ఎస్సీ (షెడ్యూల్డ్ కులాల) విద్యార్థుల అభ్యున్నతికి సీఎం కేసీఆర్ ప్రభుత్వం ఇతోధికంగా కృషి చేస్తున్నది. పాఠశాలలు(ప్రీ మెట్రిక్), కళాశాల(పోస్ట్మెట్రిక్)ల్లో చదువుతున్న విద్యార్థులు చదువులో వెనుకబడిపోకుండా ఉండేందుకు ప్రతి ఏడాది కోట్లాది రూపాయల బోధ నారుసుము, ఫీజు రీయింబర్స్మెంట్, ఉపకార వేతనాలను అందిస్తూ ప్రోత్సహిస్తున్నది. అంతేకాకుండా ఉన్నత చదువులు చదివే వారికి విదేశీ విద్యను సైతం అందుబాటులోకి తెచ్చింది. ఇందుకోసం ఒక్కోవిద్యార్థికీ రూ.20లక్షల వరకు అందిస్తున్నది. కాగా రంగారెడ్డి జిల్లాలోని ప్రభుత్వ, మండల పరిషత్, జిల్లా పరిషత్ స్కూళ్లు, కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులు ఈ విద్యాసంవత్సరంలో ఉపకార వేతనాలకోసం ఇప్పటికే 25,138 మంది ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోగా అందులో 25 వేల మందిని అధికా రులు అర్హులుగా తేల్చారు. మిగిలిన వారు ధ్రువపత్రాలను సమర్పించని కారణంగా వా రి దరఖాస్తులను తిరస్కరించినట్లు జిల్లా ఎస్సీ అభివృద్ధిశాఖ అధికారి రామారావు తెలిపారు. కాగా, జిల్లాలో 8,960 మంది విద్యార్థులకు ఉపకార వేతనాలు మంజూరు కాగా.. 7,943 దరఖాస్తులుకళాశాలల వద్దే పెండింగ్లో ఉన్నట్లు ఆయన తెలిపారు. దరఖాస్తులకు తుది గడువు తేదీ మార్చి 31 అని ఆయన తెలిపారు.
-రంగారెడ్డి, ఫిబ్రవరి 3(నమస్తే తెలంగాణ)
రంగారెడ్డి, ఫిబ్రవరి 3 (నమస్తే తెలంగాణ) : ఎస్సీ (షెడ్యూల్డ్ కులాల) విద్యార్థుల అభ్యున్నతికి ప్రభుత్వం చేయూతను ఇస్తున్నది. ఎస్సీ విద్యార్థుల్లో విద్యా పరమైన పురోగతికి ఉపకార వేతనాలు, ప్రోత్సాహకాలను అందిస్తూ, ఉన్నత చదువులు చదివే వారికి విదేశీ విద్యను అందుబాటులోకి తెచ్చింది. ఏటా వందల కోట్ల రూపాయలను ఎస్సీ అభివృద్ధి శాఖ అధ్యక్షతన ప్రభుత్వం ఖర్చు చేస్తున్నది. విద్యా పరంగా ఎలాంటి అవకతవకలు ఏర్పడకుండా ఎస్సీ విద్యార్థుల బోధనా రుసుములు, ఉపకార వేతనాలను రాష్ట్ర ప్రభుత్వం నేరుగా వారి ఖాతా/ అకౌంట్లలోనే జమ చేస్తున్నది. బోధన ఫీజులు కళాశాలలకు కాకుండా నేరుగా విద్యార్థుల ఖాతాల్లోకి జమ చేస్తేనే బాగుంటుందని రాష్ట్ర అధికార యంత్రాంగం భావించి ప్రత్యేక నిర్ణయం తీసుకున్నది. షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో జిల్లా అధికార యంత్రాంగం జిల్లాలోని పాఠశాలలు, కళాశాలలు, పలు విద్యా సంస్థల్లో చదువుతున్న విద్యార్థులు ఉపకార వేతనాలను పొందేందుకు ఆన్లైన్లోనే దరఖాస్తు చేసుకునేందుకు వెబ్సైట్ను సైతం సర్కార్ అందుబాటులోకి తెచ్చింది. కాగా, జిల్లా వ్యాప్తంగా ఈ విద్యా సంవత్సరానికి గాను 25,138 మంది విద్యార్థులు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకున్నారు.
