ఇటు అన్నదాతలు, అటు మహిళల ఆర్థిక బలోపేతానికి రంగారెడ్డి జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ కృషి
ఎస్హెచ్జీల ఆధ్వర్యంలో కూరగాయలు, పండ్లు, పూల తోటల సాగు
తక్కువ పెట్టుబడితో పంటలు సాగయ్యేలా అధికారుల పక్కా ప్రణాళిక
పంటలను నేరుగా కొనుగోలు చేయనున్న మహిళా సంఘాలు
ఐదేండ్లుగా పైలెట్ ప్రాజెక్టు యాచారం ఎఫ్పీసీ సఫలం
వచ్చేనెల నుంచి మరో ఆరు మండలాలు ఎంపిక
వ్యవసాయ, ఉద్యానవన శాఖల ఆధ్వర్యంలో రైతులకు ప్రత్యేక శిక్షణ
వ్యవసాయ ఉత్పత్తిదారుల సంఘాల నిర్వహణకు రూ.50 లక్షల నిధులు
జిల్లాలో 652 సంఘాలు, 10,111 మంది సభ్యులు
రంగారెడ్డి, ఫిబ్రవరి 19, (నమస్తే తెలంగాణ):ఇటు రైతన్నలు, అటు మహిళా సంఘాల ఆర్థిక బలోపేతానికి రంగారెడ్డి జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఎస్హెచ్జీల ఆధ్వర్యంలో కూరగాయలు, పండ్లు, పూల తోటలను సాగు చేసి, పంట చేతికొచ్చాక వారే నేరుగా కొనుగోలు చేయనున్నారు. సెర్ప్ ఆధ్వర్యంలో నేల స్వభావాన్ని బట్టి ఆధునిక పద్ధతులతో పంటలను సాగు చేసి రైతులు లాభాలు ఆర్జించేలా అధికారులు పక్కా ప్రణాళికను రూపొందించారు. పంటల సాగు ఎలా చేయాలన్నదానిపై 5 ఎకరాల్లోపు ఉన్న సన్న, చిన్నకారు రైతులతో పాటు వ్యవసాయ ఉత్పత్తిదారుల సంఘాలకు వ్యవసాయ శాఖ, ఉద్యాన శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక శిక్షణ ఇచ్చేందుకూ జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు చేస్తున్నది. ఇప్పటికే పైలెట్ ప్రాజెక్టుగా యాచారం ఎఫ్పీసీ(రైతు ఉత్పత్తి కేంద్రం) ఐదేండ్లుగా కొనసాగుతూ సత్ఫలితాలిస్తున్నది. వ్యవసాయ ఉత్పత్తి కేంద్రం నిర్వహణకుగాను ప్రభుత్వం సెర్ప్ ద్వారా రూ.50 లక్షల నిధులనూ మంజూరు చేస్తున్నది. వచ్చేనెల నుంచి రైతు ఉత్పత్తి కేంద్రాల ఏర్పాటుకు తలకొండపల్లి, కేశంపేట, చేవెళ్ల, చౌదరిగూడెం, కొందుర్గు, షాబాద్ మండలాలూ ఎంపికయ్యాయి. రంగారెడ్డి జిల్లాలో 652 సంఘాలు ఉండగా, 10,111 మంది సభ్యులు ఉన్నారు.
