జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్లో రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి శశాంక్ గోయల్
పరిగి/షాబాద్, జనవరి 12 : ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమంలో భాగంగా 2022 జనవరి 1 నాటికి 18 సంవత్సరాలు నిండి ఓటర్లుగా నమోదైనవారికి ఫొటో ఓటర్ గుర్తింపు కార్డులు(ఎపిక్ కార్డు) బీఎల్వోల ద్వారా అందజేయాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి శశాంక్ గోయల్ జిల్లాల కలెక్టర్లకు సూచించారు. బుధవారం హైదరాబాద్ నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నూతన ఓటర్ల నమోదు, కొత్తగా ఓటర్లుగా నమోదైన వారికి గుర్తింపు కార్డుల పంపిణీ తదితర విషయాలపై సూచనలు చేశారు. జనవరి 25న జాతీయ ఓటరు దినోత్సవం సందర్భంగా ప్రస్తుతం కొత్తగా ఓటు హక్కు పొందిన యువతకు ఎపిక్ కార్డును పోస్ట్ ద్వారా అందజేసేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్లకు సూచించారు.
ఓటర్ కిట్లో వ్యక్తిగత లేఖ, ఓటర్ గైడ్, ఓటర్ ప్రతిజ్ఞ, ఎపిక్ కార్డు ఉంటుందని చెప్పారు. ఓటరు నమోదు నిరంతర ప్రక్రియ అని, 18 సంవత్సరాలు నిండి ఓటరు నమోదు, మార్పులు, చేర్పులు, సవరణకు వచ్చిన దరఖాస్తులను పరిశీలించేందుకు చర్యలు తీసుకోవాలని, ఏకరీతిగా ఫొటోలు ఉన్న జాబితా పరిశీలించి చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు. ఈ నెల 17న ఆయా జిల్లాలకు సంబంధించిన ఎపిక్ కార్డులను రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యాలయం నుంచి తీసుకువెళ్లాలని ఆదేశించారు. అదేవిధంగా ఈవీఎంలు భద్రపరచిన గోదాములను సందర్శిస్తూ ఉండాలని తెలిపారు.
జనవరి 1 నాటికి 18 సంవత్సరాలు నిండిన యువత ఆన్లైన్ ద్వారా ఓటరు జాబితాలో తమ పేర్లను నమోదుకు దరఖాస్తు చేసుకునేలా ప్రచారం, అవగాహన కల్పించాలని తెలిపారు. స్వీప్ యాక్టివిటీ నిర్వహించి ఓటు హక్కుపై ప్రజల్లో అవగాహన పెంపొందించాలని ఆయన సూచించారు.
రంగారెడ్డిజిల్లా నుంచి వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొన్న జిల్లా రెవెన్యూ అధికారి(డీఆర్వో)హరిప్రియ మాట్లాడుతూ.. జిల్లాలో నూతన ఓటర్లుగా నమోదైన 4,217మందికి జాతీయ ఓటరు దినోత్సవం జనవరి 25 వరకు ఫొటో ఓటర్ గుర్తింపు కార్డుతో పాటు, ఓటర్ కిట్ అందజేస్తామని తెలిపారు. ఓటరు నమోదు, మార్పులు, చేర్పులకు వచ్చిన దరఖాస్తులను పరిశీలిస్తామని తెలిపారు. వికారాబాద్ జిల్లా నుంచి జిల్లా కలెక్టర్ నిఖిల, ఎలక్షన్ సెక్షన్ తహసీల్దార్ శ్రీధర్ పాల్గొన్నారు. వీడియో కాన్ఫరెన్స్లో ఎన్నికల విభాగం అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.