ఆమనగల్లు, మార్చి 10 : పట్టణంలోని అలివేలు మంగ సమేత వెంకటగిరి వేంకటేశ్వర స్వామి ఆలయంలో ఈ నెల 16 నుంచి 20వరకు బ్రహ్మోత్సవాలను నిర్వహిస్తున్నామని ప్రధాన అర్చకుడు గూడ కృష్ణమాచార్యులు తెలిపారు. ఉత్సవాల నేపథ్యంలో ఆలయాన్ని ముస్తాబు చేస్తున్నామన్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. ప్రతి ఏడాది ఐదు రోజుల పాటు బ్రహ్మోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
ఈ నెల16న విష్వక్సేన ఆరాధన, పుణ్యా హవాచనం, 17న శ్రీవారి మహాభిషేకం, ఎదుర్కోళ్లు, 18న వేంకటేశ్వర స్వామి తిరుకల్యాణం, అనంతరం భక్తులకు అన్నదాన వితరణ, 19న రథోత్సవం, రాత్రి దీపోత్సవం, అభయాంజనేయ, మార్కండేయ భక్త భజన, 20న సుదర్శన హవనం, చక్రతీర్థం, పూర్ణాహుతి, అనంతరం శ్రీవారి బ్రహోత్సవాలు ముగుస్తాయని తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఉత్సవాలను విజయవంతం చేయాలని కోరారు.