ధరల నియంత్రణలో కేంద్రం విఫలం
కరోనా కట్టడికి అందరూ సహకరించాలి
పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి
పరిగి, జనవరి 18 : ఎరువుల ధరలు పెంచడం ద్వారా రైతులపై మోయలేని భారం పడుతుందని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి పేర్కొన్నారు. ధరల నియంత్రణలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆయన విమర్శించారు. మంగళవారం పరిగిలోని తమ నివాసంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే మహేశ్రెడ్డి మాట్లాడుతూ.. పంటల సాగులో అధికంగా ఉపయోగించే కాంప్లెక్స్ ఎరువుల ధరలు పెరుగడంతో ఒక్కో ఎకరాకు రూ.2వేల నుంచి రూ.3వేలు రైతులపై అదనంగా భారం పడుతున్నదని పేర్కొన్నారు. ఎరువుల ధరలు పెద్దఎత్తున పెరిగినా కేంద్ర ప్రభుత్వం చేష్టలుడిగి చూస్తున్నదని ఎమ్మెల్యే దుయ్యబట్టారు. కంపెనీలు ధరలు పెంచినా వాటి భారం రైతులపై పడకుండా సబ్సిడీని పెంచాల్సిన కేంద్రం తమకేమీ పట్టనట్లు వ్యవహరించడం రైతు వ్యతిరేక విధానాలకు నిదర్శనమని పేర్కొన్నారు. ఇప్పటికైనా కేంద్రం చొరవ తీసుకొని ఎరువులపై ఇచ్చే సబ్సిడీని పెంచాలని.. లేకపోతే రైతుల తరపున పోరాటం చేస్తామని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నదనడానికి ఇదో ఉదాహరణ అని తెలిపారు. ఎరువుల ధరలు తగ్గించాలని కేంద్రానికి సీఎం కేసీఆర్ లేఖ రాశారని, టీఆర్ఎస్ ప్రభుత్వం రైతులపక్షాన నిలబడి పోరాడుతుందన్నారు. దేశంలోనే ఎక్కడా లేని విధంగా రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణలో రైతుబంధు కింద రూ.50వేల కోట్లు అందజేసిందని, ఈ ఘనత సీఎం కేసీఆర్కు దక్కుతుందని తెలిపారు. దీంతో రైతుల్లో ఆత్మైస్థెర్యం పెరిగిందన్నారు. వానకాలంలో పండించిన ధాన్యం పూర్తిస్థాయిలో ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని తెలిపారు.
కరోనా వ్యాప్తి పెరుగుతున్న క్రమంలో అందరూ వ్యాక్సిన్ వేయించుకోవాలని ఎమ్మెల్యే సూచించారు. కొవిడ్ను పూర్తిస్థాయిలో ఎదుర్కునేందుకు ప్రభుత్వం అవసరమైన చర్యలు చేపట్టిందన్నారు. కార్యక్రమంలో జడ్పీటీసీలు నాగారెడ్డి, హరిప్రియ, ఎంపీపీలు అరవిందరావు, మల్లేశం, మున్సిపల్ చైర్మన్ ముకుంద అశోక్, రైతు బంధు సమితి మండల అధ్యక్షుడు రాజేందర్, పరిగి, కులకచర్ల మండలాల టీఆర్ఎస్ అధ్యక్షులు ఆంజనేయులు, రాంరెడ్డి, పీఏసీఎస్ వైస్ చైర్మన్లు భాస్కర్, నాగరాజు, సర్పంచ్లు గణేశ్, జంగయ్య, మండల కో-ఆప్షన్ సభ్యుడు తాజుద్దీన్, టీఆర్ఎస్ నాయకులు వెంకటేశ్, రవికుమార్, రఘువర్ధన్రెడ్డి పాల్గొన్నారు.