జిల్లాలో చిన్న, సన్నకారు రైతులను సామాజికం గా, ఆర్థికంగా బలోపేతం చేయడమే లక్ష్యంగా జిల్లా యంత్రాంగం చర్యలు చేపట్టింది. మహిళా స్వయం సహాయక సంఘాల(ఎస్హెచ్జీ) ద్వారా కూరగాయల సాగుతోపాటు ఎస్హెచ్జీల ఆధ్వర్యంలోనే కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు ప్రణాళికను రూపొందించారు. అయితే జిల్లాలో ఇప్పటికే అధిక మొత్తంలో కూరగాయలను సాగు చేస్తున్న నేపథ్యంలో మరిం త మేర కూరగాయలు, పూలు, పండ్ల తోటలను పెంచాలని అధికారులు నిర్ణయించారు. ఇప్పటికే పైలట్ ప్రాజెక్టుగా యాచారం ఎఫ్పీసీ(రైతు ఉత్పత్తి కేంద్రం)ని గత ఐదేండ్ల నుంచి అందుబాటులోకి తీసుకురాగా, వచ్చే నెల నుంచి మరికొన్ని మండలాల్లో ఎస్హెచ్జీల ఆధ్వర్యంలో రైతు ఉత్పత్తి కేం ద్రాల ఏర్పాటుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఓ వైపు రైతులను ప్రోత్సహిస్తూనే, మరోవైపు మహిళా సంఘాల సభ్యుల ద్వారా కూడా ప్రత్యామ్నాయ పంటలను సాగు చేసేలా ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే జిల్లాలో వ్యవసాయ ఉత్పత్తిదారుల సంఘాలను ఏర్పాటు చేసి, ఆయా మండలాల్లో భూములకు అనువుగా ఉండే పంటలను సాగు చేసేందుకు జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు పక్కా ప్రణాళికను రూ పొందించారు. అయితే మహిళా వ్యవసాయ ఉత్పత్తిదారుల సంఘాల ఆధ్వర్యంలో చేసే పంటల సా గు, కొనుగోలు, మార్కెటింగ్కు అయ్యే ఖర్చును ఉత్పత్తిదారుల సంఘాల సభ్యులు మెంబర్షిప్ డబ్బులతోపాటు సెర్ప్ ద్వారాప్రభుత్వం వారికి నిధులు మంజూరు చేస్తుంది. మహిళా వ్యవసాయ ఉత్పత్తిదారుల సంఘాల ఏర్పాటుతో దళారీ వ్యవస్థకు పూర్తిగా చెక్ పడనుంది.
652 సంఘాలు…10,111 మంది సభ్యులు
తక్కువ సమయం, తక్కువ పెట్టుబడితో రైతులందరూ అధిక లాభాలను ఆర్జించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా జిల్లాలో మహిళా వ్యవసాయ ఉత్పత్తిదారుల సంఘాల ఆధ్వర్యంలో కూరగాయలు, పూల పంటలను సాగు చేయించాలని గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు నిర్ణయించారు. రంగారెడ్డి జిల్లాలో ఎక్కువగా ఎర్ర, నల్లరేగడి నేలలు ఉన్న నేపథ్యంలో సంబంధి త నేలలకు అనుగుణంగా కూరగాయలు, టమాట, ఆకుకూరలు, క్యారెట్ తదితర పంటల సాగు వైపు రైతులు దృష్టి సారించేలా చర్యలు తీసుకుంటున్నారు. కూరగాయలు, పూలు, పండ్ల పంటల సాగుపై మహిళా వ్యవసాయ ఉత్పత్తిదారుల సంఘాలకు వ్యవసాయ శాఖతోపాటు ఉద్యానవన శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక శిక్షణ ఇప్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే ప్రధానంగా సెర్ఫ్ ఆధ్వర్యంలో సన్న, చిన్నకారు రైతులు ఆర్థికంగా ఎదిగేందుకు ఆధునిక యాంత్రిక పద్ధతిలో పంటలను సాగు చేసేందుకు, తక్కువ పెట్టుబడితో ఎక్కువ సాగు విస్తీర్ణం పెంచేలా.. పండిన ఉత్పత్తులను నేరుగా మార్కెట్కు తరలించేలా ఏర్పాట్లు చేశారు.
