షాబాద్, మే 4 : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న కంటి వెలుగు పథకం జిల్లాలో జోరుగా కొనసాగుతున్నది. ఆయా గ్రామాల్లో నిర్వహిస్తున్న క్యాంపులకు ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తున్నది. రంగారెడ్డిజిల్లా వ్యాప్తంగా 80 బృందాల ద్వారా ఏర్పాటు చేసిన కంటి వెలుగు శిబిరాల్లో మొత్తం 10,338 మందికి కంటి పరీక్షలు నిర్వహించారు. ఇందులో 566 మందికి కంటి అద్దాలు పంపిణీ చేశారు. 507 మందికి ప్రిస్క్రిప్షన్ అద్దాల కోసం ఆర్డర్ చేశారు.
400 గ్రామాలు, 78 వార్డుల్లో కంటి వెలుగు శిబిరాలు
బొంరాస్పేట : వికారాబాద్ జిల్లాలో 42 కంటి వెలుగు కేంద్రాల్లో వైద్య బృందాలు అప్పటికప్పుడే పరీక్షలు నిర్వహించి కంటి సమస్యలున్న వారికి చుక్కల మందుతో పాటు విటమిన్ మాత్రలు పంపిణీ చేస్తున్నారు. మంగళవారం 51455 మందికి కంటి పరీక్షలు నిర్వహించారు. వీరిలో 542 మందికి రీడింగ్ గ్లాసులు పంపిణీ చేయగా, 632 మందికి అద్దాలను ఆర్డరిచ్చారు. జిల్లాలో ఇప్పటివరకు 400 గ్రామాలు, 78 వార్డుల్లో కంటి వెలుగు వైద్య శిబిరాలను నిర్వహించినట్లు అధికారులు తెలిపారు.
అద్దాలు ఇచ్చిండ్రు.. : బి.రాములు, ఊరెళ్ల, చేవెళ్ల మండలం
బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన కంటి వెలుగు కార్యక్రమంతో గ్రామాల్లోని పేదల కంటి సమస్యలకు పరిష్కారం లభిస్తున్నది. పేదల బాగు కోసం సీఎం కేసీఆర్ ఇలాంటి ఎన్నో కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. కొద్ది రోజుల నుంచి నా కండ్లు మసకగా కనిపిస్తున్నాయి. మా గ్రామంలో ఏర్పాటు చేసిన కంటి వెలుగు శిబిరంలో పరీక్షలు చేయించుకొని మందులు, అద్దాలు తీసుకున్నా.