25వేల మంది విద్యార్థులు అర్హులుగా నిలిచారు. మిగిలిన వారు ఆయా ధ్రువ పత్రాల లేమి కారణంగా అనర్హులుగా గుర్తించారు. ఒక 35 దరఖాస్తులు తిరస్కరించబడినట్టు జిల్లా ఎస్సీ అభివృద్ధి శాఖ అధికారి రామారావు తెలిపారు. కాగా, ఇప్పటికే 8,960 మంది విద్యార్థులకు ఉపకార వేతనాలు మంజూరయ్యాయి. 7,943 దరఖాస్తులు కళాశాలల వద్దే పెండింగ్లో ఉన్నాయి. ఆధార్ను పొందుపర్చాల్సినవిగా 2,670 దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి. కాగా, 838 దరఖాస్తులు అర్హత పొందినప్పటికీ ఆయా విద్యా సంస్థల నుంచి సమర్పించాల్సి ఉందని జిల్లా అధికారి తెలిపారు. వివిధ కారణాలతో ఆయా విద్యా సంస్థల వద్ద మరో 5వేల దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి.
ప్రీ మెట్రిక్, పోస్ట్ మెట్రిక్ ఉపకారాలు..
జిల్లాలో ప్రభుత్వ, జిల్లా పరిషత్, మండల పరిషత్ పాఠశాలల్లో చదువుతున్న షెడ్యూల్డ్ కులాల విద్యార్థులకు ‘ప్రీ మెట్రిక్’ ఉపకార వేతనాలను రాష్ట్ర ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. ఐదో తరగతి నుంచి 8వ తరగతి వరకు చదువుతున్న డే స్కాలర్ విద్యార్థులకు నెలకు బాలురకు రూ.100, బాలికలకు రూ.150 చొప్పున మంజూరు చేస్తున్నారు. ప్రీ మెట్రిక్లో భాగంగా 2022 – 23వ సంవత్సరానికి 649 మంది విద్యార్థులకు గాను రూ.6.75 లక్షల నిధులను మంజూరు చేసింది. కాగా, జిల్లాలో ప్రభుత్వ, జిల్లా పరిషత్, మండల పరిషత్ పాఠశాలలో చదువుతున్న షెడ్యూల్డ్ కులాల 9, 10వ తరగతి విద్యార్థులకు ఉపకార వేతనాలను మంజూరు చేస్తున్నది. 2022 – 23వ విద్యా సంవత్సరానికి 103 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. డే స్కాలర్ విద్యార్థులకు నెలకు రూ.150, వసతి గృహ విద్యార్థులకు రూ.350 ఉపకార వేతనాలను అందిస్తున్నారు. అయితే, పుస్తకాలు కొనుగోలు చేసేందుకు డే స్కాలర్ విద్యార్థులకు రూ.750, వసతి గృహ విద్యార్థులకు రూ.1000 అందిస్తున్నారు. ఈ సంవత్సరం 368 మంది విద్యార్థులకు రూ.13.98 లక్షల నిధులు మంజూరయ్యాయి.
