ఇబ్రహీంపట్నం, ఫిబ్రవరి 28 : రంగారెడ్డిజిల్లాలో 195 పరీక్షా కేంద్రాల్లో ఇంటర్ పరీక్షలు సజావుగా జరిగాయి. బుధవారం ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షకు 74,875మంది విద్యార్థులకుగాను, 772 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. గురువారం జరిగే ద్వితీయ సంవత్సరం పరీక్షకు 74,191 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. సీసీటీవీల పర్యవేక్షణలో పరీక్షలు నిర్వహించారు.
మాస్ కాపీయింగ్కు పాల్పడకుండా జిల్లాలో నాలుగు ప్లయింగ్ స్వాడ్లు, ఐదు సిట్టింగ్స్కాడ్స్ బృందాలను ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. పరీక్షా కేంద్రాల వద్ద విద్యార్థుల కోలాహలం కనిపించింది. నిమిషం ఆలస్యమైనా పరీక్షకు హాజరు కానివ్వమని అధికారులు నిబంధన పెట్టడంతో విద్యార్థులంతా ముందుగానే పరీక్షా కేంద్రానికి చేరుకున్నారు.
జిల్లావ్యాప్తంగా మొదటి సంవత్సరం పరీక్ష కేంద్రాలకు వివిధ కారణాల చేత 772మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. ఇబ్రహీంపట్నం డివిజన్ పరిధిలో 9 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఇబ్రహీంపట్నంలో ఐదు జనరల్ కేంద్రాలు, రెండు ఒకేషనల్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. మంచాలలో యాచారం మండలంలోని గున్గల్లో ఒక్కొక్క పరీక్షా కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. పరీక్షా కేంద్రాల పరిసర ప్రాంతాల్లో జిరాక్స్ సెంటర్లను మూసివేయించారు.
వికారాబాద్, ఫిబ్రవరి 28 : వికారాబాద్ జిల్లా కేంద్రంలో బుధవారం ఇంటర్ పరీక్షలు సజావుగా జరిగాయి. జిల్లాలో 29 పరీక్షా కేంద్రాల్లో 8,186 మంది విద్యార్థులు పరీక్షలు రాయాల్సి ఉన్నది. 7,880 మంది విద్యార్థులు హాజరు కాగా, 306 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. విద్యార్థులు పరీక్షా కేంద్రాల వద్దకు గంట ముందుగానే చేరుకున్నారు. పరీక్ష కేంద్రాల వద్ద పోలీస్ బందోబస్తు నిర్వహించారు. జనరల్లో 6,788 మంది ఉండగా, 6,572 మంది విద్యార్థులు హాజరయ్యారు.
216 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. ఒకేషన్లో 1,398 మంది పరీక్షలు రాయాల్సి ఉండగా, 1,308 మంది విద్యార్థులు రాశారు. 90 మంది గైర్హాజరయ్యారు. సిద్ధ్దార్థ కళాశాల పరీక్షా కేంద్రానికి ముగ్గురు విద్యార్థులు 5 నిమిషాలు ఆలస్యంగా రావడంతో పోలీసులు వారిని లోపలికి పంపలేదు. పరీక్షా కేంద్రాలను వికారాబాద్ జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి పరిశీలించారు. ఎవరు ఎలాంటి మాల్ ప్రాక్టీస్కు పాల్పడలేదని అధికారులు తెలిపారు.