నిరంతర విద్యుత్తు సరఫరాతో ఉమ్మడి జిల్లాలో పారిశ్రామికాభివృద్ధి పరుగులు పెడుతున్నది. సమైక్య రాష్ట్రంలో ఎడాపెడా కరెంట్ కోతలు, వేసవి వచ్చిందంటే పవర్ హాలిడేలతో పారిశ్రామిక రంగం కుదేలైంది. దీంతో ఎంతోమంది కార్మికులు ఉపాధి కోల్పోయి రోడ్డున పడే పరిస్థితి ఉండేది. స్వరాష్ట్రం సిద్ధించాక సీఎం కేసీఆర్ ప్రత్యేక చొరవతో విద్యుత్ కొరతను అధిగమించగా.. ఐదేండ్లుగా పరిశ్రమలకు నిరంతరం నాణ్యమైన విద్యుత్తు సరఫరా అవుతున్నది. ఫలితంగా 24 గంటలూ ఉత్పత్తి జరుగుతుండగా.. ఉపాధిఅవకాశాలు సైతం మెరుగుపడ్డాయి. షిఫ్ట్లవారీగా ఎంతోమంది కార్మికులు జీవనోపాధి పొందుతున్నారు. సకల సౌకర్యాలు, ప్రభుత్వ ప్రోత్సాహం ఉండడంతో పలు బహుళజాతి సంస్థలు ఇక్కడ తమ పరిశాఖలను ఏర్పాటు చేసేందుకు ముందుకొస్తున్నాయి. రంగారెడ్డి జిల్లాలో ఇప్పటివరకు 10,224 పరిశ్రమలుండగా.. మరిన్ని ఏర్పాటు కానున్నాయి. అలాగే వికారాబాద్ జిల్లాలో 3,217 పరిశ్రమలుండగా.. 10 వేల మందికి ఉపాధి లభించింది. పరిశ్రమల ఏర్పాటుతో గత ఐదేండ్లలో జిల్లాకు రూ.1530 కోట్ల పెట్టుబడులు వచ్చాయి.
వికారాబాద్, జనవరి 2 (నమస్తే తెలంగాణ) : రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన చర్యలతో ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో పారిశ్రామిక రంగం వేగంగా అభివృద్ధి చెందుతున్నది. టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పరిశ్రమలకు 24 గంటలపాటు విద్యుత్తు సరఫరా చేస్తూ పారిశ్రామికవేత్తలను మరింత ప్రోత్సహిస్తున్నది. పరిశ్రమలకు నిరంతర విద్యుత్తు సరఫరాతో జిల్లాల్లో పెద్దమొత్తంలో పరిశ్రమలు ఏర్పాటయ్యాయి. గతంలో పగలు రెండు గంటలపాటు, రాత్రి రెండు గంటలపాటు అధికారికంగా పరిశ్రమలకు పవర్ కట్ చేసేవారు. కానీ అనధికారికంగా రోజుకు ఆరేడు గంటలపాటు విద్యుత్తు సరఫరా నిలిపివేసేవారు. గతంలో విద్యుత్తు సరఫరా సరిగ్గా లేకపోవడంతో రోజుల తరబడి, ఒక్కోసారి నెలల తరబడి తమ కంపెనీలను మూత వేసుకోవాల్సిన పరిస్థితులుండేవి.
వేసవికాలం వచ్చిందంటే చాలు.. చాలా కంపెనీలు పవర్ హాలీడేగా ప్రకటించేవి. దీంతో చాలా మంది ఉపాధి కోల్పోయి రోడ్డుపై పడేవారు. కానీ ప్రస్తుతం పవర్ కట్కు రోజులు పోయాయి. రాష్ట్ర ప్రభుత్వం పారిశ్రామిక రంగాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు ఇతర రాష్ర్టాల నుంచి విద్యుత్తును కొనుగోలు చేసి పరిశ్రమలకు నిరంతర విద్యుత్తును సరఫరా చేస్తున్నది రాష్ట్ర ప్రభుత్వం. మరోవైపు పరిశ్రమల ఏర్పాటుతో ఇటు పారిశ్రామిక రంగం అభివృద్ధి చెందడంతోపాటు ఎంతోమంది నిరుద్యోగులకు ఉపాధి లభించింది. వికారాబాద్ జిల్లాలోని చిన్న, మధ్య, భారీ తరహా పరిశ్రమలతో ఇప్పటివరకు సుమారు 10వేల మందికి ఉపాధి లభించింది. జిల్లావ్యాప్తంగా 3217 ఇండస్ట్రియల్ విద్యుత్తు కనెక్షన్లుఉన్నాయి.