పోస్ట్ మెట్రిక్లో భాగంగా విద్యార్థులు ఇంటర్మీడియెట్ ఆపై ఇతర కోర్సుల్లో చదువుతున్న విద్యార్థుల ఫీజులు, మెయింటెనెన్స్ చార్జీలను ఎస్సీ అభివృద్ధి శాఖ చెల్లిస్తున్నది. విద్యార్థుల తల్లిదండ్రుల సంవత్సర ఆదాయం రూ.2 లక్షలకు మించని వారికి ఉపకారాన్ని అందిస్తున్నది. అయితే, జిల్లాలో 692 కళాశాలలు ఉన్నాయి. ఇంటర్, ఐటీసీ, ఎంపీహెచ్డబ్ల్యూ, డీఎంఎల్టీ, బీఏ, బీ.కాం, బీఎస్సీ, బీఈడీ, డీఈడీ, ఇంజినీరింగ్, ఎంబీబీఎస్, ఎంసీఏ, ఎంబీఏ, ఎం.కాం, ఎమ్మెస్సీ, డిప్లమా, నర్సింగ్, ఎల్ఎల్బీ విద్యార్థులకు వివిధ విభాగాలకు సంబంధించి రూ.500 నుంచి రూ.1500 వరకు అందిస్తున్నది.
ఫీజు రీయింబర్స్మెంట్
కళాశాలల విద్యార్థుల నిమిత్తం 2022 – 23వ విద్యా సంవత్సరంలో మొత్తం 25,085 మంది విద్యార్థులకు ప్రభుత్వం మెయింటెనెన్స్కు రూ.1215.88 లక్షల నిధులను కేటాయించింది. వాటిలో రూ.1114.50 లక్షల నిధులను ఖర్చు చేసింది. ఫీజు రియింబర్స్మెంట్కు గాను రూ.5451.57 లక్షల నిధులను కేటాయించింది. వాటిలో ఆ మొత్తాన్ని ఖర్చు చేసింది. కాగా, గత సంవత్సరం, 19,238 మంది విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ను వినియోగించుకున్నారు.
అందుబాటులో విదేశీ విద్య..
విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించాలనుకునే వారు జిల్లాలో స్టేట్ లెవల్ సెలక్షన్ కమిటీతో ఎంపిక చేయబడుతున్నారు. విదేశీ విద్య నిమిత్తం ఒక్కొక్క విద్యార్థికి కోర్సు పూర్తి చేసేందుకు గాను ప్రభుత్వం రూ.20 లక్షల ఆర్థిక సాయాన్ని అందిస్తున్నది. అందులో భాగంగా ఇప్పటికీ జిల్లా వ్యాప్తంగా 60 మంది విద్యార్థులకు విదేశీ విద్యను అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సహకారం అందించింది. అంతే కాకుండా, కులాంతర వివాహాలు చేసుకున్న ఎస్సీ జంటలకు ‘డాక్టర్ అంబేద్కర్ కులాంతర వివాహ పథకం’ కింద ప్రోత్సాహక బహుమతిగా రూ.2,50,000 అందిస్తున్నది. ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా 70 మందికి పైగా జంటలకు ప్రభుత్వం నిధులు వెచ్చించింది.
సాయం పొందేందుకు సంసిద్ధులై ఉండాలి..
షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖకు ప్రభుత్వ పరంగా ఎలాంటి నిధుల కొరత లేదు. 2021 – 22వ సంవత్సరంలో 21,281 మంది విద్యార్థులకు గాను కళాశాల విద్యార్థులకు రూ.5227.81 లక్షల నిధులు, పాఠశాల విద్యార్థులకు రూ.857.73 లక్షల నిధులను వెచ్చించింది. కాగా, 2022-23వ సంవత్సరానికి గాను 749 మంది విద్యార్థులకు ఇప్పటికే రూ.433.29 లక్షలను వ్యయం చేసింది. విద్యార్థులు ఉపకార వేతనాలకు ఈ మార్చి 31వ తేదీలోగా, విదేశీ విద్యకు సంబంధించి సకాలంలో దరఖాస్తు చేసుకుంటే ప్రభుత్వ సాయం అందుబాటులోకి వస్తుంది.
– జే.రామారావు, జిల్లా షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ డిప్యూటీ డైరెక్టర్/అధికారి, రంగారెడ్డి జిల్లా