8వ విడుత హరితహారానికి మొక్కల సంరక్షణ కోసం చర్యలు
అటవీశాఖ ఆధ్వర్యంలో 2, గ్రామ పంచాయతీల్లో 14 నర్సరీల నిర్వహణ
నర్సరీలను పర్యవేక్షిస్తున్న అధికారులు
ఇబ్రహీంపట్నంరూరల్, ఫిబ్రవరి 20 : రాష్ట్ర ప్రభుత్వం అడవుల శాతాన్ని పెంచడమే లక్ష్యంగా హరితహారాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్నది. మండలంలోని 14 గ్రామాల్లో 8వ విడుత హరితహారంలో సుమారు 5 లక్షల మొక్కలు నాటేందుకు 14 గ్రామపంచాయతీ నర్సరీలతో పాటు 2 అటవీశాఖ నర్సరీల్లో మొక్కలు పెంచుతున్నారు. ప్రతి సంవత్సరం వానకాలం ప్రారంభం నుంచి హరితహారం కార్యక్రమాన్ని పట్టణం, పల్లె అని తేడా లేకుండా మొక్కలు నాటుతారు. ఇందుకోసం అధికార యంత్రాంగం మొక్కలు పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నది. ఉపాధిహామీ, అటవీశాఖలు మొక్కల పెంపకాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. వచ్చే వానకాలం మొదలయ్యే నాటికి మొక్కలను పెంచాలని నర్సరీల నిర్వాహకులకు అవగాహన కల్పిస్తున్నారు. ముఖ్యంగా మొక్కలు బలంగా పెరిగేందుకు నర్సరీల నిర్వాహకులు పేడతో కలిపిన మిశ్రమాన్ని మొక్కలకు విరివిగా అందజేస్తున్నారు.
మండలంలో 5 లక్షల మొక్కల పెంపకం
మండలంలోని ఎలిమినేడు, కర్ణంగూడ గ్రామాల్లో అటవీశాఖ ఆధ్వర్యంలో మొక్కల పెంపకంతో పాటు మండలంలోని 14 గ్రామపంచాయతీల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నర్సరీల్లో వివిధ రకాల మొక్కలను పెంచుతున్నారు. మండలంలోని చర్లపటేల్గూడ, కర్ణంగూడ, నాగన్పల్లి, రాయపోల్, కప్పాడు, తుర్కగూడ, తులేకలాన్, పోల్కంపల్లి, నెర్రపల్లి, దండుమైలారం, పోచారం, ఉప్పరిగూడ, ఎలిమినేడు, ముకునూరు గ్రామాల్లో మొక్కలు పెంచుతున్నారు. ఇందులో ఒక్కో నర్సరీలో సుమారు 20 వేల వరకు మొక్కలు పెంచుతున్నారు. అటవీశాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నర్సరీల్లో సుమారు 2లక్షలకు పైగా వివిధ రకాల మొక్కలను సిద్ధం చేస్తున్నారు.
వర్షాలు కురిసే నాటికి అందుబాటులో..
ఇబ్రహీంపట్నం మండలంలోని 14 గ్రామపంచాయతీల్లో ఏమాత్రం తగ్గించకుండా మొక్కలు అధికంగా నాటించి మండలాన్ని జిల్లాలోనే అగ్రస్థానంలో నిలిపేందుకు కృషి చేస్తాం. ఇప్పటికే అన్ని గ్రామాల్లో నర్సరీల్లో మొక్కల పెంపకం కొనసాగుతున్నది. నర్సరీల్లో మొక్కలను ఎండల నుంచి కాపాడేందుకు నెట్హౌజ్లను కూడా ఏర్పాటు చేయించడంతో పాటు మొక్కలకు ఎప్పటికప్పుడూ నీటిని సిబ్బంది ద్వారా అందజేయిస్తున్నాం.
–క్రాంతికిరణ్, ఇన్చార్జి ఎంపీడీవో