వికారాబాద్, ఏప్రిల్ 18, (నమస్తే తెలంగాణ): దిక్కులేని వారికి సీఎం కేసీఆరే దిక్కై దేవుడిలా ఆదుకుంటున్నారు. వృద్ధులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులు తదితరులకు ‘ఆసరా’ పింఛన్లను అందజేస్తూ వారిలో ఆత్మైస్థెర్యాన్ని నింపుతున్నారు. కొడుకులు, కోడళ్లకు చేయి చాపకుండా తమ ఖర్చులకు పింఛన్లను ఇస్తూ పెద్ద కొడుకులా ఆదుకుంటున్నారు. గత ప్రభుత్వాలు అరకొర పింఛన్లను అందజేస్తే ఎటు సరిపోకపోయేది. నెలకు రూ.2 కోట్లే ఖర్చు చేసి మమ అనిపించేవారు. తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సీఎం కేసీఆర్ నిరాశ్రయులకు పెద్దకొడుకులా, పెద్దన్నలా ఆపన్న హస్తం అందిస్తున్నారు. రూ.200 పింఛన్ను రూ.2016కు, రూ.500 పింఛన్ను రూ.3016కు పెంచి వారిలో కొండంత ధైర్యాన్ని నింపారు. వికారాబాద్ జిల్లాలో ఏటేటా లబ్ధిదారులు పెరుగుతుండడంతో ప్రస్తుతం 1.02 లక్షల మంది లబ్ధిపొందుతూ సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు తెలుపుతున్నారు.
అప్పట్లో ఏ దిక్కూలేని వారికి దేవుడే దిక్కు అనుకునేవారు, కానీ నేడు ఏ దిక్కూలేని వారికి సీఎం కేసీఆరే అండగా నిలుస్తూ దేవుడిలా ఆదుకుంటున్నారంటున్నారు. ఒకప్పుడు వంద రూపాయల కోసం కొడుకుల వద్ద పడిగాపులు కాయాల్సిన పరిస్థితి నుంచి మనుమలు, మనుమరాండ్రకు ఖర్చుల నిమిత్తం కొన్ని డబ్బులిచ్చేలా పరిస్థితి మారిపోయింది. మరొకరిపై ఆధారపడకుండా వారి ఖర్చులను చూసుకుంటూ, ఆరోగ్య సమస్యలకు సంబంధించి మందులు కొనుక్కోవడానికి ప్రభుత్వం నుంచి మంజూరవుతున్న ఆసరా పింఛన్ ఎంతో ఆసరా అవుతున్నదంటున్నారు వృద్ధులు, ఒంటరి మహిళలు.
సొంతవారు దూరమై..
వృధ్యాప్యంలో ఆదరణ కరువైన ఎంతోమంది పండుటాకులకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చే పింఛన్ పైసలే దిక్కవుతున్నాయి. అందరూ ఉండి కూడా కొంతమంది అనాథలవుతున్నారు. మరికొంతమంది ఎవరూ లేక అనాథలుగా మారుతున్నారు. ఇలాంటి ఎంతోమందికి ప్రతీ నెల ప్రభుత్వం ఇస్తున్న రూ.2016 వృద్ధాప్య పింఛనే వారికి జీవనాధారమైంది. దివ్యాంగులకు అందిస్తున్న రూ.3016 వారికి అండగా నిలుస్తున్నాయి. గత ప్రభుత్వాలు పంపిణీ చేసిన అరకొర పింఛన్లకు స్వస్తి పలికి మొదటిసారి అధికారంలోకి వచ్చిన వెంటనే రూ.200 పింఛన్ను రూ.1000లకు, రూ.500 పింఛన్ను రూ.1500లకు పెంచిన బీఆర్ఎస్ ప్రభుత్వం, రెండోసారి ప్రజలు బీఆర్ఎస్ ప్రభుత్వానికే పట్టం కట్టడంతో రూ.1000 పింఛన్ను రూ.2016లకు, రూ.1500 పింఛన్ను రూ.3016లకు పెంచిన ఘనత సీఎం కేసీఆర్దే. ఆసరా పింఛన్ల పెంపుతోపాటు పింఛన్ల వయోపరిమితిని 57 ఏండ్లకు తగ్గిస్తామని ఇచ్చిన హామీని కూడా ప్రభుత్వం అమల్లోకి తీసుకువచ్చింది.
