ఇబ్రహీంపట్నం/ ఇబ్రహీంపట్నంరూరల్, జనవరి 14 : ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో శుక్రవారం భోగిపండుగను ప్రజలు ఘనంగా జరుపుకొన్నారు. ఉదయం నుండే ఇండ్లముందు రంగురంగుల ముగ్గులు వేసి గొబ్బెమ్మలను పెట్టారు. యువకులు పెద్ద ఎత్తున పతంగులను ఎగురవేశారు. మూడురోజుల పాటు జరుగనున్న పండుగ సందర్భంగా సుదూర ప్రాంతాల్లో ఉన్నవారు కూడా గ్రామాలకు చేరుకున్నారు. దీంతో గ్రామాల్లో పండుగ వాతావరణం నెలకొంది. దుకాణ సముదాయాలు కొనుగోలుదారుతో కిటకిటలాడాయి. గ్రామాల్లో గంగిరెద్దుల విన్యాసాలు, హరిదాసులు కూడా సందడి చేశారు. ఇబ్రహీంపట్నం, మంచాల, యాచారం, అబ్దుల్లాపూర్మెట్ మండలాలతో పాటు ఇబ్రహీంపట్నం, తుర్కయాంజాల్, పెద్దఅంబర్పేట్, ఆదిబట్ల మున్సిపాలిటీల్ల్లో సంక్రాంతి ఏర్పాట్లు పెద్ద ఎత్తున చేశారు. .
కడ్తాల్ : మండల వ్యాప్తంగా భోగి పండుగను ప్రజలు భక్తిశ్రద్ధలతో జరుపుకొన్నారు. మైసిగండి గ్రామంలో భోగి మంటలను ఏర్పాటు చేశారు. ప్రజలు తమ ఇండ్లలోని పాత వస్తువులను, సామగ్రిని బోగి మంటల్లో వేశారు.
ఆకాశమంతా.. పతంగుల కేరింత
హయత్నగర్ రూరల్ : అబ్దుల్లాపూర్మెట్లోని కుత్బుల్లాపూర్, గౌరెల్లి, తారామతిపేట గ్రామాలతోపాటు పెద్దఅంబర్పేట మున్సిపాలిటీ పరిధిలోని తట్టిఅన్నారం, ఇందుపల్లవి, ఇందుఅరణ్య, ఆర్కేనగర్, మర్రిపల్లిలో సంక్రాంతి సంబురాలు నిర్వహించారు. శుక్రవారం భోగి పండుగను పురస్కరించుకుని రంగవల్లులతో వాకిళ్లను అలంకరించారు. ఇక ఉదయం నుంచి యువత, చిన్నారులు గల్లీ గల్లీలో పతంగుల ఎగురవేతతో సందడిగా మారింది. పలువురు భవనాలపై నుంచి ఎగురవేయగా.. మరికొందరు పాఠశాలల వద్ద, మైదానాల్లో ఎగరేసేందుకు ఆసక్తి చూపారు. గంగిరెద్దుల రాకతో గ్రామాల్లో సందడి నెలకొన్నది.
అబ్దుల్లాపూర్మెట్ : గ్రామాల్లో మహిళలు, యువతులు వివిధ రకాల అందమైన ముగ్గులు అలంకరించారు. ఒకరికొకరు పోటీ పడుతూ వాకిళ్ల ముందు ముగ్గులను తీర్చిదిద్దారు. భోగి మంటలతో గ్రామాలు సంక్రాంతి పండుగ శోభను తలపించాయి. యువకులు పతంగులు ఎగురవేసి ఉత్సాహంగా గడిపారు. గండిచెరువు గ్రామంలో గోదా రంగనాధస్వామి ఆలయంలో సర్పంచ్ జక్క లావణ్యపాపిరెడ్డి ఆధ్వర్యంలో స్వామి వారి కల్యాణం నిర్వహించారు.
మున్సిపాలిటీలో ముగ్గుల పోటీలు
పెద్దఅంబర్పేట : పెద్దఅంబర్పేట మున్సిపాలిటీలో శుక్రవారం భోగి పండుగ ఉత్సవాలు ఘనంగా జరుపుకున్నారు. రావినారాయణరెడ్డి కాలనీలో ముగ్గుల పోటీలు నిర్వహించారు. అనంతరం విజేతలకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో సీపీఐ నాయకులు ముత్యాల యాదిరెడ్డి, కౌన్సిలర్ లక్ష్మన్, మాజీ కౌన్సిలర్ హరిసింగ్, నర్సింహ, భాస్కర్, నవనీత, అరుణ, అనూష పాల్గొన్నారు.
శంకర్పల్లి : శంకర్పల్లి మండల, మున్సిపల్ పరిధిలోని గ్రామాల్లో భోగి పండుగను ప్రజలు భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. ఇండ్ల ముందు కల్లాపి చల్లి మహిళలు ముగ్గులు వేశారు. పిల్లలకు భోగి పండ్లను వేసి ఆశీర్వదించారు.