కొడంగల్, జనవరి 14 : బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం తరువాత మొదటి సారిగా ఈనెల 18న ఖమ్మం జిల్లాలో నిర్వహించనున్న బహిరంగ సభకు భారీగా తరలివచ్చి సభను విజయవంతం చేయాలని ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి తెలిపారు. శనివారం పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణలో అభివృద్ధిని చూసి దేశ ప్రజల చూపు బీఆర్ఎస్ వైపు చూస్తుందని, ఆయా రాష్ర్టాల ప్రజలు బీఆర్ఎస్ పార్టీలో చేరేందుకు ఆసక్తిని కనబరుస్తున్నట్లు పేర్కొన్నారు. బీఆర్ఎస్ పార్టీని ఆవిష్కరించిన తరువాత మొదటి సారిగా ఖమ్మంలో సీఎం కేసీఆర్ బహిరంగ సభలో పాల్గొంటున్నారని చెప్పారు. కాబట్టి అధిక సంఖ్యలో నాయకులు, ప్రజలు పాల్గొని బీఆర్ఎస్ పార్టీకి, సీఎం కేసీఆర్కు పూర్తి మద్దతు తెలుపుదామని కోరారు.
నియోజకవర్గ అభివృద్ధికి సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ఎస్ అడిగిన వెంటనే నిధులు మంజూరు చేసి అభివృద్ధికి సహకరిస్తున్నారని తెలిపారు. నియోజకవర్గంలోని ఆయా గ్రామాల్లోని వీధుల్లో సీసీ రోడ్లు నిర్మాణం జరిగిందని, మిగిలిన సీసీ రోడ్ల ఏర్పాటుకు ఎన్ఆర్ఈజీఎస్ నిధుల కింద రూ.13కోట్లు మంజూరు చేసినట్లు తెలిపారు. రెండు నెలల్లో పనులు పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. నియోజకవర్గ పరిధిలో మొత్తంగా 110 గ్రామ పంచాయతీ భవనాలు మంజూరయ్యాయని, సంక్రాంతి పండుగ తరువాత భూమిపూజ కార్యక్రమంతో నిర్మాణ పనులు ప్రారంభించనున్నట్లు తెలిపారు. కొడంగల్లో స్టేడియం నిర్మాణానికి టెండర్ ప్రక్రియ కొనసాగుతున్నట్లు తెలిపారు. అదేవిధంగా మంత్రి కేటీఆర్ ఇచ్చిన హామీ ప్రకారం యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు దౌల్తాబాద్ మండలంలోని చంద్రకల్ గ్రామంలో పరిశ్రమ ఏర్పాటుకు 60ఎకరాల స్థలాన్ని పరిశీలించినట్లు తెలిపారు. మంత్రి దృష్టికి తీసుకెళ్లి అనుమతితో కమిటీ ఏర్పాటుతో కార్యాచరణ చేపట్టనున్నట్లు తెలిపారు.
అంధత్వ నివారణకు కంటి వెలుగు
ప్రభుత్వం అంధత్వ నివారణకు కంటి వెలుగు కార్యక్రమంతో ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రజారోగ్యానికి ప్రభుత్వం ఇంటింటి సర్వే నిర్వహించి దీర్ఘకాలిక రోగులను గుర్తించడం జరిగిందని, వీరికి నెల వారీగా ఉచితంగా మందులు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. అదేవిధంగా తల్లి, బిడ్డ సంక్షేమం కోసం గర్భిణులకు న్యూట్రీషియన్ కిట్లను అందిస్తున్నట్లు తెలిపారు. అనంతరం మున్సిపల్ పరిధిలోని 2వ వార్డులో సంక్రాంతి సంబురాల్లో పాల్గొని, శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో పీఏసీఎస్ అధ్యక్షుడు విష్ణువర్ధన్రెడ్డి, కౌన్సిలర్ మధుసూదన్రావుయాదవ్, బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు దామోదర్రెడ్డితో పాటు టీఆర్ఎస్ నాయకులు టీటీ రాములు, కోట్ల యాదగిరి, చాంద్పాషా, గోడల రాంరెడ్డి, దేశ్యానాయక్ పాల్గొన్నారు.