శంకర్పల్లి, అక్టోబర్ 18: పల్లె ప్రగతి కార్యక్రమంతో మోకిల గ్రామం అభివృద్ధిలో దూసుకుపోతున్నది. గ్రామంలోని కాలనీల్లో రోడ్లు పచ్చని చెట్లతో ఆహ్లాదాన్ని పంచుతున్నాయి. ప్రతి గల్లీలో సీసీ రోడ్లు వేశారు. ఈ గ్రామంలో కొన్ని ప్రాంతాల్లో 111 జీవో మినహాయింపు ఉన్నందున గ్రామ శివారులో విలాసవంతమైన కాలనీలు ఏర్పడ్డాయి. హైదరాబాద్కు 30 కి.మీ.ల దూరంలో మోకిల గ్రామం ఉన్నందున ప్రజలు ఉదయం సాయంత్రం నగరానికి వెళుతుంటారు. దీనికి తోడు గండిపేట్ చౌరస్తా నుంచి శంకర్పల్లి ప్రధాన చౌరస్తా వరకు నాలుగు లేన్ల రోడ్డు సౌకర్యం ఉన్నందున తక్కువ సమయంలో నగరానికి రాకపోకలు కొనసాగిస్తున్నారు.
హరిత శోభను సంతరించుకున్న పల్లె
శంకర్పల్లి మండలం మోకిల గ్రామం పల్లె ప్రగతి కార్యక్రమంతో హరిత శోభను సంతరించుకున్నది. గ్రామ శివారులో ఏర్పాటు చేసిన పల్లె ప్రకృతి వనంలో రకరకాల మొక్కలు పెంచుతున్నారు. ప్రకృతి వనం పక్కనే రూ.12 లక్షలతో రైతు వేదిక భవనం నిర్మించారు. ఈ వనం ప్రధాన రోడ్డు పక్కనే ఉండడంతో ఆ మార్గంలో వెళ్లే ప్రయాణికులకు ఆహ్లాదకర వాతావరణాన్ని అందిస్తున్నది.
అన్ని సౌకర్యాలతో వైకుంఠధామం
గ్రామంలో అన్ని సౌకర్యాలతో వైకుంఠధామాన్ని నిర్మించారు. అంతిమ సంస్కారాలకు వచ్చే వారికి ఎలాంటి ఇబ్బంది కలుగకుండా సీసీ రోడ్డును నిర్మించారు. ప్రత్యేక స్నానపు గదులు నిర్మించారు. రాత్రి వేళలో వెలుతురు కోసం వీధి దీపాలు కూడా ఏర్పాటుచేశారు.
తాగు నీటి సౌకర్యం
గ్రామంలోని అన్ని వార్డులకు మిషన్ భగీరథ నీరు అందేలా ఏర్పాటుచేశారు. 40 వేల లీటర్ల సామర్థ్యం గల ట్యాంకు నిర్మించారు. రాత్రి వేళలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా గ్రామంలో అన్ని వార్డుల్లో సుమారు 500 వీధి దీపాలు ఏర్పాటు చేశారు. రైతు బజార్ కోసం రెండున్నర ఎకరాల భూమిని మంజూరు చేయాలని కలెక్టర్ను కోరినట్లు సర్పంచ్ తెలిపారు. గ్రామానికి ఆరు పడకల దవాఖాన, ప్లే గ్రౌండ్, పంచాయతీ భవన నిర్మాణానికి ప్రతిపాదనలు చేసినట్లు తెలిపారు.