రంగారెడ్డి, ఫిబ్రవరి 28 (నమస్తే తెలంగాణ) : పురుషులతో పోల్చుకుంటే మహిళలు అనారోగ్య సమస్యలను అధికంగా ఎదుర్కొంటూ ఉంటున్నారు. సమస్యను ఆదిలోనే గుర్తించకుంటే ప్రాణాంతకంగా మారే ప్రమాదం ఉంది. ఈ పరిస్థితుల నేపథ్యంలో కేసీఆర్ ప్రభుత్వం గత యేడాది ప్రారంభించిన ఆరోగ్య మహిళా సేవలు ఆదరణను చూరగొంటున్నాయి. జిల్లాలో దశల వారీగా 20 కేంద్రాలను ఏర్పాటు చేసి ప్రతి మంగళవారం ఎనిమిది రకాల వ్యాధులకు సంబంధించి ఉచిత పరీక్షలు నిర్వహించడంతోపాటు మందులను అందజేస్తున్నారు. జిల్లాలో ఆరోగ్య మహిళా కేంద్రాలు ఆదరణను చూరగొంటుండగా.. ఇప్పటివరకు జిల్లావ్యాప్తంగా 38,133 మంది సేవలను పొందారు.
జీవనశైలిలో మార్పులు, అలవాట్లు, ఒత్తిడి, ఆందోళనలతో ఇటీవలి కాలంలో ఎక్కువ మంది మహిళలు హార్మోన్ల అసమతుల్యత(పీసీవోఎస్), థైరాయిడ్ సమస్యల బారిన పడుతున్నారు. రక్త హీనత, మెనోపాజ్ సమస్యలతోనూ బాధపడుతున్నారు. ఈ తరహా సమస్యలను ఆరంభంలోనే గుర్తించకపోతే ప్రాణాలకే ముప్పు వాటిల్లుతుంది. ఈ పరిస్థితుల నేపథ్యంలో మంగళవారం మహిళలలు ఎదుర్కొంటున్న సమస్యలకు సంబంధించి పరీక్షలు నిర్వహించి ఆదిలోనే వ్యాధులను నిర్ధారించి ఉచితంగా చికిత్స అందజేయడంతోపాటు మందులను అందజేస్తున్నారు. స్థానికంగా చికిత్స సదుపాయం లేనిపక్షంలో ఆపై ఆసుపత్రులకు రిఫర్ చేస్తున్నారు.
ఎంపిక చేసిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో ప్రతి మంగళవారం మహిళా వైద్య, ఆరోగ్య సిబ్బంది పరీక్షలు అందుబాటులో ఉండి ఉచితంగా పరీక్షలు చేస్తున్నారు.