పాడి బర్రెల కొనుగోలు, మినీ పాల డెయిరీలకు సబ్సిడీ రుణాలు
పథకం అమలుకు చేవెళ్ల నియోజకవర్గం ఎంపిక
మొత్తం 150 యూనిట్లు మంజూరు
ఒక్కో యూనిట్ ధర రూ.2లక్షలు
ప్రభుత్వ సబ్సిడీ రూ.1.40లక్షలు.. రుణం రూ.60వేలు
సర్వత్రా హర్షం
షాబాద్, జూలై 29 : దళితుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నది. ఇప్పటికే ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తున్న సర్కార్.. తాజాగా ‘మిల్చ్ ఆనిమల్’ అనే కొత్త పథకానికి శ్రీకారం చుట్టింది. ఎస్సీ కార్పొరేషన్ ద్వారా స్పెషల్ ఎంపవర్మెంట్ ప్రోగ్రాం కింద పాడి బర్రెలు కొనుగోలు, మినీ పాల డెయిరీల ఏర్పాటుకు సబ్సిడీ రుణాలు ఇవ్వడం ఈ పథకం ప్రధాన ఉద్దేశం. ఎస్సీ రిజర్వు నియోజకవర్గాల్లో ఈ పథకాన్ని అమలు చేయనుండగా.. జిల్లాలో చేవెళ్ల నియోజకవర్గాన్ని ఎంపిక చేసి మొత్తం 150 యూనిట్లను మంజూరు చేసింది. ఒక్కో యూనిట్ ధర రూ. 2లక్షలు. ఇందులో సబ్సిడీ రూ.1.40లక్షలు(70శాతం) ప్రభుత్వం అందించనుండగా.. మరో రూ.60వేలు బ్యాంకు రుణంగా ఇవ్వనున్నారు. ఒక్కో యూనిట్కు రెండు బర్రెలు అందిస్తారు. దళితుల ఆర్థికాభివృద్ధికి ప్రభుత్వం తీసుకుంటున్న చొరవపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్నది.
రాష్ట్రంలో దళితుల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నది. ఎస్సీ కార్పొరేషన్ ద్వారా గతంలో సబ్సిడీ రుణాలు అందించి చిరువ్యాపారాలు పెట్టుకుని జీవనం సాగించేలా చర్యలు తీసుకునేది. ప్రస్తుతం దళితబంధు పథకం ద్వారా ఒక్కో కుటుంబానికి రూ. 10లక్షలు అందించి దళితులను ఆర్థికంగా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. దీంతో పాటు తాజాగా ఎస్సీ కార్పొరేషన్ ద్వారా స్పెషల్ ఎంపవర్మెంట్ ప్రోగ్రామ్ ద్వారా 2020-21 సంవత్సరానికి గాను పాడి గేదెలు(మిల్చ్ ఎనిమల్)పథకానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఎస్సీ రిజర్వు నియోజకవర్గాల్లో దళితులకు మినీ డెయిరీలు ఏర్పాటు చేసుకునేందుకు ప్రభుత్వం సబ్సిడీ రుణాలు అందజేయనున్నది. రంగారెడ్డిజిల్లాలో చేవెళ్ల నియోజకవర్గం ఒక్కటి మాత్రమే ఎస్సీ రిజర్వు ఉండడంతో దీనిని ప్రభుత్వం ఎంపిక చేసింది. మొత్తం ఈ నియోజకవర్గానికి 150 యూనిట్లు మంజూరు చేశారు. ప్రభుత్వం ఎస్సీ నియోజవర్గాలకు ప్రత్యేకంగా పథకం చేపట్టి రుణాలు అందిస్తుండటంతో దళిత వర్గాల్లో హర్షం వ్యక్తమవుతుంది.
జిల్లాలో చేవెళ్ల ఎంపిక
రంగారెడ్డిజిల్లా పరిధిలో మొత్తం 8 అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. అందులో షాద్నగర్, ఇబ్రహీంపట్నం, రాజేంద్రనగర్, మహేశ్వరం, ఆమనగల్ (కల్వకుర్తి), శేరిలింగంపల్లి, ఎల్బీనగర్ నియోజకవర్గాలు జనరల్ రిజర్వులో ఉన్నాయి. చేవెళ్ల నియోజకవర్గం ఒక్కటే మాత్రమే ఎస్సీ రిజర్వులో ఉంది. దీంతో జిల్లాకు సంబంధించి చేవెళ్లను ఎంపిక చేసిన అధికారులు ఈ నియోజకవర్గం పరిధిలో నాలుగు మండలాలకు కలిపి 150 యూనిట్లు మంజూరు చేశారు. వారం రోజుల నుంచి ఈ పథకానికి సంబంధించి లబ్ధిదారుల నుంచి అధికారులు దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. ఒక్కో యూనిట్ ధర రూ. 2లక్షలు కాగా, రూ. 1.40లక్షలు(70శాతం)సబ్సిడీ ప్రభుత్వం అందించగా, మరో రూ. 60వేలు బ్యాంకు రుణంగా ఇవ్వనున్నారు. ఒక్కో యూనిట్కు రెండు బర్రెలు అందించనున్నారు.