ప్రతి నెలా రూ.26 కోట్లు ఖర్చు
పింఛన్ల నిమిత్తం గత ప్రభుత్వాలు నెలకు కేవలం రూ.2 కోట్లు ఖర్చు చేయగా.. బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం మొదట నెలకు రూ.12కోట్ల మేర పింఛన్ల నిమిత్తం ఖర్చు చేసింది. తదనంతరం పింఛన్ డబ్బులు రెట్టింపు కావడంతోపాటు వయోపరిమితి తగ్గించిన నేపథ్యంలో పింఛన్ల నిమిత్తం రాష్ట్ర ప్రభుత్వం నెలకు రూ.26 కోట్ల మేర ఖర్చు చేస్తున్నది. జిల్లావ్యాప్తంగా ఆసరా పింఛన్దారులు 1,02,780 మంది ఉండగా వృద్ధాప్య పింఛన్దారులు-35,250., వితంతువులు-49,228., దివ్యాంగులు-12,945., చేనేత కార్మికులు-168., కల్లుగీత కార్మికులు-468., బీడీ కార్మికులు 41., ఒంటరి మహిళలు 4680 మంది ఉన్నారు.
– దేవమ్మ, ఆసరా పింఛన్దారు
‘ఆసరా’తో బతుకుపై భరోసానిచ్చిండు
వికారాబాద్ జిల్లా కొడంగల్ మండలంలోని చిన్ననందిగామ గ్రామానికి చెందిన దేవమ్మకు ఎవరూ ఆసరా లేకపోవడంతో కేసీఆర్ అందిస్తున్న ఆసరా పింఛన్తో ఒంటరిగా జీవనం కొనసాగిస్తున్నది. 11 సంవత్సరాల క్రితం భర్త ఫకీరప్ప మృతి చెందడంతోపాటు బిడ్డలు కూడా లేకపోవడంతో అప్పటి నుంచి ఒంటరి జీవనాన్ని గడుపుతున్నానని, బతికేందుకు కనీసం భూమి కూడా లేక ఏవిధంగా కాలం గడపాలో ఆందోళనకు గురైనట్లు తెలిపారు. అప్పట్లో రూ.200 పింఛన్తో చాలీచాలని బతుకు బతకాల్సి వచ్చేదని.. కేసీఆర్ సార్ వచ్చిన తరువాత పింఛన్ పెంచడంతో ప్రస్తుతం నెలకు రూ.2016 అందుతున్నట్లు తెలిపారు. దీంతో ఆందోళన లేకుండా జీవిస్తున్నానని సంతోషాన్ని వ్యక్తం చేశారు. కుటుంబంలో ఎవరైనా అసరా ఉంటే బతకడానికి లోటు ఉండదని, కానీ ఎవరూ లేకపోతే వారి జీవితం ఎలా ఉంటుందో చెప్పలేనిదన్నారు. ఆసరా లేకుంటే ఒకరిపై ఆధారడి బతకాల్సిన పరిస్థితి ఉండేదన్నారు. నా మాదిరిగా ఎందరో పింఛన్ డబ్బులతో బతుకుతున్నవారు ఉన్నారు. దిక్కులేని వారికి సీఎం కేసీఆర్ దిక్కై ఆదుకుంటున్నారని.. ఆయన పది కాలాల పాటు చల్లంగా ఉండాలని ఆ భగవంతున్ని ప్రార్థిస్తున్నామని దేవమ్మ తెలిపారు.