‘మన ఊరు-మన బడి’తో 12 అంశాలపై ప్రధానంగా దృష్టి
ప్రతి గది, సదుపాయాల ఫొటోలు ఎస్ఐఎస్ యాప్లో అప్లోడ్
ఈ ఏడాది విద్యార్థులు అధికంగా ఉన్న 35 శాతం స్కూళ్ల ఎంపిక
అన్ని మౌలిక వసతులతో అద్భుతంగా మారనున్న బడులు
వికారాబాద్ జిల్లాలో 1084 పాఠశాలలు, రంగారెడ్డి జిల్లాలో 1300 స్కూళ్లు
పైలట్ ప్రాజెక్టుగా రంగారెడ్డి జిల్లాలోని శివరాంపల్లి ఉన్నత పాఠశాల, జిల్లెలగూడ ప్రాథమిక పాఠశాల
రంగారెడ్డి, నమస్తే తెలంగాణ/పరిగి, జనవరి 18 : తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన నాటి నుంచి విద్యారంగంలో వినూత్న మార్పులు తీసుకొస్తున్నది. ప్రతి సర్కారు బడిలో అన్ని మౌలిక వసతులను కల్పించడంతో పాటు నాణ్యమైన బోధన, డిజిటల్ తరగతుల నిర్వహణతో విద్యార్థులను తీర్చిదిద్దుతున్నది. కార్పొరేట్కు దీటుగా కొనసాగుతున్న బడుల్లో మరిన్ని మౌలిక వసతులు కల్పించి అద్భుతంగా తీర్చిదిద్దేందుకు ‘మన ఊరు-మన బడి’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. గదుల మరమ్మతుతో పాటు ఏయే సదుపాయాలు లేవో పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఫొటోలు తీసి ఎస్ఐఎస్ యాప్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. పరిశీలన అనంతరం ప్రతి స్కూల్లో చక్కని గదులు, ఫర్నిచర్, మరుగుదొడ్లు, తాగునీటి సరఫరా, డైనింగ్ హాల్స్, కంప్యూటర్ ల్యాబ్ వంటి 12 అంశాలకు సంబంధించిన వసతుల కల్పనకు ప్రభుత్వం నిధులు కేటాయించనున్నది. ఈ ఏడాది నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల బోధన అందించాలని సంకల్పించిన రాష్ట్ర సర్కార్… మొదటి విడుతలో ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో విద్యార్థులు అధికంగా ఉన్న 35 శాతం పాఠశాలలను ఎంపిక చేయనున్నది. వికారాబాద్ జిల్లాలో 1084 పాఠశాలలు, రంగారెడ్డి జిల్లాలో 1300 పాఠశాలలు ఉన్నాయి. ఇందులో భాగంగా పైలట్ ప్రాజెక్టుగా రంగారెడ్డి జిల్లాలోని శివరాంపల్లి ఉన్నత పాఠశాల, జిల్లెలగూడ ప్రాథమిక పాఠశాలను ఎంపిక చేసినట్లు మంగళవారం అధికారుల సమీక్షలో విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి వెల్లడించారు.
ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించడం, అభ్యసన సామర్థ్యం మెరుగుపరచడం, నాణ్యమైన డిజిటల్ విద్యా విధానాన్ని ప్రవేశపెట్టడానికి అవసరమైన అన్ని వసతుల కల్పనపై ప్రభుత్వం దృష్టి కేంద్రీకరించింది. ‘మన ఊరు-మన బడి’ కార్యక్రమం కింద మూడేండ్లలో ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు మరింత మెరుగుపరచడం ద్వారా సర్కారు బడుల్లోనే చదువుకోవాలనే ఆసక్తి విద్యార్థుల్లో నెలకొనేలా తయారు చేయబోతున్నది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి బడుల్లో ఆంగ్ల మాధ్యమంలో విద్యా బోధనకు సర్కారు నిర్ణయించింది. దీనికితోడు అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో సదుపాయాల కల్పనే ధ్యేయంగా ‘మన ఊరు-మన బడి’ కార్యక్రమం అమలుకు సంకల్పించింది. ఈ మేరకు మూడేండ్లలో పాఠశాలల్లో సదుపాయాల కల్పనకు రూ.7,289కోట్లు వెచ్చించే చారిత్రక నిర్ణయానికి సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశం ఆమోదముద్ర వేసింది.
ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం, పుస్తకాలు, స్కూల్ డ్రెస్సులు కూడా ఉచితంగా అందిస్తుండడం, పదో తరగతి పరీక్షల్లో ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో ప్రత్యేక తరగతులు, విద్యార్థుల దత్తత తదితర కార్యక్రమాలతో మెరుగైన ఫలితాలు సాధిస్తుండడం వంటి కసరత్తును విద్యాశాఖ ఆధ్వర్యంలో చేపడుతున్నారు. కార్పొరేట్ స్కూళ్లకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దడంలో భాగంగా ప్రభుత్వం ఇంగ్లిష్ మీడియాన్ని అమల్లోకి తెచ్చింది. పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు వచ్చే బడ్జెట్ సమావేశాల్లో నిధుల మంజూరుకు ప్రభుత్వం నిర్ణయించింది.
మూడేండ్లలో మెరుగైన వసతులు
రంగారెడ్డి జిల్లాలో 1300 ప్రభుత్వ, జిల్లా పరిషత్ పాఠశాలల్లో 1.56 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు. ఇప్పటివరకు జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో కావాల్సిన మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించి రూ.170 కోట్ల నిధులు అవసరమని జిల్లా విద్యాశాఖ అధికారులు అంచనా వేశారు.వీటిలో జిల్లాలోని 878 పాఠశాలల్లో మరుగుదొడ్లకు మరమ్మతులు చేపట్టాల్సి ఉందని, ఇందుకుగాను ఒక్కో టాయిలెట్ మరమ్మతుకు రూ.45వేలు ఖర్చు కానుండగా, మొత్తం పాఠశాలల్లో మరుగుదొడ్ల మరమ్మతులకు రూ.39.51 కోట్ల నిధులు అవసరమని విద్యాశాఖ అధికారులు అంచనా వేశారు. జిల్లాలోని 81 పాఠశాలలకు విద్యుత్తు సౌకర్యం లేనట్లుగా గుర్తించిన అధికారులు, ఇందుకుగాను ఒక్కో స్కూల్కు రూ.32వేలు ఖర్చు కానుండగా మొత్తం రూ.25.92 లక్షల నిధులు కావాలని అంచనా వేశారు. మరోవైపు జిల్లావ్యాప్తంగా 455 శిథిలావస్థకు చేరిన పాఠశాల భవనాలు ఉన్నట్లు గుర్తించారు. ఒక్కో కొత్త భవన నిర్మాణానికి రూ.11 లక్షల చొప్పున రూ.52 కోట్లు అవసరమని ప్రతిపాదించారు. నీటి వసతి లేని స్కూళ్లు-24 ఉండగా, నీటి వసతి కల్పించేందుకు ఒక్కో పాఠశాలకు రూ.2 లక్షల చొప్పున రూ.48 లక్షలు, జిల్లావ్యాప్తంగా 1,10,189 రన్నింగ్ మీటర్ల కాంపౌండ్ వాల్ అవసరమని గుర్తించిన అధికారులు, ఒక్కో రన్నింగ్ మీటరుకు రూ.7వేల చొప్పున రూ.77.13 కోట్ల నిధులు అవసరమని జిల్లా విద్యాశాఖ అధికారులు అంచనా వేశారు. ప్రభుత్వ పాఠశాలల్లోని మిగతా మౌలిక సదుపాయాలకు సంబంధించి త్వరలోనే పూర్తి నివేదికను విద్యాశాఖ అధికారులు తయారు చేయనున్నారు.
12 అంశాలపై ప్రధానంగా దృష్టి
మన ఊరు-మన బడి కార్యక్రమంలో భాగంగా పాఠశాలల్లో 12 అంశాలపై ప్రత్యేకంగా దృష్టి కేంద్రీకరించనున్నారు. నీటి సదుపాయంతో కూడిన మరుగుదొడ్లు, తాగునీటి సరఫరా, శిథిలమైన గదుల స్థానంలో కొత్త తరగతి గదుల నిర్మాణం, ఉన్నత పాఠశాలల్లో డైనింగ్ హాల్స్ ఏర్పాటు, విద్యుద్ధీకరణ, విద్యార్థులు, సిబ్బందికి సరిపోయే ఫర్నిచర్, పాఠశాల మొత్తం పెయింటింగ్ వేయడం, చిన్న, పెద్ద మరమ్మతులు చేపట్టడం, గ్రీన్చాక్ బోర్డుల ఏర్పాటు, ప్రహరీలు, వంటశాలల నిర్మాణం, డిజిటల్ విద్య అమలు అంశాలపై సదుపాయాల కల్పన చేపట్టనున్నారు. వసతుల కల్పనతో సర్కారు బడులు అన్ని సదుపాయాలతో మరింత సుందరంగా మారనున్నాయి.
