రంగారెడ్డి, ఏప్రిల్ 19(నమస్తే తెలంగాణ): లోక్ సభ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతుండడంతో అధికారయంత్రాంగం ఎన్నికల ఏర్పాట్లను వేగవంతం చేసింది. ముఖ్యంగా ఈవీఎంలు, ఎన్నికల సిబ్బంది నియామకం, పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ప్రక్రియ తదితర వాటిపై ఎన్నికల అధికారులు దృష్టి పెట్టారు. చేవెళ్ల పార్లమెంటుకు నిర్వహిస్తున్న ఎన్నికల్లో మొత్తం 3,595 ఈవీఎంలను వినియోగిస్తున్నారు. మరికొన్నింటిని అందుబాటులో ఉంచుతున్నారు. ఎన్నికల విధుల్లో పీవో, ఏపీవో, ఓపీవోలు మొత్తం 13,443 మంది పాల్గొంటున్నారు. వీరితోపాటు అత్యవసర సేవలకు సంబంధించి వివిధ శాఖల అధికారులు ఎన్నికల విధులను నిర్వర్తించనున్నారు. వీరందరూ పోస్టల్ బ్యాలెట్ ఓట్లను వినియోగించుకునేలా అవసరమైన చర్యలు తీసుకుంటున్నారు.
పోలింగ్కు అవసరమైన ఈవీఎంలపై అధికారులు దృష్టి సారించారు. చేవెళ్ల పార్లమెంటు పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో మొత్తం 2,877 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. వీటిల్లో 3,595 కంట్రోల్ యూనిట్లను, మరో 3,595 బ్యాలెట్ యూనిట్లు, 4,028 వీవీ ప్యాట్లను వినియోగిస్తున్నారు. పోలింగ్ సమయంలో యంత్రాలు పనిచేయకపోతే ఇబ్బంది ఉండకుండా ఉండేందుకు అదనంగా మరిన్ని కంట్రోల్ యూనిట్లను తెప్పించి గోదాంలలో భద్రపర్చారు. వీటన్నింటికీ మొదటి స్థాయి తనిఖీని పూర్తి చేశారు. త్వరలో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో రెండో స్థాయిలో తనిఖీలు నిర్వహిస్తారు.
ఒక్కో పోలింగ్ కేంద్రంలో ఒక ప్రిసైడింగ్ ఆఫీసర్(పీవో), ఒక అసిస్టెంట్ ప్రిసైడింగ్ ఆఫీసర్(ఏపీవో), ముగ్గురు సహాయక ప్రిసైడింగ్ సిబ్బంది విధులు నిర్వర్తించనున్నారు. ఈ లెక్కన మొత్తం 13,443 మంది ఉద్యోగులు ఎన్నికల విధులు నిర్వహిస్తారు. అదనంగా మరో 20 శాతం సిబ్బందిని రిజర్వ్లో ఉంచుతున్నారు. పోలింగ్ కేంద్రాల పర్యవేక్షణ కోసం 259మంది సెక్టోరల్ అధికారులను నియమించారు. ఇంకా కొంతమందిని ఎన్నికల విధులకు వినియోగించుకుంటున్నారు. ఈ క్రమంలో జిల్లా వ్యాప్తంగా పలు శాఖలకు చెందిన ఉద్యోగుల వివరాలను సేకరించి ఆన్లైన్లో నమోదు చేస్తున్నారు. ఎన్నికల సిబ్బందికి విడుతలవారీగా శిక్షణా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.
ఎన్నికల విధుల్లో ఉన్న ఉద్యోగులు, సిబ్బంది అంతా తప్పనిసరిగా ఓటు హక్కును వినియోగించుకునేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. లోక్సభ నియోజకవర్గం పరిధిలో ఓటు కలిగి ఉండి అదే నియోజకవర్గం పరిధిలో మరోచోట విధులు నిర్వహిస్తున్న వారికి ఈడీసీ(ఎలక్షన్ డ్యూటీ సర్టిఫికెట్)ద్వారా అక్కడే ఓటు హక్కును వినియోగించుకునే వెసులుబాటును ఎన్నికల సంఘం కల్పించింది. ఒక లోక్ సభ నియోజకవర్గం వారు మరో లోక్సభ నియోజకవర్గ పరిధిలో విధులు నిర్వర్తించాల్సి వస్తే పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కును వినియోగించుకునే అవకాశాన్ని కల్పిస్తున్నారు. ఫారం-12 ద్వారా దరఖాస్తు చేసుకుని పోస్టల్ బ్యాలెట్ను పొందాల్సి ఉంటుంది.
ఎన్నికల విధుల్లో ఉండే ఉద్యోగులతోపాటు పోలీస్ శాఖ, అత్యవసర సేవల విభాగాల్లో పనిచేసే విద్యుత్తు, వైద్య, రవాణా, అగ్నిమాపక, రైల్వే, రేడియో, మీడియా తదితర విభాగాల ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ను పొంది తాము విధులు నిర్వర్తించే ప్రాంతానికి సమీపంలోని ఫెసిలిటేషన్ సెంటర్లో ఓటు హక్కును వినియోగించుకోవచ్చు. వీరితోపాటు 85 ఏండ్లు దాటిన వయోవృద్ధులు, వికలాంగులకు సైతం 12-డీ ఫాం ద్వారా పోస్టల్ బ్యాలెట్ పొంది ఇంటి వద్దనే ఓటు హక్కును వినియోగించుకునే వెసులుబాటును ఎన్నికల సంఘం కల్పించింది. పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటింగ్ ప్రక్రియను మే 3వ తేదీ నుంచి ప్రారంభించి 8 లోపుగా పూర్తి చేసేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.