కడ్తాల్, ఆగస్టు 1 : అన్నదాతలు సేంద్రియ పద్ధతుల్లో పంటల సాగు చేపట్టాలని వాటర్ మేనేజ్మెంట్ ఫోరం, ది ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీర్స్ (ఇండియా) చైర్మన్ శ్యామ్ప్రసాద్రెడ్డి, సీజీఆర్ వ్యవస్థాపకురాలు లీలాలక్ష్మారెడ్డి అన్నారు. మండల పరిధిలోని అన్మాస్పల్లి గ్రామ సమీపంలో గల ఎర్త్ సెంటర్లో కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవెల్యూషన్ ఆధ్వర్యంలో రెండు రోజులుగా నిర్వహిస్తున్న సుస్థిర వ్యవసాయంపై అవగాహన సదస్సు ఆదివారం ముగిసింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో శ్యామ్ప్రసాద్రెడ్డి మాట్లాడుతూ గ్రామాల్లో రైతులందరూ సుస్థిర వ్యవసాయంపై అవగాహన కలిగి ఉండాలని తెలిపారు. నీటి వనరులను, వాన నీటిని వినియోగించుకోవాలన్నారు. పొలాల వద్ద ఇంకుడు గుంతలను ఏర్పాటు చేసుకుంటే భూగర్భ జలాలు పెరుగుతాయని చెప్పారు. వరి, పత్తి, మక్క పంటలతోపాటు చిరు ధాన్యాలను పండించాలని పేర్కొన్నారు. పంటల సాగులో రసాయనాల వినియోగాన్ని తగ్గించుకోవాలని, సేంద్రియ ఎరువులను వాడాలని తెలిపారు. నీటి సంరక్షణతోనే సుస్థిర వ్యవసాయం సాధ్యపడుతుందన్నారు. పలు జిల్లాల నుంచి వచ్చిన 30 మంది యువ రైతులు సుస్థిర వ్యవసాయంపై సందేహాలను సదస్సు నిర్వాహకులు నివృతి చేశారు. కార్యక్రమంలో గ్రామ భారతి ఫౌండేషన్ చైర్మన్ స్తంభాద్రిరెడ్డి, సభ్యులు హుస్సేన్బాబు, శ్రీనివాస్రెడ్డి, ఇందిరారెడ్డి, సత్యవర్ధన్రెడ్డి, సాయిభాస్కర్రెడ్డి, ఉమామహేశ్వర్రెడ్డి, కృష్ణ, వెంకటేశ్, రజనీకాంత్ ఉన్నారు.