యాచారం, సెప్టెంబర్ 21: పల్లెల్లో పచ్చదనాన్ని పెంపొందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం వినూత్న పద్ధతులు అవలంభిస్తున్నది. పర్యావరణ సమతుల్యత కోసం హరితహారంలో భాగం గా విరివిగా మొక్కలు నాటుతున్నారు. గ్రామానికో ప్రకృతి వనం ఏర్పాటు చేస్తున్నారు. తాజాగా మండలానికో బృహత్ ప్రకృతి వనం ఏర్పాటు చేసి, అందులో మొక్కలు నాటి అడవుల శాతాన్ని పెంచడానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. పుష్కలంగా వర్షాలు కురిసేందుకు మొక్కలను చెట్లుగా, దట్టమైన అడవులుగా పెంచేందుకు ప్రభుత్వం కృషి చేస్తున్నది.
మియావాకీ తరహాలో ప్రకృతి వనం..
చిట్టడవుల పెంపకంపై దృష్టి సారించిన రాష్ట్ర ప్రభుత్వం జపాన్లో విజయవంతమైన మియావాకీ విధానాన్ని బృహత్ ప్రకృతి వనం ద్వారా అమలుచేస్తున్నది. ఈజీఎస్ ఆధ్వర్యంలో ముమ్మరంగా మొక్కలు నాటుతున్నారు. యాచారం మండల కేంద్రంలోని ఆరెకరాల స్థలంలో బృహత్ ప్రకృతి వనాన్ని ఏర్పాటు చేశారు. వివిధ రకాల మొక్కలు నాటి, వాటిని సంరక్షిస్తున్నారు. ఇది ఇతర మండలాలకు ఆదర్శంగా నిలుస్తున్నట్లు ఉన్నతాధికారులు కితాబిచ్చారు. ఎంపీడీవో మమతాబాయి సమక్షంలో ఏపీవో లింగయ్య పర్యవేక్షణలో బృహత్ ప్రకృతి వనం అందంగా, ఆహ్లాదకరంగా తీర్చిదిద్ది, పచ్చదనం ఉట్టిపడేలా కృషి చేస్తున్నారు.
ఆరు ఎకరాల్లో బృహత్ ప్రకృతి వనం
మండల కేంద్రంలో బృహత్ ప్రకృ తి వనం ఏర్పాటు చేసేందుకు ఆరు ఎకరాల ప్రభుత్వ భూమిని తహసీల్దార్ నాగయ్య కేటాయించారు. రాళ్లు, పిచ్చి మొక్కలు, చెట్ల పొదలతో ఉన్న స్థలాన్ని ఎంపీడీవో సమక్షంలో ఈజీఎస్ అధికారులు బృహత్ ప్రకృతి వనం కోసం సిద్ధం చేశారు. జేసీబీ సహాయంతో స్థలాన్ని చదును చేశారు. మండలంలోని వివిధ గ్రామాల నర్సరీల నుంచి, అటవీ శాఖ నర్సరీల నుంచి, ఇతర ప్రాంతాల నుంచి సరిపడా మొక్కలు తెచ్చి, అందులో నాటుకున్నారు. ఈజీఎస్ ఆధ్వర్యంలో గుంతలు తీసి మొక్కలు నాటారు. బృహత్ ప్రకృతి వనంలో నీడ నిచ్చే, పండ్లు, ఔషధ మొక్కలు సుమారు 15,000 నాటారు. వాటికి సపోర్టుగా వెదురు కట్టెలు కట్టారు. వాకింగ్ కోసం ఆరు మీటర్ల వెడల్పుతో వాకింగ్ ట్రాక్ నిర్వహించారు. పిల్లలు ఆడుకునేందుకు పలు రకాల వసతులు కల్పించనున్నారు. ప్రకృతి వనం చుట్టూ కంచె ఏర్పాటుచేశారు.
15వేల మొక్కల పెంపకం
యాచారంలోని ఆరెకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన బృహత్ ప్రకృతి వనంలో మొత్తం 47 రకాలకు సం బంధించిన 15 వేల మొక్కలు నాటారు. ఇందులో వేప, చింత, దానిమ్మ, టేకు, బొప్పాయి, మునగ, అల్లనేరేడు, ఇప్ప, మేడి, మర్రి చెట్టు, రావి, సీతాఫలం, జమ్మి, జామ, కానుగ, జువ్వి, ఉసిరి, వెలగ, మద్ది, మామిడి, వెదురు, మారెడు, మందారం, చామంతి, గులాబీ, గన్నేరు, జాజిమల్లె, మచ్చపత్రం, గోరింటాకు, కుంకుడు, నిమ్మ, తులసి, ఉత్తరేణి, నందివర్దనం, టెకోమో, ఆరె, తానే, కరక్కాయ, గుల్మోహర్, పులిచింత, సిలికాన్, సిసు, కోనోకార్ఫస్, చైనాబాదాం మొక్కలు పెంచుతున్నారు. మొక్కలను నాటి, సంరక్షించి చిట్టడివిగా మార్చడమే ప్రభుత్వ లక్ష్యమని, ఆ దిశగా కృషి చేస్తున్నామని అధికారులు చెబుతున్నారు.
అలరిస్తున్న పెయింటింగ్స్
బృహత్ ప్రకృతి వనంలో ఉన్న రాళ్లు, గుట్టలకు రకరాల రంగులు వేసి, వివిధ రకాల పెయింటింగ్స్ వేస్తున్నారు. పచ్చని చెట్ల మధ్య గుట్ట ప్రాంతంలో వేసిన చిత్రాలు చూపరులను ఎంతగానో అలరిస్తున్నాయి. అడవులు పెంచాలని, మొక్కలను సంరక్షించాలని, చెట్లను నరికివేయవద్దని, వర్షం నీటిని ఒడిసి పట్టాలని, జంతువులను, పక్షులను సంరక్షించాలని, పర్యావరణాన్ని పరిరక్షించాలనే సందేశాలను ప్రజలకు తెలిపే బొమ్మలు వేశారు. ఇవి రంగు రంగులతో ఎంతో అద్భుతంగా, అందంగా ఉన్నాయి. యాచారం బృహత్ ప్రకృతి వనాన్ని ఆదర్శంగా నిలిపేందుకు అధికారులు కృషి చేస్తున్నారు.