హైదరాబాద్, ఏప్రిల్ 23 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో గ్రూప్-1, గ్రూప్2, గ్రూప్3, గ్రూప్4 పోస్టులు పెంచాలని, ఉపాధ్యాయ నియామకాలను 25 వేలకు పెంచాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, ఎంపీ ఆర్ కృష్ణయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం సీఎస్ శాంతికుమారికి కృష్ణయ్య వినతిపత్రం అందజేశారు.
ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం అధికారంలోకొచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం 2లక్షల ఉద్యోగాల భర్తీకి వెంటనే చర్యలు తీసుకోవాలలని కోరారు. నిరుద్యోగులకు అన్యాయం జరగకుండా ఉద్యోగ నియామకాల్లో ఆప్షన్ పద్ధతి, వెయిటింగ్ లిస్టు కాల పరిమితి ప్రవేశపెట్టాలని విజ్ఞప్తి చేశారు. వినతిపత్రం ఇచ్చిన వారిలో గుజ్జ కృష్ణ, నీల వెంకటేశ్, నందగోపాల్, వేముల రామకృష్ణ, పెరికే సురేశ్, రఘుపతి, చంద్రశేఖర్ గౌడ్, చందు, లింగయ్య, నిఖిల్, జయంతి ఉన్నారు.