షాబాద్, ఏప్రిల్ 26 : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న కంటి వెలుగు పథకం జిల్లాలో జోరుగా కొనసాగుతున్నది. రంగారెడ్డి జిల్లావ్యాప్తంగా 80 బృందాల ద్వారా ఏర్పాటు చేసిన కంటి వెలుగు శిబిరాల్లో మొత్తం 11,822 మందికి కంటి పరీక్షలు నిర్వహించారు. ఇందులో 609 మందికి కంటి అద్దాలు పంపిణీ చేశారు. 472 మందికి ప్రిస్క్రిప్షన్ అద్దాల కోసం ఆర్డర్ చేశారు. ఆయా మండలాల్లో నిర్వహిస్తున్న కంటి వెలుగు కేంద్రాలను జిల్లా, డివిజన్ స్థాయి ఆరోగ్యశాఖ అధికారులు సందర్శించి ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా కంటి పరీక్షలు చేయాలని సిబ్బందికి సూచిస్తున్నారు.
364 గ్రామాలు, 72 వార్డుల్లో కంటి వెలుగు శిబిరాలు
బొంరాస్పేట : వికారాబాద్ జిల్లాలో నిర్వహిస్తున్న కంటి వెలుగు వైద్య శిబిరాలకు ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తున్నది. 42 కంటి వెలుగు కేంద్రాల్లో వైద్య బృందాలు అప్పటికప్పుడే పరీక్షలు నిర్వహించి కంటి సమస్యలున్నవారికి చుక్కల మందుతో పాటు విటమిన్ మాత్రలు పంపిణీ చేస్తున్నారు. ప్రభుత్వం ఉచితంగా కంటి పరీక్షలు చేసి కండ్లద్దాలు పంపిణీ చేస్తుండడంపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. స్థానిక ప్రజా ప్రతినిధులు, మండలాల నోడల్ అధికారులు కంటి వెలుగు శిబిరాలను సందర్శించి పర్యవేక్షిస్తున్నారు. బుధవారం జిల్లాలో 5347 మందికి కంటి పరీక్షలు నిర్వహించారు. వీరిలో 740 మందికి రీడింగ్ గ్లాసులు పంపిణీ చేయగా, 752 మందికి అద్దాలను ఆర్డరిచ్చారు. జిల్లాలో ఇప్పటివరకు 364 గ్రామాలు, 72 వార్డుల్లో కంటి వెలుగు వైద్య శిబిరాలను నిర్వహించినట్లు డీఎంహెచ్వో పాల్వన్కుమార్ తెలిపారు.
సీఎం కేసీఆర్కు ధన్యవాదాలు ;– కె.శ్రీనాథం, ఊరెళ్ల గ్రామం, చేవెళ్ల మండలం
కంటి వెలుగుతో మాలాంటి పేదల జీవితాల్లో ప్రభుత్వం వెలుగులు నింపుతున్నది. మంచి కార్యక్రమం ప్రవేశపెట్టిన సీఎం కేసీఆర్కు రుణపడి ఉంటాం. ఊర్లకే వచ్చి కంటి పరీక్షలు చేసి అద్దాలు, మందులు ఇస్తున్నారు. నాకు చాలా సంతోషంగా ఉంది. సీఎం కేసీఆర్కు ధన్యవాదాలు.