కేంద్రియ మెట్ట వ్యవసాయ పరిశోధన సంస్థ డైరెక్టర్ వీ.కే.సింగ్
పంట మార్పిడిపై రైతులకు అవగాహన
కడ్తాల్, డిసెంబర్ 4 : భూసార సంరక్షణతోనే సుస్థిరమైన అధిక దిగుబడులు సాధ్యమవుతాయని కేంద్రియ మెట్ట వ్యవసాయ పరిశోధన సంస్థ డైరెక్టర్ వీ.కే.సింగ్ అన్నారు. శనివారం మండల పరిధిలోని న్యామతాపూర్ గ్రామంలో కేంద్రియ మెట్ట వ్యవసాయ పరిశోధన సంస్థ ఆధ్వర్యంలో భూసార పరీక్షల ప్రాధాన్యత, పంట మార్పిడులపై రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా సంస్థ డైరెక్టర్ వీ.కే.సింగ్ మాట్లాడుతూ.. అన్నదాతలు విధిగా భూసార పరీక్షలు చేయించుకోవాలని, పంటల సాగుకు 16 రకాల పోషకాలు అవసరమవుతాయని తెలిపారు. నేలలో పోషకాల లభ్యత విషయాలను తెలుసుకున్న తర్వాతే, అధికారులు సూచించిన ఎరువులను సరైన సమయంలో వాడితే పంటల సాగు ఖర్చు తగ్గడంతోపాటు అధిక దిగుబడులు సాధించవచ్చని పేర్కొన్నారు. ఐఎఫ్ఎఫ్సీవో ప్రతినిధులు మారుతీరావు, కృపాకర్ నానో ఎరువులు, వేప పూత ఎరువులు, యూరియా ఉత్పత్తుల గురించి రైతులకు వివరించారు. కేవీకే శాస్త్రవేత్తలు విద్యాశేఖర్, శ్రీకృష్ణ పంటల్లో భూసార పరీక్ష ఆధారంగా ఎరువుల వాడకం, జీవన ఎరువుల వాడటంతో కలిగే ప్రయోజనాలకు రైతులకు తెలియజేశారు. కేవీకే డాక్టర్ రమణ మాట్లాడుతూ.. భూసార పరీక్షలపై రైతులు అవగాహన పెంచుకొని, ఇతరులకు ఆదర్శంగా నిలువాలన్నారు. ఏడీఏ సుజాత మాట్లాడుతూ.. వరికి ప్రత్యామ్నాయంగా అపరాలు, నూనె గింజలు, కూరగాయలు, పండ్లు, పూల సాగుపై రైతులు దృష్టి సారించాలన్నారు. అనంతరం వరికి బదులు ప్రత్యామ్నాయ పంటల సాగుకు సంబంధించిన గోడ ప్రతులను అధికారులు ఆవిష్కరించారు. కార్యక్రమంలో సర్పంచ్ రవీందర్రెడ్డి, ఎంపీటీసీ గోపాల్, ఉప సర్పంచ్ యాదగిరి, వ్యవసాయశాఖ ఏవో శ్రీలత, ఏఈవో తేజస్విని, పంచాయతీ కార్యదర్శి జగన్, వార్డు సభ్యులున్నారు.