న్యూఢిల్లీ : కరోనా మరణ మృదంగం మోగిస్తున్నది. దేశంలో కరోనా మరణాలు మూడులక్షలకు చేరువయ్యాయి. రోజువారీ కరోనా కేసులు మొన్నటి వరకూ రోజుకు 4 లక్షలకుపైగా నమోదవగా.. ప్రస్తుతం మూడు లక్షలకు దిగువకు చేరాయి. కొద్ది రోజులుగా దేశవ్యాప్త కరోనా కేసుల సంఖ్యలో తగ్గుదల కనిపిస్తున్నా.. మరణాల సంఖ్య ఆందోళన కలిగిస్తోంది. గడిచిన 24 గంటల్లో 2,40,842 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వశాఖ తెలిపింది. తాజాగా వరుసగా ఏడో రోజు మూడు లక్షల కంటే తక్కువ కేసులు నమోదయ్యాయి.
తాజాగా 3,741 మంది వైరస్ బారినపడి ప్రాణాలు కోల్పోయారు. మరో వైపు పెద్ద ఎత్తున బాధితులు మహమ్మారి నుంచి కోలుకున్నారు. నిన్న ఒకే రోజు 3,55,102 బాధితులు డిశ్చార్జి అయ్యారని మంత్రిత్వశాఖ పేర్కొంది. తాజాగా నమోదైన కేసులతో మొత్తం కేసుల సంఖ్య 2,65,30,132కు పెరిగాయి. ఇప్పటి వరకు 2,34,25,467 మంది కోలుకున్నారు. మొత్తం 2,99,266 మంది వైరస్ బారినపడి ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం దేశంలో 28,05,399 యాక్టివ్ కేసులున్నాయని మంత్రిత్వ శాఖ తెలిపింది. టీకా డ్రైవ్లో ఇప్పటి వరకు 19,50,04,184 డోసులు వేసినట్లు పేర్కొంది. ఇదిలా ఉండగా.. నిన్న 21,23,782 కొవిడ్ టెస్టులు చేసినట్లు ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) తెలిపింది. ఇప్పటి వరకు 32.86కోట్ల నమూనాలను పరిశీలించినట్లు వివరించింది.