యాలాల, జూలై 19 : వర్షాకాలంలో ప్రజలందరూ అప్రమత్తతతో వ్యవహరించడం చాలా ముఖ్యమని ఎంపీపీ బాలేశ్వరగుప్తా అన్నారు. సోమవారం యాలాల మండలం లక్ష్మీనారాయణపూర్ చౌరస్తాలో వర్షం కారణంగా గుంతలు పడ్డ రోడ్డు మార్గాన్ని ఎంపీపీ బాలేశ్వరగుప్తా తన సొంత ఖర్చులతో బాగు చేయించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. నీటి నిలువ ఎక్కువగా ఉన్న చోట కరెంటు స్తంభాలను తాకరాదన్నారు. విద్యుత్ శాఖ సూచనలను ప్రజలందరూ తప్పక పాటించాలన్నారు. ఎక్కడైనా కరెంటు తీగలు తెగిపడినా, స్తంభాలు విరిగి పడినా వెంటనే లైన్మన్కుగాని.. సంబంధిత సబ్స్టేషన్కుగాని తెలియజేయాలన్నారు. రైతులందరూ విద్యుత్ మోటర్ల వద్ద జాగ్రత్తగా ఉండాలన్నారు. మండల అభివృద్ధి కార్యక్రమాలపై ప్రత్యేక దృష్టి సారించామన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో కనీస వసతుల రూపకల్పనకు ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తున్నామని ఆయన పేర్కొన్నారు.