బంట్వారం మండలంలో ఆకస్మికంగా పర్యటించిన వికారాబాద్ జిల్లా కలెక్టర్ పౌసుమిబసు
బంట్వారం, ఆగస్టు 30 : పాఠశాలలకు ఉపాధ్యాయులు హాజరై అన్ని సౌకర్యాలను ఏర్పాటు చేసుకొని, విద్యార్థులకు మంచి వాతావరణం ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఆదేశించినా మీకు పట్టింపు లేదా.. కనిష్టంగా బ్లాక్ బోర్డును గోడకు తగిలించరా.. ఇది కూడా నేనే చెప్పాలా.. అంటూ మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్పై జిల్లా కలెక్టర్ పౌసుమిబసు మండిపడ్డారు. సోమవారం ఆమె మండలంలో పర్యటించి మోడల్ స్కూల్, జడ్పీహెచ్ఎస్, వెటర్నరీ దవాఖానను సందర్శించి పరిశీలించారు. మోడల్ స్కూల్లో తరగతి గదిలోకి కలెక్టర్ వెళ్లి చూడగా.. బ్లాక్(గ్రీన్) బోర్దును కుర్చీలపై ఉంచి పాఠాలు బోధిస్తున్నారు. ఇది సరైన పద్ధతి కాదు. బ్లాక్ బోర్డును గోడకు తగిలించాలని నేను చెప్పితేగాని మీకు తెలియదా అంటూ ప్రశ్నించారు. ప్రిన్సిపాల్ సర్దిచెప్పేందుకు ప్రయత్నించగా.. సంజాయిషీ కాదు.. వెంటనే అన్ని తరగతి గదుల్లో గోడలకు బోర్డులను పెట్టాలని ఆదేశించారు. వరండాలో చెత్త కాగితాలు, సిమెంట్ బస్తాలు ఉండడం, పాడైన ఫర్నిచర్ ఎక్కడ పడితే అక్కడ పారవేయడంతో.. వీటిని వెంటనే తొలగించి, తనకు ఫొటోలు పెట్టాలని ఎంఈవో చంద్రప్పను ఆదేశించారు. స్కూల్లో అన్ని సౌకర్యాలు ఉన్నప్పటికీ నిర్వహణ సక్రమంగా లేదని ప్రిన్సిపాల్పై అసహనం వ్యక్తం చేశారు. అనంతరం జడ్పీహెచ్ఎస్ను సందర్శించి అక్కడి పరిసరాలు, తరగతి గదులు, బెంచీలను చూసి సంతృప్తి వ్యక్తం చేశారు. అక్కడి నుంచి సల్బత్తాపూర్-బంట్వారం రోడ్డులో అవెన్యూ ప్లాంటేషన్లో మొక్కలు నాటారు. స్థానిక వెటర్నరీ దవాఖానను సందర్శించి అక్కడి సౌకర్యాలు అడిగి తెలుసుకున్నారు. పశువులకు వ్యాక్సినేషన్ను పరిశీలించారు. కార్యక్రమంలో ఎంపీపీ ప్రభాకర్, సర్పంచ్ లావణ్య, అడిషనల్ పీడీ, ఎంపీడీవో బాలయ్య, ఏవో సంధ్య పాల్గొన్నారు.
ప్రజా సమస్యల పరిష్కారానికి డయల్ యువర్ గ్రీవెన్స్
ప్రజా సమస్యల పరిష్కారానికి డయల్ యువర్ గ్రీవెన్స్ నిర్వహిస్తున్నామని కలెక్టర్ పౌసుమిబసు తెలిపారు. వికారాబాద్ కలెక్టరేట్లో డయల్ యువర్ గ్రీవెన్స్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వివిధ సమస్యలపై 44 ఫిర్యాదులు వచ్చాయి. జిల్లాలో ప్రతి సోమవారం వివిధ శాఖలకు సంబంధించిన ప్రజా సమస్యలను, అలాగే ప్రతి బుధవారం ప్రత్యేకంగా ధరణి- భూ సమస్యలు మాత్రమే పరిష్కరిస్తారమని సూచించారు. జిల్లా విద్యాధికారి, డీపీవో, జిల్లా సంక్షేమ అధికారులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఆయా శాఖల అధికారులు అందుబాటులో ఉండి సమస్యలు పరిష్కరించాలని ఆదేశించారు. జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నందున ఎలాంటి ప్రమాదాలు జరుగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు సూచించారు. గ్రామాల్లో బ్లీచింగ్ పౌడర్, శానిటేషన్, పారిశుధ్య పనులు చేపట్టాలన్నారు. కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ మోతీలాల్ పాల్గొన్నారు.