పైలట్ ప్రాజెక్టుగా రెండు పాఠశాలలు మంత్రి సబితారెడ్డి
రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసేందుకుప్రభుత్వం మన ఊరు-మన బడి పథకాన్ని అమలుచేసేందుకు రూ.7289 కోట్ల ఖర్చు చేయనుందని మంత్రి సబితాఇంద్రారెడ్డి తెలిపారు. మంగళవారం తన కార్యాలయంలో సంబంధిత పథకంపై అధికారులతో సమీక్షా సమావేశాన్ని మంత్రి నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మన ఊరు-మన బడి పథకాన్ని సమర్థవంతంగా అమలుచేసేందుకు పైలట్ ప్రాజెక్టుగా నాలుగు పాఠశాలలను ఎంపిక చేసినట్లు మంత్రి వెల్లడించారు. రంగారెడ్డి జిల్లాలోని శివరాంపల్లి ఉన్నత పాఠశాల, జిల్లెలగూడ ప్రాథమిక పాఠశాల, హైదరాబాద్ జిల్లాలోని ఆలియా, మహబూబియా ఉన్నత, ప్రాథమిక పాఠశాలలను పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేశామన్నారు. సంబంధిత పాఠశాలల్లో మెరుగైన మౌలిక సదుపాయాల కల్పనకురూ.3.57 కోట్లు ఖర్చు చేయనున్నట్లు, ఇందుకు సంబంధించిన పనులు ఇప్పటికే 40 శాతం మేర పూర్తయినట్లు మంత్రి తెలిపారు. ఈ పాఠశాలలను ఇతర పాఠశాలలకు ఆదర్శంగా తీర్చిదిద్దుతామని, పాఠశాలలకు అవసరమైన మౌలిక సదుపాయాలన్నింటిని కల్పిస్తున్నామన్నారు. సమావేశంలో టీఎస్ఈడబ్ల్యూఐడీసీ చైర్మన్ నాగేందర్గౌడ్, ఎండీ పార్థసారథి పాల్గొన్నారు.
అధికంగా విద్యార్థులున్న పాఠశాలల ఎంపిక
వికారాబాద్ జిల్లాలో 1,084 పాఠశాలలుండగా వాటిలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలు 170, ప్రాథమిక పాఠశాలలు 712, యూపీఎస్లు 173 , కేజీబీవీలు 18, మోడల్ స్కూల్లు 9, సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలు 2 ఉన్నాయి. వీటిలో సుమారు లక్షా 10వేల పైచిలుకు మంది విద్యార్థులు విద్యాభ్యాసం చేస్తున్నారు. ఇందులో 35శాతం పాఠశాలల్లో ఈసారి సదుపాయాలు కల్పించేందుకు ఎంపిక చేయనున్నారు. ముందుగా ఎక్కువగా విద్యార్థుల సంఖ్య గల పాఠశాలల్లో సదుపాయాల కల్పనకు మొదటి ప్రాధాన్యతగా ఈసారి ఎంపిక చేయనున్నారు. జిల్లాలో జడ్పీహెచ్ఎస్లు 170 పాఠశాలలకు, 200 మంది విద్యార్థులకు పైగా ఉన్న పాఠశాలలు 71, 712 ప్రాథమిక పాఠశాలలకు 50 మందికి పైగా విద్యార్థులున్న పాఠశాలలు 300, 173 ప్రాథమికోన్నత పాఠశాలలకు 110 మంది విద్యార్థుల కంటే అధికంగా ఉన్న పాఠశాలలు 50 ఉన్నాయి. మొదటి విడుతలో 35శాతం పాఠశాలలను ఎంపిక చేయనుండగా, అత్యధిక విద్యార్థులు గల పాఠశాలలకు ప్రాధాన్యత ఇవ్వనున్నారు. ఈ లెక్కన జిల్లావ్యాప్తంగా విద్యార్థుల సంఖ్యతో కూడిన పాఠశాలలు, వాటిలోని వసతుల వివరాలు ఎస్ఐఎస్ యాప్లో అప్లోడ్ చేయడంతో ఎంపిక ప్రక్రియ సైతం మరింత సులువుగా మారనుంది. ఎంపిక చేయబడిన పాఠశాలల్లో వసతుల కల్పనకు సంబంధించిన కార్యక్రమాల అమలుకు అన్ని అనుమతులు జిల్లా కలెక్టర్లు ఇవ్వనున్నారు. పర్యవేక్షణ బాధ్యతలను పాఠశాల నిర్వహణ కమిటీ(ఎస్ఎంసీ)లకు అప్పగించనున్నారు. ఈ పథకం అమలు తీరుపై గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో సోషల్ ఆడిట్ అకౌంటబిలిటీ అండ్ ట్రాన్స్పరెన్సీ(ఎస్ఏఏటీ) అనే సంస్థ ద్వారా సామాజిక తనిఖీ సైతం నిర్వహించనున్నారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల నియోజకవర్గ అభివృద్ధి నిధుల నుంచి 40శాతం, పంచాయతీరాజ్, ఎస్సీ, ఎస్టీ సబ్ప్లాన్ల నుంచి సైతం ఈ కార్యక్రమం అమలుకు నిధులు కేటాయించనున్నారు.
