జవహర్నగర్, మార్చి:16: దంత వైద్యాన్ని అన్ని వర్గాల ప్రజలకు అందుబాటులో ఉంచడమే లక్ష్యంగా ఏసీడీఎస్ పనిచేస్తుందని దక్షిణ భారత ఏరియా లెఫ్టినెంట్ జనరల్ ఎ.అరుణ్ తెలిపారు. జవహర్నగర్ కార్పొరేషన్ పరిధిలోని ఆర్మీ డెంటల్ కళాశాలలోని వెల్నెస్ సెంటర్లో మొబైల్ డెంటల్ వ్యాన్ను మంగళవారం ఆయన ప్రారంభించారు. పంజాబ్ నేషనల్ బ్యాంక్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబులిటీ (సీఎస్ఆర్) చొరవతో మొబైల్ డెంటల్ ట్రీట్మెంట్ వ్యాన్ను ఆర్మీ కళాశాలకు విరాళంగా అందించారు. ఇట్టి వ్యాన్ పూర్తిగా ఎయిర్ కండీషన్తో కూడినదన్నారు. ఇందులో జీపీఎస్ ట్రాకింగ్, ఇన్ హౌస్ ఎక్స్రే, ఆటోక్లేవ్, లిట్ క్యూర్ యూనిట్, బ్యాకప్ పవర్ జనరేటర్తో పాటు అల్ట్రాసోనిక్ స్కీలింగ్ మిషన్లు ఉన్నాయి. అంతే కాకుండా రోగులకు కౌన్సెలింగ్, నిరీక్షణ, టెలివిజన్ వంటి ప్రత్యేక సదుపాయాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. గ్రామీణ ప్రాంతాలతో పాటు పాఠశాలలు, అనాథ ఆశ్రమాలు, వృద్ధాశ్రమాలలోని ప్రజలకు దంత వైద్య సేవలు అందించడానికి ఈ మొబైల్ వ్యాన్ ఎంతగానో ఉపయోగపడుతుందని ఏసీడీఎస్ అధికారులు తెలిపారు. కార్యక్రమంలో ఏసీడీఎస్ చైర్మన్ అభిజిత్ చంద్ర, ప్రిన్సిపాల్ డాక్టర్ కేవీ రమణారెడ్డితో పాటు ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.