లబ్ధిదారులకు భూమి తప్పనిసరి..
మిల్చ్ ఎనిమల్ పథకానికి సంబంధించి దరఖాస్తులు చేసుకునే రైతులకు తప్పనిసరిగా భూమి ఉండాలి. సుమారు 20గుంటల నుంచి ఐదు ఎకరాల్లోపు ఉన్న సన్న, చిన్నకారు దళిత రైతులు ఈ పథకానికి అర్హులు. బర్రెలకు కావాల్సిన పశుగ్రాసం పెంచేందుకు భూమి ఉన్న రైతులను ఎంపిక చేయనున్నారు. లబ్ధిదారులకు ఇచ్చే బర్రెలకు దాణా కోసం గడ్డి విత్తనాలు అందించనున్నారు. లబ్ధిదారులకు గ్రామంలో పాల సేకరణ కేంద్రం తప్పనిసరిగా ఉండాలి. చేవెళ్ల నియోజకవర్గంలోని షాబాద్, చేవెళ్ల, మొయినాబాద్, శంకర్పల్లి మండలాల పరిధిలోని గ్రామాల్లో మొత్తం 88 పాలసేకరణ కేంద్రాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఆ గ్రామాల్లోని లబ్ధిదారులను ఎంపిక చేయాలని సిబ్బందికి ఆదేశాలు సైతం జారీ చేశారు. లబ్ధిదారులకు అధికారుల ఆధ్వర్యంలో స్వయంగా బర్రెలు ఇప్పించనున్నారు. ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీ బర్రెలతో లబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
చేవెళ్లకు 150 యూనిట్లు మంజూరు
జిల్లాలోనే ఎస్సీ రిజర్వుగా ఉన్న చేవెళ్ల నియోజకవర్గాన్ని మిల్చ్ ఎనిమల్ పథకానికి ఎంపిక చేశారు. నియోజకవర్గం పరిధిలోని మండలాల్లో మొత్తం 150 యూనిట్లు మంజూరు చేశాం. ఒక్కో యూనిట్ ధర రూ. 2లక్షలు ఉండగా, ప్రభుత్వం 70శాతం సబ్సిడీ రూ. 1.40లక్షలు కాగా. రూ. 60వేలు బ్యాంకు ద్వారా రుణం ఇవ్వనుంది. ఈ డబ్బులతో రెండు బర్రెలు ఇవ్వనున్నది. ఈ పథకానికి సంబంధించిన లబ్ధిదారుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నాం. వాటిని పరిశీలించి అర్హులను ఎంపిక చేస్తాం.
మినీ డెయిరీలు ఏర్పాటు సంతోషకరం
ప్రభుత్వం దళితుల కోసం ప్రత్యేక పథకాలు అమలు చేయడం సంతోషకరం. గతంలో ఉన్న ప్రభుత్వాలు దళితులను అసలు పట్టించుకోలేదు. ఎస్సీ కార్పొరేషన్ ద్వారా చిన్న వ్యాపారాలు చేసుకునేందుకు ప్రభుత్వం రుణాలు అందించింది. దళితబంధుతో రూ. 10లక్షలు అందిస్తున్నది. తాజాగా మినీ డెయిరీల కోసం 70 శాతం సబ్సిడీపై రుణాలు అందించడం శుభపరిణామం. దళితులమంతా సీఎం కేసీఆర్కు రుణపడి ఉంటాం.
దళితుల సంక్షేమానికి సీఎం కేసీఆర్ పెద్దపీట
దళితుల సంక్షేమానికి సీఎం కేసీఆర్ పెద్దపీట వేస్తున్నారు. దళితబంధుతో ఒక్కో కుటుంబానికి రూ. 10లక్షలు అందించనున్నారు. 70 శాతం సబ్సిడీపై మినీ డెయిరీల కోసం రుణాలు అందించడం సంతోషకరం. నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో అర్హులైన దళితులు సబ్సిడీ రుణాలు సద్వినియోగం చేసుకోవాలి. సీఎం కేసీఆర్కు దళితుల పక్షాన ధన్యవాదాలు.