వికారాబాద్ జిల్లా కలెక్టర్ నిఖిల
పరిగి, జనవరి 17 : రెండో డోసు వ్యాక్సినేషన్ డ్యూ డేట్ పూర్తయినవారిని గుర్తించి రెండు రోజుల్లో వంద శాతం వ్యాక్సినేషన్ పూర్తి చేయాలని వికారాబాద్ జిల్లా కలెక్టర్ నిఖిల వైద్యాధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుంచి వైద్యాధికారులతో కొవిడ్ వ్యాక్సినేషన్పై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా పరిధిలో రెండో డోసుకు అర్హులైన 68,161 మందిని సబ్ సెంటర్లవారీగా ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు, సూపర్వైజర్ల సహకారంతో ఇంటింటికీ వెళ్లి వంద శాతం వ్యాక్సినేషన్ జరిగేలా చూడాలన్నారు. జిల్లాలో మొదటి డోసు 103 శాతం, రెండో డోసు 51శాతం పూర్తయిందని కలెక్టర్ తెలిపారు. జిల్లా పరిధిలో 15 నుంచి 17 సంవత్సరాలలోపు వయసు గల పిల్లలకు నేటి వరకు 31శాతం వ్యాక్సినేషన్ పూర్తయిందని, 4370 మంది హెల్త్ వర్కర్లలో 1363 మందికి, 5796 మంది ఫ్రంట్ లైన్ వర్కర్లలో 423 మందికి ప్రికాషనరీ డోసు వేసినట్లు చెప్పారు. 60 ఏండ్లు పైబడిన 60,860 మందిలో 379 మందికి ప్రికాషనరీ డోసు వేశారన్నారు. హోం ఐసొలేషన్ కిట్లు, ర్యాట్ కిట్లు అన్ని సబ్ సెంటర్లకు పంపిణీ చేసినట్లు కలెక్టర్ తెలిపారు. సమావేశంలో జిల్లా వైద్యాధికారి తుకారాం, ఉప వైద్యాధికారులు జీవరాజ్, ధరణికుమార్, వైద్యాధికారులు, ప్రోగ్రామ్ అధికారులు పాల్గొన్నారు.