తీవ్ర ప్రభావాన్ని చూపనున్నారు. అలాగే..కొన్ని చోట్ల మారిన రాజకీయ సమీకరణాల నేపథ్యంలో పాత ప్రత్యర్థులే ప్రస్తుత ఎన్నికల్లోనూ తలపడనుండడంతో ఈసారి ఫలితాలపై సర్వత్రా ఆసక్తి నెలకొన్నది.
పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో రంగారెడ్డి జిల్లాలో రాజకీయ వాతావరణం వేడెక్కుతున్నది. జిల్లా ఐదు పార్లమెంట్ స్థానాల పరిధిలో విస్తరించి ఉండగా.. ఇక్కడి ఎనిమిది అసెంబ్లీ సెగ్మెంట్లు వేర్వేరు ఎంపీ స్థానాల పరిధిలో ఉన్నాయి. చేవెళ్ల ఎంపీ స్థానం పరిధిలో మహేశ్వరం, చేవెళ్ల, శేరిలింగంపల్లి, రాజేంద్రనగర్ అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి. భువనగిరి ఎంపీ పరిధిలో ఇబ్రహీంపట్నం అసెంబ్లీ, మహబూబ్నగర్ ఎంపీ పరిధిలో షాద్నగర్ అసెంబ్లీ, నాగర్కర్నూల్ ఎంపీ పరిధిలో కల్వకుర్తి(ఆమనగల్లు, కడ్తాల్, తలకొండపల్లి, మాడ్గుల మండలాలు) అసెంబ్లీ, మల్కాజిగిరి ఎంపీ పరిధిలో ఎల్బీనగర్ నియోజకవర్గం ఉన్నది. ఆయా నియోజకవర్గాల్లో పార్టీల బలాబలాలు, మారిన రాజకీయ పరిణామాలు తాజా..లోక్సభ ఎన్నికల ఫలితాలపై ప్రభావం చూపించనున్నాయి.
జిల్లాలో లోక్సభ ఎన్నికల సందడి మొదలైంది. బలమైన అభ్యర్థులను రంగంలోకి దించి అత్యధిక ఎంపీ స్థానాలను కైవసం చేసుకునేందుకు అన్ని పార్టీలు వ్యూహ, ప్రతి వ్యూహాలకు పదునుపెడుతున్నాయి. గత అసెంబ్లీ ఎన్నికలతో పో ల్చితే సార్వత్రిక ఎన్నికల నాటికి పార్టీల బలాబలాలు మారిపోతున్నాయి. రోజురోజుకూ రాజకీయ పరిణామాలు వేగంగా మారుతుండడంతో అన్ని పార్టీలు ఆచితూచి అడుగులు వేస్తున్నాయి. అభ్యర్థుల ఎంపిక విషయంలో ఒకటికి రెండుసార్లు ఆలోచించి నిర్ణయం తీసుకుంటున్నాయి.
బీఆర్ఎస్ పార్టీ చేవెళ్ల లోక్సభ అభ్యర్థిగా కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ను, మహబూబ్నగర్ స్థానానికి సిట్టింగ్ ఎంపీ మన్నె శ్రీనివాస్రెడ్డి, మల్కాజిగిరికి రాగిడి లక్ష్మారెడ్డి పేరును అధిష్ఠానం ఖరారు చేసింది. భువనగిరి, నాగర్కర్నూల్ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉన్నది.
అదేవిధంగా భారతీయ జనతా పార్టీ చేవెళ్ల అభ్యర్థిగా కొండా విశ్వేశ్వర్రెడ్డిని, మహబూబ్నగర్కు డీకే అరుణను, భువనగిరికి బూర నర్సయ్యగౌడ్ను, నాగర్కర్నూల్కు సిట్టింగ్ ఎంపీ రాములు తనయుడు భరత్ప్రసాద్ను, మల్కాజిగిరికి ఈటల రాజేందర్ పేరును ప్రకటించింది. అభ్యర్థులను ప్రకటించే విషయంలో కాంగ్రెస్ పార్టీ వెనుకబడి ఉన్నది. చేవెళ్లకు అభ్యర్థిని ప్రకటించే విషయంలో ఇంకా ఆ పార్టీలో సందిగ్ధత నెలకొన్నది. ఇటీవల బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరిన సిట్టింగ్ ఎంపీ రంజిత్రెడ్డిని అభ్యర్థిగా ఖరారు చేసే యోజనలో ఉన్నట్లు తెలుస్తున్నది. చేవెళ్ల టికెట్ను ఆశించిన పట్నం సునీతామహేందర్రెడ్డికి మల్కాజిగిరి టికెట్ ఖాయం చేసినట్లు ప్రచారం జరుగుతున్నది. మహబూబ్నగర్ స్థానానికి వంశీచంద్రెడ్డి పేరును ప్రకటించగా..నాగర్కర్నూల్, భువనగిరి అభ్యర్థులను ఖరారు చేయాల్సి ఉన్నది.
మళ్లీ వాళ్లే ప్రత్యర్థులు..
ఎన్నికలు సమీపిస్తున్న వేళ..నేతలు పార్టీలు మారడం జోరందుకున్నది. నేతల పార్టీల మార్పుతో కొత్త సమీకరణాలు ఏర్పడుతున్నాయి. పార్టీ కండువాలు మార్చుకున్నప్పటికీ అక్కడక్కడా పాత ప్రత్యర్థులే ఈ ఎన్నికల్లోనూ తలపడే పరిస్థితులు నెలకొన్నాయి. 2019 లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి రంజిత్రెడ్డి, కాంగ్రెస్ నుంచి కొండా విశ్వేశ్వర్రెడ్డి, బీజేపీ నుంచి జనార్దన్రెడ్డి తలపడగా రం జిత్రెడ్డి గెలుపొందారు.
అయితే ఇటీవల రంజిత్రెడ్డి కాంగ్రెస్లో చేరడంతో చేవెళ్ల అభ్యర్థిగా ఆయన్నే ఆ పార్టీ ప్రకటించే అవకాశం ఉన్నది. గతంలో కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన విశ్వేశ్వర్రెడ్డి ఈసారి ఎన్నికల్లో బీజేపీ నుంచి బరిలో ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ కాసాని జ్ఞానేశ్వర్ను ఎంపీ అభ్యర్థిగా ప్రకటించింది. దీంతో రంజిత్రెడ్డి, విశ్వేశ్వర్రెడ్డిలు తాజా ఎన్నికల్లో వేర్వేరు పార్టీల నుంచి ప్రత్యర్థులుగా తలపడనున్నారు. అలాగే మహబూబ్నగర్ స్థానం నుంచి 2019 ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి మన్నె శ్రీనివాస్రెడ్డి, కాంగ్రెస్ నుంచి వంశీచంద్రెడ్డి, బీజేపీ నుంచి డీకే అరుణ పోటీ చేయగా..బీఆర్ఎస్ అభ్యర్థి మన్నె శ్రీనివాస్రెడ్డి గెలుపొందారు. ఈసారి కూడా లోక్సభ ఎన్నికల్లో పాత అభ్యర్థులు.. ఆ పార్టీల నుంచే పోటీలో ఉన్నారు.