షాబాద్, ఫిబ్రవరి 8 : గ్రామాల్లో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న కంటి వెలుగు కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తున్నది.ప్రజలు పెద్దఎత్తున తరలివచ్చి పరీక్షలు చేయించుకుంటున్నారు. జిల్లాలో 80 బృందాల ద్వారా వైద్యసిబ్బంది ప్రజలకు కంటి పరీక్షలు నిర్వహిస్తున్నారు. అవసరమున్న వారికి కంటి అద్దాలతో పాటు, ఉచితంగా మందులు పంపిణీ చేస్తున్నారు. కంటి వెలుగు క్యాంపులను ఆరోగ్యశాఖ అధికారులు సందర్శించి సిబ్బందికి సలహాలు, సూచనలు అందిస్తున్నారు.
16,538 మందికి కంటి పరీక్షలు
చేవెళ్ల, షాద్నగర్, ఇబ్రహీంపట్నం, ఆమనగల్లు, మహేశ్వరం, రాజేంద్రనగర్, శేరిలింగంపల్లి నియోజకవర్గాల పరిధిలో 80 బృందాల ద్వారా ఏర్పాటు చేసిన కంటి వెలుగు శిబిరాల్లో 16,538 మందికి కంటి పరీక్షలు నిర్వహించారు. ఇందులో 2,234 మందికి కంటి అద్దాలు పంపిణీ చేశారు. 1,960 మందికి ప్రిస్క్రిప్షన్ అద్దాల కోసం ఆర్డర్ చేశారు. గ్రామాలవారీగా కేటాయించిన రోజుల్లో ముందస్తు సమాచారాన్ని ప్రజలకు అందించి ప్రతి ఒక్కరికి కంటి పరీక్షలు నిర్వహించడంతోపాటు అవసరమైన అద్దాలను వైద్యసిబ్బంది పంపిణీ చేస్తున్నారు. పరీక్షలు చేయించుకున్న వారి వివరాలను డేటా ఎంట్రీ ఆపరేటర్ల ద్వారా ఎప్పటికప్పుడూ ఆన్లైన్లో నమోదు చేయిస్తున్నారు.
65 గ్రామాలు, 18 వార్డుల్లో కంటి వెలుగు శిబిరాలు
బొంరాస్పేట, ఫిబ్రవరి 8 : అంధత్వం, కంటి జబ్బుల నివారణే లక్ష్యంగా ప్రభుత్వం ప్రారంభించిన కంటి వెలుగు రెండో విడుత కార్యక్రమం వికారాబాద్ జిల్లాలో ఉత్సాహంగా కొనసాగుతున్నది. నేత్ర సంబంధిత వ్యాధులతో వచ్చినవారికి జిల్లాలోని 42 కంటి వెలుగు కేంద్రాల్లో వైద్య బృందాలు అప్పటికప్పుడే పరీక్షలు నిర్వహిస్తున్నాయి. ఆశ కార్యకర్తలు, ఏఎన్ఎంలు ప్రతి ఒక్కరూ కంటి పరీక్షలు చేయించుకునేలా ప్రజలను చైతన్యం చేస్తున్నారు. బుధవారం జిల్లాలో 5710 మందికి కంటి పరీక్షలు నిర్వహించారు. వీరిలో 987 మందికి రీడింగ్ గ్లాసులు పంపిణీ చేయగా, 987 మందికి అద్దాలకు ఆర్డరిచ్చారు. జిల్లాలో ఇప్పటివరకు 61 గ్రామాలు, 18 వార్డుల్లో కంటి వెలుగు వైద్య శిబిరాలను నిర్వహించినట్లు డీఎంహెచ్వో పాల్వన్కుమార్ తెలిపారు.
చాలా బాగుంది : కమలమ్మ, కౌకుంట్ల, చేవెళ్ల మండలం
ఊర్లకే వచ్చి కంటి వెలుగు శిబిరం ఏర్పాటు చేసి పరీక్షలు చేయడం చాలా బాగుంది. ఇలాంటి కార్యక్రమాలు నేనెప్పుడూ చూడలేదు. పేదల కోసం సీఎం కేసీఆర్ సారు శానా బాగా ఆలోచిస్తుండు. నాకు కండ్లు మసకగా కనిపిస్తున్నాయ్ అని వెళ్లగా పరీక్షలు చేసి అద్దాలు ఇచ్చిండ్రు. కంటి పరీక్షలకు వేరే చోటుకు వెళ్లడం తప్పింది. కేసీఆర్ సార్కు రుణపడి ఉంటాం.
సీఎం కేసీఆర్కు ధన్యవాదాలు
– చంద్రారెడ్డి, అలాంఖాన్గూడ, శంకర్పల్లి మండలం
కంటి వెలుగును ప్రారంభించిన సీఎం కేసీఆర్కు ధన్యవాదాలు. పేదలు ప్రైవేట్ దవాఖానల్లో చూపించునే స్థోమత ఉండదని గ్రహించి కంటి వెలుగును ప్రారంభించడం మా అదృష్టం. కంటి పరీక్షలు చేసి అక్కడే అద్దాలు ఇస్తుండ్రు. దేశంలోనే ఎక్కడా లేని సంక్షేమ పథకాలు తెలంగాణలో ప్రవేశపెట్టిన కేసీఆర్కు ప్రజలంతా అండగా ఉండాలి.