ఇబ్రహీంపట్నంరూరల్, డిసెంబర్ 6 : ఉద్యావన సాగులో మల్చింగ్తో రైతుల ప్రయోజనాలకు మరో మైలురాయి. ముఖ్యంగా పంటలను సాగుచేసే రైతులు అధికారుల సలహాలు, సూచనల మేరకు రైతులు మల్చింగ్ పద్దతి ద్వారా పంటలను సాగుచేస్తున్నారు. దీంతో రైతులకు కలుపు నివారణ మందులు చల్లటం, కలుపును తీయడం వంటి ఎలాంటి ఖర్చులు లేకుండా ఉంటుంది. ఒక ఎకరం పొలంలో మల్చింగ్ పద్దతి ద్వారా పంటలను సాగుచేసుకునేందుకు సుమారుగా రూ.12వేల వరకు ఖర్చు అవుతుంది. అనంతరం పంటలు విత్తనాలు విత్తిన నాటి నుంచి పూర్తిగా పంట ఎండిపోయే వరకు ఎలాంటి కలుపు నివారణ పనులు లేకుండా ఉంటుంది. రైతులు మామూలుగా పండించే పంటల కంటే మల్చింగ్ పద్దతి ద్వారా 30శాతం అధికంగా పంటలను సాగుచేసుకోవచ్చునని ఉద్యానవనశాఖాధికారులు తెలియజేస్తున్నారు.
ఈ పద్ధతిలో 25,60,50,75,1000 మైక్రాన్ల మందం కలిగిన ప్లాస్టిక్ షీట్ను పూలు, పండ్ల తోటలతో పాటు కూరగాయల మొక్కల పొదలు బోదెలపై కప్పి ఉంచాలి. పండ్లతోటలకు 75 నుంచి 100మైక్రాన్లు, పూలు, పండ్లతోటలు ఇతన సత్ఫకాలిక పంటలకు 25,30,50 మైక్రాన్ల షీటును వాడుతారు. ఈ పద్ధతిలో సాగు చేసేందుకు హెక్టారుకు రూ.35వేలు ఖర్చవుతుంది. పంటలను సాగుచేసుకునేందుకు రైతు పొలం చదును చేసిన తరువాత విత్తనాలు విత్తే సమయంలో మల్చింగ్ కవర్ను తీసుకుని ముందుగా పొలంలో ప్రతి మల్చింగ్ కవర్కు నాలుగుఫీట్ల దూరం ఉండే విధంగా ఏర్పాటు చేసుకోవాలి. తరువాత డిప్పుద్వారా పంటకు నీరు చేరే సమీపంలో విత్తనాన్ని విత్తే ప్రదేశంలో మల్చింగ్ కవర్కు చిన్న రంద్రం ఏర్పాటు చేసి అందులో విత్తనానికి విత్తనానికి మధ్య సుమారు 60సెంటిమీటర్ల దూరం ఉండే విధంగా విత్తాలి. ఇలా ఏర్పాటు చేసిన మల్చింగ్ కవర్ ద్వారా సుమారు మూడు సార్లు అదే ప్రదేశంలో విత్తనాన్ని విత్తుకుని పంటలను సాగుచేసుకోవచ్చునని వ్యవసాయాధికారులు రైతులకు తెలియజేస్తున్నారు.
30 నుంచి 80శాతం సాగుకు నీరు ఆదా అవుతుంది. 70 నుంచి 90శాతం కలుపు మొక్కల బెడద తగ్గించుకోవచ్చును. ఎరువులు వృథా కాకుండా సమర్ధవంతంగా మొక్కలకు అందుతుంది. వ్యవసాయ కూలీల ఖర్చు తగ్గింపు. వేరు భాగంలో అనుకూలమైన వాతావరణ పెంచి వేరు వ్యవస్థ వృద్ధికి తోడ్పడుతుంది. వర్షాల కారణంగా మట్టి కొట్టుకుపోకుండా కాపాడుతుంది. విత్తనం మొలకెత్తేందుకు అనుకూలమైన వాతావరణం పెంచుతుంది.