షాబాద్, డిసెంబర్ 4 : అంగన్వాడీ కేంద్రాలకు సంబంధించిన పూర్తి వివరాలన్నీ ఇకపై ఆన్లైన్లో ఉండనున్నాయి. ఇప్పటికే ప్రభుత్వం అంగన్వాడీ టీచర్లకు స్మార్ట్ ఫోన్లను పంపిణీ చేసింది. సెంటర్లకు ఎంతమంది చిన్నారులు హాజరవుతున్నారు.? గర్భిణులు, బాలింతలు, కిశోరబాలికలు, సెంటర్కు వచ్చే సరుకుల వివరాలను ఆన్లైన్లో నమోదు చేయనున్నారు. న్యూట్రిషన్ అండ్ హెల్త్ ట్రాకింగ్ సిస్టం(ఎన్హెచ్టీఎస్)పేరుతో ప్రభుత్వం కొత్త యాప్ను రూపొందించింది. కేంద్రాల నిర్వహణ వివరాలను గతంలో రిజిస్టర్లో నమోదు చేసేవారు. ఆన్లైన్తో ఈ వ్యవస్థకు పుల్స్టాప్ పడనుంది. ఎప్పటికప్పుడూ వివరాలను మొబైల్లో టీచర్లు నమోదు చేయాలి. సూపర్వైజర్లు, సీడీపీవోలు, డీడబ్ల్యూవోలు పర్యవేక్షణ చేయనున్నారు. రంగారెడ్డి జిల్లావ్యాప్తంగా 1600 అంగన్వాడీ కేంద్రాలున్నాయి. ఇందుకు సంబంధించి కొత్తగా రూపొందించిన యాప్పై గత నెలలో అంగన్వాడీ టీచర్లకు రెండు రోజుల పాటు శిక్షణా కార్యక్రమాలు నిర్వహించారు. ప్రస్తుతం అంగన్వాడీ కేంద్రాల్లో రిజిస్టర్లలో పొందుపరుస్తున్న వివరాలన్నీ ఇకపై ఆన్లైన్లో ఎన్హెచ్టీఎస్ యాప్లో నమోదు చేయనున్నారు.
జిల్లాలో 1600 అంగన్వాడీ కేంద్రాలు
జిల్లావ్యాప్తంగా 27 మండలాల్లోని ఐదు రెవెన్యూ డివిజన్ల పరిధిలో చేవెళ్ల, ఆమనగల్లు, హయత్నగర్, ఇబ్రహీంపట్నం, మహేశ్వరం, శేరిలింగంపల్లి, షాద్నగర్ ప్రాజెక్టుల పరిధిలో 1600 అంగన్వాడీల్లో 220 మినీ కేంద్రాలున్నాయి. గర్భిణులు, బాలింతలు 20,587, చిన్నారులు 1,31,652 మంది ఉన్నారు. అంగన్వాడీ కేంద్రానికి వచ్చే లబ్ధిదారులకు పౌష్టికాహారం ఏ మేరకు అందుతుంది.? ఎక్కడైనా పంపిణీ చేయకుండా ఉండే పరిస్థితులు ఉన్నాయా.? అనే అంశాల పరిశీలనను ఇకపై యాప్లో నమోదు చేసిన తర్వాతే తెలుసుకునే అవకాశాలున్నాయి. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం న్యూట్రిషన్ అండ్ హెల్త్ ట్రాకింగ్ సిస్టం(ఎన్హెచ్టీఎస్) అనే ప్రత్యేక యాప్ను రూపొందించింది. ప్రతి అంగన్వాడీ కేంద్రంలో టీచర్లు రోజువారీగా పౌష్టికాహారం, పిల్లల ఎత్తు, బరువు వివరాలను యాప్లో నమోదు చేయాల్సి ఉండడంతో పారదర్శకత పెరుగనుంది.
యాప్పై అంగన్వాడీ టీచర్లకు శిక్షణ
ప్రభుత్వం నూతనంగా ఎన్హెచ్టీఎస్(న్యూట్రిషన్ అండ్ హెల్త్ ట్రాకింగ్ సిస్టం)అనే యాప్ను రూపొందించింది. అందులో ఉండే 12 రిజిస్టర్లకు సంబంధించిన వివరాలు, చిన్నారుల ఎత్తు కొలతలు, పౌష్టికాహారం అందజేత వంటితో పాటు అంగన్వాడీ కేంద్రంలో నిల్వ ఉన్న పౌష్టికాహార సమాచారం వంటి వివరాలపై గత నెలలో రెండు రోజుల పాటు జిల్లా, డివిజన్ స్థాయిలో ఐసీడీఎస్ అధికారులు అంగన్వాడీ టీచర్లకు అవగాహన కల్పించారు. గర్భిణులు తీసుకునే పౌష్టికాహారం వల్లే పుట్టబోయే పిల్లలు ఆరోగ్యం, బరువు ఆధారపడి ఉంటుంది. బిడ్డ పుట్టిన తర్వాత బాలింతలకు పౌష్టికాహారం ఇస్తుండగా ఎదుగుదలలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండాలని చిన్నారులకు ఆరేండ్లు వచ్చే వరకు ప్రభుత్వం పౌష్టికాహారాన్ని అందిస్తున్నది. చిన్నారి ఎత్తు, బరువు, కొలతలను నమోదు చేసి ఆ వివరాల ప్రకారం వయస్సుకు తగ్గిన ఎత్తు, బరువు, ఎత్తుకు తగిన బరువు ఉన్నారా లేదా అనే వివరాలను ఎప్పటికప్పుడూ యాప్లో పొందుపర్చాలి. ప్రభుత్వం ప్రవేశపెట్టిన కొత్త యాప్తో గర్భిణులు, బాలింతలతో పాటు చిన్నారులకు మరింత మెరుగ్గా పౌష్టికాహారం అందనుంది.
వివరాలన్నీ ఆన్లైన్ యాప్లో నమోదు
– శోభారాణి, సీడీపీవో, చేవెళ్ల డివిజన్
అంగన్వాడీ కేంద్రాల్లో ఇంతకు ముందు టీచర్లు 12 రకాల రిజిస్టర్లలో వివరాలను నమోదు చేసేవారు. ఇకపై రిజిస్టర్లో కాకుండా ప్రత్యేక ఎన్హెచ్టీఎస్ యాప్లో వివరాలన్నీ నమోదు చేయాల్సి ఉంటుంది. ఆన్లైన్ యాప్ గురించి ఇప్పటికే టీచర్లకు శిక్షణ ఇచ్చాం. యాప్ నుంచి అంగన్వాడీ వ్యవస్థ పూర్తి వివరాలు ఆన్లైన్లో నమోదు చేస్తే మరింత పారదర్శకత పెరుగుతుంది. ప్రతిరోజూ గర్భిణులు, బాలింతలకు, చిన్నారులకు అందించిన పౌష్టికాహారం, నిల్వ ఉన్న పౌష్టికాహారం వివరాలను ఆన్లైన్లో నమోదు చేసిన వెంటనే నేరుగా యాప్లో కనిపిస్తాయి.