షాబాద్, అక్టోబర్ 18 : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న హరితహారం కార్యక్రమంతో గ్రామాలకు హరితశోభ సంతరించుకున్నది. ఏ గ్రామానికి వెళ్లినా రోడ్లకు ఇరువైపులా నాటిన వివిధ రకాల మొక్కలు స్వాగతం పలుకుతున్నాయి. గ్రామాలన్నీ పచ్చదనంగా మారాయి. హరితహారం నర్సరీలు, పల్లెప్రకృతివనాల్లో పెద్ద ఎత్తున మొక్కలు పెంచుతుండడంతో గ్రామాల్లో ఆహ్లాదకరమైన వాతావరణం నెలకొన్నది. ప్రధాన రోడ్లు, కాలనీల్లోని రోడ్లకు ఇరువైపులా మొక్కలు నాటి ప్రతిరోజు నీరుపోసి సంరక్షిస్తుండడంతో ప్రజలకు మంచి వాతావరణం లభిస్తున్నది. షాబాద్ మండలంలోని ముద్దెంగూడ గ్రామంలో హరితహారం కార్యక్రమంలో నాటిన మొక్కలు ఏపుగా పెరిగాయి.
పచ్చదనంగా పల్లె..
షాబాద్ మండలంలోని ముద్దెంగూడ గ్రామంలో హరితహారం కార్యక్రమంలో నాటిన మొక్కలతో హరితశోభ ఏర్పడింది. గ్రామంలో ఏర్పాటు చేసిన హరితహారం నర్సరీలో 12వేల మొక్కలు పెంచుతున్నారు. అదే విధంగా పల్లెప్రకృతివనంలో వివిధ రకాలకు చెందిన 1800 మొక్కలను పెంచుతున్నారు. గ్రామంలోని ఆయా కాలనీల్లో రోడ్లకు ఇరువైపులా 800వరకు మొక్కలు నాటి ప్రతిరోజు పంచాయతీ సిబ్బంది వాటికి నీరుపోసి సంరక్షిస్తున్నారు. నాటిన మొక్కలు ఏపుగా పెరుగడంతో మంచి ఆహ్లాదకరమైన వాతావరణం లభిస్తున్నది. ప్రభుత్వం చేపట్టిన హరితహారం కార్యక్రమంలో మొక్కల పెంపకంతో గ్రామం పూర్తిగా పచ్చదనంగా మారిందని గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
నీరుపోసి సంరక్షిస్తున్నాం
గ్రామంలో హరితహారంలో నాటిన మొక్కలకు సిబ్బందితో ప్రతిరోజూ నీరు పోయించి సంరక్షిస్తున్నాం. నర్సరీలో 12వేల మొక్కలు పెంచాం. అదే విధంగా పల్లెప్రకృతివనంలో 1800 మొక్కలు పెంచుతున్నాం. గ్రామంలోని అన్ని రోడ్లకు ఇరువైపులా 800 వరకు వివిధ రకాల మొక్కలు నాటి సంరక్షిస్తున్నాం. ప్రతి ఇంటికి ఆరుమొక్కలు అందజేసి నాటుకుని సంరక్షించుకునేలా అవగాహన కల్పించాం.