రంగారెడ్డి, అక్టోబర్ 12 (నమస్తే తెలంగాణ) : జిల్లాలో కొవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా సాగుతున్నది. జిల్లాలో వ్యాక్సినేషన్ ప్రక్రియ లక్ష్యానికి మించి పూర్తయ్యింది. ఇప్పటివరకు మొదటి డోస్ 113 శాతానికి పైగా పూర్తికాగా.. రెండో డోస్ 50 శాతం పూర్తయ్యింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు వ్యాక్సినేషన్కు సంబంధించి జిల్లాలో ప్రత్యేక డ్రైవ్ నిర్వహించడంతో గత ఆరు నెలలుగా జిల్లాలోని అన్ని పీహెచ్సీల్లో సింగిల్ డిజిట్లోనే పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వ్యాక్సినేషన్ ప్రక్రియ జిల్లాలోని అన్ని సీహెచ్సీలతోపాటు మొబైల్ వాహనాల ద్వారా కొనసాగుతున్నది.
ఇప్పటివరకు 27 లక్షల మందికి వ్యాక్సినేషన్
జిల్లాలో వ్యాక్సినేషన్ ప్రక్రియ లక్ష్యానికి మించి పూర్తయ్యింది. ఇప్పటికే జిల్లాలో 113 శాతానికిపైగా వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తయ్యింది. జిల్లా ప్రజలే కాకుండా ఇతర జిల్లాల ప్రజలు కూడా జిల్లాలోని వ్యాక్సినేషన్ కేంద్రాల్లో వ్యాక్సిన్ వేయించుకుంటున్నారు. జిల్లావ్యాప్తంగా 27 లక్షల మందికి వ్యాక్సినేషన్ పూర్తికాగా, వీరిలో ఫస్ట్ డోస్కు సంబంధించి అర్హులైనవారు 19,40,539 మంది ఉండగా, ఇప్పటివరకు 21,84,623 మందికి వ్యాక్సినేషన్ పూర్తయ్యింది. సెకండ్ డోస్కు సంబంధించి ఇప్పటివరకు 50 శాతం మేర పూర్తయినట్లు సంబంధిత అధికారులు వెల్లడించారు.
జిల్లాలో శంకర్పల్లి మండలంలోని శేరిగూడ గ్రామంలో, 184 ప్రాంతాల్లో, పట్టణ ప్రాంతాల్లోని 201 కాలనీల్లోనూ 100 శాతం వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తయ్యింది. జిల్లాలోని పట్టణ ప్రాంతాల్లో మొబైల్ వాహనాల ద్వారా వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా కొనసాగుతున్నది. జిల్లా అంతటా వ్యాక్సినేషన్ పూర్తి చేయాలనే లక్ష్యంతో కాలనీలు, గ్రామాల్లో ప్రజల్లో వ్యాక్సినేషన్పై అవగాహన కల్పించడంతోపాటు క్షేత్రస్థాయికి వెళ్లి మరీ వైద్యబృందాలు వ్యాక్సిన్ వేస్తున్నారు. అన్ని మున్సిపాలిటీల్లోనూ మొబైల్ వాహనాల ద్వారా నేరుగా ప్రజల వద్దకే వెళ్లి వ్యాక్సినేషన్ చేస్తున్నారు. జిల్లావ్యాప్తంగా 24 మొబైల్ వాహనాల ద్వారా వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతున్నది.
ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థలకు సంబంధించి వ్యాక్సినేషన్ ప్రక్రియ దాదాపు పూర్తయ్యింది. 18 ఏండ్లు నిండిన ప్రతి ఒక్కరికి జిల్లాలోని ప్రభుత్వ వ్యాక్సినేషన్ కేంద్రాల్లో వ్యాక్సిన్ వేస్తున్నారు. మొబైల్ యాప్తోపాటు నేరుగా ఆధార్ కార్డులతో వెళ్లిన వారికి వెంటనే వ్యాక్సిన్ వేస్తున్నారు. జిల్లాలో ఫస్ట్ డోస్ వ్యాక్సినేషన్ దాదాపు పూర్తికాగా, సెకండ్ డోస్ వ్యాక్సినేషన్ ప్రక్రియ వంద శాతం పూర్తయ్యేలా సంబంధిత అధికారులు దృష్టి సారించారు.