వికారాబాద్, జనవరి 27 (నమస్తే తెలంగాణ): అంధత్వ నివారణే లక్ష్యంగా ప్రభుత్వం ప్రారంభించిన కంటి వెలుగు రెండో విడుత కార్యక్రమం వికారాబాద్ జిల్లాలో ఉత్సాహంగా కొనసాగుతున్నది. శుక్రవారానికి ఆరో రోజుకు చేరుకున్నది. జిల్లాలో ఏర్పాటు చేసిన 42 బృందాల ద్వారా ప్రజలకు కంటి పరీక్షలు చేస్తున్నారు. ఆశ వర్కర్లు, ఏఎన్ఎంలు ప్రతి ఒక్కరూ కంటి పరీక్షలు చేయించుకునేలా ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. దీంతో ప్రజల నుంచి ఈ కార్యక్రమానికి మంచి స్పందన వస్తున్నది. స్థానిక ప్రజాప్రతినిధులు, మండలాల నోడల్ అధికారులు కంటి వెలుగు శిబిరాలను సందర్శించి పర్యవేక్షిస్తున్నారు. శుక్రవారం జిల్లాలో 6,363 మందికి కంటి పరీక్షలు నిర్వహించారు. వీరిలో 1,020 మందికి కంటి అద్దాలను పంపిణీ చేయగా 426 మందికి అద్దాలను ఆర్డరిచ్చారు. ఆర్థిక స్థోమత లేక వైద్య పరీక్షలు చేయించుకోలేని నిరుపేదల్లో కంటి వెలుగు కార్యక్రమం ఎంతో ధైర్యాన్ని నింపుతున్నది.
రంగారెడ్డి జిల్లాలో 13,321 మందికి పరీక్షలు
షాబాద్, జనవరి 27: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న రెండో విడుత కంటి వెలుగు కార్యక్రమం రంగారెడ్డి జిల్లాలో జోరుగా కొనసాగుతున్నది. గ్రామాలు, పట్టణాల్లో నిర్వహిస్తున్న క్యాంపులకు ప్రజల నుంచి అనూహ్య స్పందన లభిస్తున్నది. శుక్రవా రం రంగారెడ్డి జిల్లాలో 13,321 మందికి కంటి పరీక్షలు చేయగా.. అందులో 1,760 మందికి కంటి అద్దాలను పంపిణీ చేశారు. 1,505 మందికి ప్రిస్క్రిప్షన్ అద్దాల కోసం వైద్యులు ఆర్డర్ ఇచ్చారు. ఆయా గ్రామాల్లో కొనసాగుతున్న కంటి వెలుగు క్యాంపులను వైద్యాధికారులు ప్రజాప్రతినిధులు సందర్శిస్తున్నారు. ప్రజలకు పకడ్బందీగా పరీక్షలు నిర్వహించాలని సూచిస్తున్నారు.
80 బృందాలతో..
రంగారెడ్డి జిల్లాలోని చేవెళ్ల, షాద్నగర్, ఇబ్రహీంపట్నం, ఆమనగల్లు, మహేశ్వరం, రాజేంద్రనగర్, శేరిలింగంపల్లి నియోజకవర్గాల పరిధిలో ఏర్పాటు చేసిన 80 బృందాల ద్వారా శుక్రవారం 13,321 మందికి వైద్యులు కంటి పరీక్షలు నిర్వహించారు.