రంగారెడ్డి, ఆగస్టు 4, (నమస్తే తెలంగాణ): ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమం జిల్లాలో లక్ష్యానికి చేరువలో ఉంది. ఈ ఏడాది నిర్దేశించిన టార్గెట్కు అనుగుణంగా మొక్కలు నాటే కార్యక్రమం కొనసాగుతున్నది. ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజలు భాగస్వాములవుతుండడంతో జిల్లావ్యాప్తంగా పండుగలా హరితహారం కొనసాగుతున్నది. మరో పదిహేను రోజుల్లో హరితహారం కార్యక్రమాన్ని ముగించేందుకు సంబంధిత అధికారులు చర్యలు చేపట్టారు. హరితహారం కార్యక్రమంలో భాగంగా రోడ్లకు ఇరువైపులా, ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వ స్థలాల్లో మొక్కలను నాటుతున్నారు. ఈ ఏడాది అవెన్యూ ప్లాంటేషన్(రోడ్లకు ఇరువైపులా మొక్కలు నాటడం)కు అధిక ప్రాధాన్యతనిచ్చారు. ప్రతి మొక్కను సంరక్షించేలా జిల్లా యంత్రాంగం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ప్రతి మొక్కకూ జియో ట్యాగింగ్ చేస్తున్నారు. ప్రభుత్వం రూపొందించిన జియో ట్యాగింగ్ యాప్లో ఎక్కడెక్కడ ఎన్ని మొక్కలు నాటారనే వివరాలు కూడా ఎప్పటికప్పుడు పొందుపరుస్తున్నారు. అంతేకాకుండా ఎక్కడైతే మొక్కలు నాటుతారో అక్కడ నావిగేషన్తో మొక్కల ఫొటోలు తీసి ఆన్లైన్లో పొందుపరుస్తున్నారు. జియోట్యాగింగ్ ప్రక్రియతో నాటిన మొక్క ఏ విధంగా ఉందనేది ఆన్లైన్ ఆధారంగా తెలుసుకోవచ్చు.
ఇప్పటివరకు నాటిన 60 లక్షల మొక్కలు
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన తెలంగాణకు హరితహారం కార్యక్రమం జిల్లాలో ఈ ఏడాది నిర్దేశించిన లక్ష్యంలో 81 శాతం పూర్తి చేశారు. ఈ ఏడాది ప్రధానంగా పండ్ల మొక్కలతోపాటు నీడనిచ్చే మొక్కలను నాటేందుకు ప్రాధాన్యమిస్తున్నారు. ఈ ఏడాది ప్రధానంగా టేకు, శ్రీగంధం, ఉసిరి, నల్లమద్ది, తెల్లమద్దితోపాటు పూలు, పండ్లు జామ, నిమ్మ, సీతాఫల్, దానిమ్మ, బొప్పాయి, మునగ, గులాబీ, మందారం, మల్లె, కానుగ, నెమలినార తదితర మొక్కలను నాటుతున్నారు. జిల్లా వ్యాప్తంగా ఈ ఏడాది తెలంగాణకు హరితహారంలో భాగంగా 74 లక్షల మొక్కలను నాటాలని లక్ష్యంగా పెట్టుకోగా,. ఇప్పటివరకు 60.17 లక్షల మొక్కలు నాటే ప్రక్రియ పూర్తయింది. గ్రామాల్లో ఇంటింటికీ ఆరు మొక్కల చొప్పున పంపిణీ చేస్తున్నారు. ఇంటి ఆవరణలో జామ, కరివేపాకు, దానిమ్మ, బొప్పాయి, పూల మొక్కలైన గులాబీ, మందారం, మల్లె మొక్కలతోపాటు గ్రామాల పరిధిలో వివిధ మొక్కలను నాటుతున్నారు. అదేవిధంగా ఆయా శాఖలకు నిర్దేశించిన లక్ష్యానికి అనుగుణంగా మొక్కలు నాటే కార్యక్రమం దాదాపు పూర్తి కావొచ్చింది.
ఆయా శాఖల వారీగా..
అటవీ శాఖ ఆధ్వర్యంలో 6.48 లక్షల మొక్కలు, విద్యాశాఖ 13 వేల, జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ 22.60 లక్షలు, జిల్లా పంచాయతీ శాఖ 26.99 లక్షలు, వ్యవసాయ శాఖ 12 వేలు, ఎక్సైజ్ శాఖ 21,300, జిల్లాలోని 16 మున్సిపాలిటీల్లో 2.50 లక్షలు, జిల్లా పరిశ్రమల శాఖ 43 వేల, ఉద్యానవన శాఖ 54 వేల, గిరిజన సంక్షేమ శాఖ 18 వేల, గనుల శాఖ 25,900 మొక్కలను నాటారు.
మొక్కల సంరక్షణకు చర్యలు
జిల్లాలో హరితహారం కార్యక్రమంలో భాగంగా ఈ ఏడాది అధిక మొత్తంలో మొక్కలు నాటాం. ఇప్పటివరకు 80 శాతం టార్గెట్ పూర్తయింది. మరో వారం, పది రోజుల్లో టార్గెట్కు అనుగుణంగా మొక్కలు నాటే ప్రక్రియను పూర్తి చేసేందుకు చర్యలు చేపడుతాం. అదేవిధంగా నాటిన ప్రతి మొక్కకూ జియోట్యాగింగ్ చేసి, సంరక్షణకు తగు చర్యలు చేపట్టాం.