భారీగా పెరిగిన ఉత్పత్తులు
రాష్ట్ర ప్రభుత్వం పారిశ్రామిక రంగానికి ఇస్తున్న అధిక ప్రాధాన్యతతో జిల్లాలో భారీగా పరిశ్రమలు ఏర్పాటయ్యాయి. జిల్లాలోని ఆయా పరిశ్రమల ద్వారా అయ్యే ఉత్పత్తి కూడా భారీగా పెరిగింది. గత ఐదేండ్లలో రూ.1530 కోట్ల పెట్టుబడులు పరిశ్రమల ఏర్పాటుతో వచ్చాయి. ఇందులో సోలార్, పవన విద్యుత్తు పరిశ్రమల ఏర్పాటుతో రూ.1000 కోట్ల పెట్టుబడులు పెట్టగా.. మిగతా చిన్న, మధ్యతరహా పరిశ్రమల ఏర్పాటుతో రూ.500 కోట్లకుపైగా పెట్టుబడులు వచ్చాయి. జిల్లాలో ప్రధానంగా పవర్, ఫార్మా రీసైక్లింగ్, ఐరన్, ప్లాస్టిక్, గ్లాస్, మైనింగ్, పర్యాటక రంగం, విత్తనోత్పత్తి పరిశ్రమలను ఏర్పాటు చేశారు.
పవన విద్యుత్తు ఉత్పత్తి కేంద్రాల ఏర్పాటుకు చర్యలు
జిల్లాలో పవన విద్యుత్తు పరిశ్రమకు సంబంధించి ఇప్పటికే నజీరాబాద్ కేంద్రంగా పవన విద్యుత్తు ఉత్పత్తి కేంద్రం కొనసాగుతుండగా.. మరొక పవన విద్యుత్తు ఉత్పత్తి కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టారు. ప్రధానంగా జిల్లాలో సోలార్ పవర్ పరిశ్రమను మరింత అభివృద్ధి చేసే దిశగా సంబంధిత అధికారులు చర్యలు చేపట్టారు. ప్రస్తుతం జిల్లాలో మోమిన్పేట్, వెల్చాల్, పెద్ద ఉమ్మెంతాల్, ఉద్దమర్రి, పీరంపల్లి, కొత్తగడి, నస్కల్, కుమ్మెర, లింగుర్తి ప్రాంతాల్లో సోలార్ పవర్ ఉత్పత్తి కేంద్రాలున్నాయి. జిల్లాలో మైనింగ్ క్వారీలకు సంబంధించి మర్పల్లి, పెద్దేముల్, కందనెల్లి, ధారూరు, మంబాపూర్, కోట్పల్లి ప్రాంతాల్లో స్టోన్ క్రషర్స్, బెంటోనైట్ పరిశ్రమలున్నాయి. ఇప్పటికే పరిగి, కొడంగల్ మండలాల్లో వరి విత్తనోత్పత్తి కేంద్రాలుండగా కొడంగల్లో మరొక విత్తనోత్పత్తి కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టారు. ఆహార ఇండస్ట్రియల్ పార్కుల్లో ఆహార శుద్ధి పరిశ్రమలను ఏర్పాటు చేయనున్నారు. సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన నూతన పారిశ్రామిక విధానం టీఎస్-ఐపాస్తో పారిశ్రామిక రంగానికి నూతన శకం మొదలైంది. నూతన పారిశ్రామిక విధానంతో జిల్లాలో పరిశ్రమల స్థాపనకు ఔత్సాహికులు ముందుకు వస్తున్నారు.