ఎస్ఐఎస్ యాప్లో వసతులకు సంబంధించిన ఫొటోలు
ప్రతి పాఠశాలలో ఎలాంటి వసతులు ఉన్నాయన్నది పూర్తిస్థాయిలో తెలుసుకునేందుకు పాఠశాలలవారీగా ఇప్పటికే సర్వే నిర్వహించి ఆన్లైన్లో అప్లోడ్ చేశారు. రాష్ట్రస్థాయిలో ఎస్ఐఎస్(స్కూల్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్) యాప్ను రూపొందించి, ప్రతి పాఠశాలలోని వసతులకు సంబంధించిన ప్రతి గదిలోని నాలుగువైపులా గోడలు, రూఫ్, ఫ్లోరింగ్, తలుపులు ఇలా 8 ఫొటోలు, మరుగుదొడ్లు, మంచినీటి వసతి, వంటగది, ప్రహరీ, ప్రధానోపాధ్యాయుడి కార్యాలయం, ఉన్నత పాఠశాలల్లో కంప్యూటర్ ల్యాబ్, సైన్స్ ల్యాబ్, పాఠశాలలో కరెంటు సదుపాయం, ఇతర ప్రతి గదికి సంబంధించిన ఫొటోలు ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు ఎస్ఐఎస్ యాప్లో అప్లోడ్ చేశారు. ప్రతి పాఠశాలకు సంబంధించిన సదుపాయాల ఫొటోలు అప్లోడ్ చేయడం ద్వారా ఆయా పాఠశాలల్లో గల వసతులు ఏమిటి, ఇంకా ఏఏ సదుపాయాలు కల్పించాలన్నది పూర్తి స్థాయిలో తెలుస్తుంది. పాఠశాలల వారీగా విద్యార్థుల సంఖ్య సైతం ఎస్ఐఎస్ యాప్లో అప్లోడ్ చేశారు. పాఠశాలల్లో వసతుల కల్పనకు సంబంధించి అంచనాలు తయారు చేసి నిధులు విడుదల చేయనున్నారు. మూడేండ్లలో పాఠశాలల రూపురేఖలు పూర్తిస్థాయిలో మార్చేందుకు సంకల్పించిన సర్కారు నిధులను త్వరలో విడుదల చేసి, పనులు ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేపట్టనున్నారు.
ఎస్ఐఎస్ యాప్లో అప్లోడ్ ; రేణుకాదేవి, వికారాబాద్ జిల్లా విద్యాధికారి
జిల్లా పరిధిలోని ప్రతి పాఠశాలలో గల తరగతి గదులు, మరుగుదొడ్లు, వంటశాలలు, ప్రహరీ, ప్రధానోపాధ్యాయుడి గది, ఒక్కో అంశానికి సంబంధించి 8 ఫొటోలు ఎస్ఐఎస్ యాప్లో అప్లోడ్ చేశారు. తరగతులవారీగా విద్యార్థుల సంఖ్య, పాఠశాలలో మొత్తం ఎంతమంది విద్యార్థులు విద్యాభ్యాసం చేస్తున్నారు తదితర వివరాలు సైతం పొందుపరిచారు. ఈ సంవత్సరానికి ఏ పాఠశాలలు ఎంపిక చేశారనేది వివరాలు అందాల్సి ఉన్నది. ఎంపిక చేసిన పాఠశాలల్లో సదుపాయాలు కల్పించనున్నారు.
ప్రైవేట్కు దీటుగా ప్రభుత్వ పాఠశాలలు ;వెంకటయ్యగౌడ్, రుద్రారం, కొడంగల్
ప్రైవేట్కు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను బలోపేతంచేసేందుకుగాను సీఎం కేసీఆర్ మన ఊరు-మన బడి ప్రణాళిక కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. విద్యారంగంలో సమూల మార్పులు ఏర్పడి, సర్కారు పాఠశాలల్లో మెరుగైన మౌలిక సదుపాయాలు, నాణ్యమైన విద్యను విద్యార్థులు అందుకునే అవకాశాన్ని కల్పించడం చాలా సంతోషంగా ఉంది. సర్కారు పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం ప్రారంభమైతే విద్యార్థుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. గ్రామీణ ప్రాంత చిన్నారులకు ఇంగ్లిష్ మాధ్యమం అందుబాటులోకి రావడం హర్షించదగ్గ విషయం.