అయితే జిల్లాలో 652 మహిళా వ్యవసాయ ఉత్పత్తిదారుల సంఘాలుండగా అందులో 10,111 మంది సభ్యులున్నారు. ఈ ఉత్పత్తిదారుల సంఘాల్లో మహిళా సంఘాల్లో సభ్యులై ఉండి, చిన్న, సన్నకారు (ఐదు ఎకరాల్లోపు భూమిగల) వ్యవసాయ కుటుంబాలకు చెందిన వారిని సభ్యులుగా నియమించుకున్నారు. వారు తమ వాటాగా సంఘాల నిర్వహణకు ఒక్కొక్కరు రూ.600 పెట్టుబడి పెట్టారు. అదేవిధంగా ఉత్పత్తిదారుల సంఘాల ఆధ్వర్యంలో చేసే సాగుకు అవసరమయ్యే వ్యవసాయ యంత్రాలు, పనిముట్లు మండల మహిళా సమాఖ్యల ఆధ్వర్యంలో కొనసాగుతున్న కస్టమ్ హైరింగ్ కేంద్రాల ద్వారా సబ్సిడీతో అందుతాయి. ఈ సంఘాలకు ప్రభుత్వ గుర్తింపు ఉండటంతో దళారులతో మోసపోకుండా ప్రభు త్వం నిర్ణయించిన ధరకే విత్తనాలు, ఎరువులను పొందొచ్చు. పంట చేతికొచ్చిన తర్వాత ఉత్పత్తిదారుల సంఘం సభ్యులు రైతులను నుంచి నేరుగా పంటను సేకరించి విక్రయించనుంది. దీంతో రైతులు ప్రభుత్వ మద్దతు ధరను పొందొచ్చు.
పైలట్ ప్రాజెక్టుగా యాచారం ఎఫ్పీసీ
ఎస్హెచ్జీల ఆధ్వర్యంలో కూరగాయల సాగు, మార్కెటింగ్కు సంబంధించి జిల్లాలో పైలట్ ప్రాజెక్టుగా యాచారం రైతు ఉత్పత్తి కేంద్రాన్ని ఏర్పాటు చేశా రు. దీనిని 2016లో మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. అయితే యాచారం, ఇబ్రహీంపట్నం, మంచాల మండలాల ఆధ్వర్యంలో ఒకటే ఉత్పత్తి కేంద్రాన్ని ఏర్పాటు చేయగా.. గత ఐదేండ్లుగా సంబంధిత మండలాల్లో 163 మంది రైతుల ఆధ్వర్యంలో కూరగాయలను సాగు చేస్తున్నారు. యాచారం ఉత్పత్తి కేంద్రం నిర్వహణ కోసం ప్రభు త్వం సెర్ఫ్ ద్వారా రూ.50 లక్షలను మంజూరు చేసింది. యాచారం రైతు ఉత్ప త్తి కేంద్రం సక్సెస్ కావడంతో జిల్లాలోని మరిన్ని మండలాల్లో ఉత్పత్తి కేంద్రాల ఏర్పాటుకు సెర్ప్ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. యాచారం ఎఫ్పీసీ ఆధ్వర్యంలో యాసంగి సీజన్లో 68 ఎకరాల్లో 100 మెట్రిక్ టన్నుల కూరగాయల సాగును లక్ష్యంగా పెట్టుకున్నారు. అదేవిధంగా వచ్చే నెల నుంచి జిల్లాలోని తలకొండపల్లి, కేశంపేట, చేవెళ్ల, చౌదరిగూడెం, కొందుర్గు, షాబాద్ మండలాల్లో స్వయం సహాయక సంఘాల ఆధ్వర్యంలో రైతు ఉత్పత్తి కేంద్రాలను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు అధికారులు నిర్ణయించారు.
చిన్న, సన్నకారు రైతుల ఆర్థిక వృద్ధే లక్ష్యం
జిల్లాలోని చిన్న, సన్నకారు రైతుల ఆర్థికాభివృద్ధే లక్ష్యంగా ప్రభుత్వం ఎస్హెచ్జీల ఆధ్వర్యంలో రైతు ఉత్పత్తి కేంద్రాల ఏర్పాటుకు నిర్ణయించింది. ఇప్పటికే యాచారం ఎఫ్పీసీ కొనసాగుతుండగా వచ్చే నెల నుంచి మరో ఆరు మండలాల్లో రైతు ఉత్పత్తి కేంద్రాలను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నాం. మహిళా స్వయం సహాయక సంఘాల ఆధ్వర్యంలో కూరగాయల సాగుతోపాటు పండించిన పంటను సేకరించి మార్కెటింగ్ చేయడం, రైతులు లాభాలు పొందేలా ప్రణాళికను రూపొందించడం జరిగింది. దీంతో జిల్లాలో మరిన్ని ఎకరాల్లో కూరగాయల సాగు విస్తీర్ణం కూడా పెరుగనుంది.
– కె.జంగారెడ్డి, డీఆర్డీఏ ఏపీడీ రంగారెడ్డి జిల్లా