నిరంతర విద్యుత్తో వేల మందికి ఉపాధి
షాబాద్, జనవరి 2 : తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న 24 గంటల నిరంతర విద్యుత్ సరఫరాతో పరిశ్రమలు సాఫీగా నడుస్తున్నాయి. నగరానికి దగ్గర్లో ఉన్న రంగారెడ్డిజిల్లాలో భారీగా పెట్టుబడులు పెట్టేందుకు పరిశ్రమల నిర్వాహకులు ముందుకు వస్తున్నారు. నిరుద్యోగ యువతకు కూడా ఉపాధి అవకాశాలు దొరుకుతున్నాయి. నిరంతర విద్యుత్ సరఫరాతో పరిశ్రమల నిర్వాహకులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
రంగారెడ్డి జిల్లావ్యాప్తంగా చేవెళ్ల, షాద్నగర్, ఇబ్రహీంపట్నం, మహేశ్వరం, ఆమనగల్లు(కల్వకుర్తి), రాజేంద్రనగర్, శేరిలింగంపల్లి నియోజకవర్గాల పరిధిలో ఏర్పాటు చేసిన 10,224 పరిశ్రమలకు రాష్ట్ర ప్రభుత్వం 24 గంటల నిరంతర విద్యుత్ సరఫరా చేస్తున్నది. కొత్త పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు కూడా పెద్దఎత్తున పెట్టుబడిదారులు ముందుకు వస్తున్నారు. దీంతో జిల్లాకు చెందిన నిరుద్యోగ యువతకు పరిశ్రమల్లో నిరంతరం ఉపాధి లభిస్తున్నది. సీఎం కేసీఆర్ అందిస్తున్న నిరంతర విద్యుత్ సరఫరాతో అన్ని వర్గాల ప్రజలకు ఎంతో మేలు జరగడంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు.
పనులు సాఫీగా నడుస్తున్నాయి
– కమ్మరి నర్సింహులు, బొంరాస్పేట
పరిశ్రమలకు నిరంతరంగా విద్యుత్తు సరఫరా చేయడం వల్ల ఎలాంటి అవాంతరాలు లేకుండా పనులు చేసుకుంటున్నాం. అంతకు ముందు విద్యుత్తు సరఫరా అస్తవ్యస్తంగా ఉండేది. ఎన్ని గంటలు కరెంట్ వస్తుందో చెప్పలేని పరిస్థితి. కొత్త ఇండ్ల నిర్మాణానికి దర్వాజలు, తలుపులు, కిటికీలు చేయడానికి ఆర్డర్లు తీసుకోవాలంటే భయంగా ఉండేది. రోజులో మూడు నాలుగు గంటలు కూడా మిషన్లు పని చేసేవి కావు. ఇప్పుడు ఆ చింతలేదు. ఎన్ని ఆర్డర్లు తీసుకున్నా నిరంతర విద్యుత్తు సరఫరా వల్ల సమయానికి పనులు పూర్తిచేసి అప్పచెబుతున్నాం. పరిశ్రమలకు నిరంతర విద్యుత్తు సరఫరా బాగుంది.
ఆగకుండా పనులు జరుగుతున్నాయి : నయీం, తాండూరు స్టోన్ మర్చెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు
తెలంగాణలో 24 గంటలు కరెంట్ ఉండడంతో తాండూరులోని నాపరాతి పరిశ్రమల్లో పనులు వేగంగా జరుగుతున్నాయి. దీంతో గతం కంటే ఎక్కువగా నాపరాతి విక్రయాలు జరుపుతున్నాం. కూలీలకు కూడా మంచి పనులు దొరుకుతున్నాయి. ఒకప్పుడు కరెంట్ కోతలతో నాపరాతి వ్యాపారం చాలా నష్టాల్లో ఉండేది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక వ్యాపారం చాలా మంచిగా నడుస్తున్నది. నిరంతర విద్యుత్తు ఇస్తున్న తెలంగాణ సర్కార్కు కృతజ్ఞతలు.
లాభాల్లో పరిశ్రమలు
– పినెముల శేఖర్, స్టోన్ వ్యాపారి, తాండూరు
తెలంగాణలో కరెంట్ కష్టాలు ఉండరాదని సీఎం కేసీఆర్ విద్యుత్ రంగంలో పూర్తి స్థాయి సంస్కరణలు తీసుకురావడంతో వ్యవసాయం మొదలుకొని అన్ని రంగాలకు 24 గంటలు నిరంతర విద్యుత్తు అందుతుండడంతో పరిశ్రమలు లాభాల బాటలో పయనిస్తున్నాయి. తాండూరు ప్రాంతంలో ఉన్న నాపరాతి, సుద్ద, సిమెంట్ కర్మాగారాలు మంచిగా నడుస్తున్నాయి. ఒకప్పుడు నష్టాల్లో ఉన్న మేము ఇప్పుడు చక్కగా వ్యాపారం సాగిస్తున్నాం. రాష్ట్రంలో కరెంట్ కోతలు లేకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్న ప్రభుత్వానికి కృతజ్ఞతలు.
నిరంతర విద్యుత్ సరఫరాతో ఇబ్బంది లేకుండా జీవనోపాధి: ఫరూఖ్, పిండిగిర్ని యజమాని, పరిగి
నిరంతర విద్యుత్ సరఫరాతో జీవనోపాధికి ఇబ్బంది లేకుండా ఉంది. గతంలో కరెంట్ ఎప్పుడొస్తుందో.. ఎప్పుడుపోతుందో తెలువకుండా ఉండేది. ప్రస్తుతం నిరంతరంగా విద్యుత్తు సరఫరా అవుతుండటంతో విద్యుత్తుపై ఆధారపడిన వ్యాపారులు ఆనందంగా జీవనోపాధి పొందుతున్నారు.
ఆయిల్ మిల్ సాఫీగా నడుస్తున్నది
– నక్క అవిలాశ్గౌడ్, ఆయిల్మిల్, కుమ్మరిగూడ
గతంలో కరెంట్ సక్రమంగా లేకపోవడంతో పిండి గిర్నీలు, ఆయిల్ మిల్లు నడిచేవి కాదు. తెలంగాణ ఏర్పడిన తర్వాత 24గంటల కరెంట్ అందిస్తామని హామీ ఇచ్చిన సీఎం కేసీఆర్.. కొద్దికాలంలోనే ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నారు. ఐదేండ్లుగా వ్యవసాయంతోపాటు, ఇండ్లు, పరిశ్రమలకు కరెంట్ అందిస్తున్నారు. నిత్యం కరెంట్తో నడిచే పనులు ఎక్కడ కూడా ఆగడంలేదు. కేసీఆర్ అమలు చేస్తున్న పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయి.
24 గంటల విద్యుత్తో అధిక ఉత్పాదకత : విఠల్రెడ్డి,
పెన్నార్ కంపెనీ, వెల్చాల్
రాష్ట్రం మొత్తం 24 గంటల విద్యుత్తు అందించడం చాలా అభినందనీయం. దీంతో కంపెనీల్లో అధిక ఉత్పాదకత సాధించడంతో కంపెనీకి లాభం చేకూరుతుంది. యువతకు, కంపెనీ చుట్టుపక్కల గ్రామాల ప్రజలకు ఉపాధి లభిస్తున్నది. ఇతర రాష్ర్టాల్లో విద్యుత్ సమస్యలతో కంపెనీ యాజమాన్యాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
చిన్న పరిశ్రమలకు ప్రభుత్వం ప్రోత్సాహం
– శ్రీదేవి, అధ్యక్షురాలు, శ్రీరామలింగేశ్వర సిరి ధాన్యాల ఉత్పత్తిదారుల సంఘం, కులకచర్ల
ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లో చిన్న పరిశ్రమల ద్వారా పలు రకాలుగా ఉపాధి అవకాశాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నది. దీంతో ప్రజలు శాశ్వత జీవనోపాధి పొందేందుకు అవకాశాలున్నాయి. చిన్న పరిశ్రమల స్థాపన ద్వారా తీసుకున్న రుణాలు చెల్లించడంతోపాటు ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి ఉపయోగపడుతుంది.