బడంగ్పేట, మార్చి 19 : పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలను చిత్తు చిత్తుగా ఓడించి బీఆర్ఎస్ పార్టీకి పట్టం కట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని మాజీ మంత్రి, ఎమ్మెల్యే పి.సబితా ఇంద్రారెడ్డి అన్నారు. వందరోజుల్లోనే కాంగ్రెస్ పాలనపై ప్రజల్లో వ్యతిరేకత పెరిగిందని, కేసీఆర్ను ఎందుకు ఓడించామని ప్రజలు బాధపడుతున్నారని చెప్పారు. బడంగ్పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని పెద్ద బావి మాల్లారెడ్డి గార్డెన్లో బీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులతో మంగళవారం సమావేశం నిర్వహించారు. పార్లమెంట్ ఎన్నికల్లో అనుసరించాల్సిన అంశాలపై అభిప్రాయాలను తీసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సబితారెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామని ప్రజలకు తప్పుడు వాగ్ధ్దానాలు చేసి, ఒక్కహామీనీ నెరవేర్చలేదన్నారు. రైతు రుణమాఫీ, మహిళలకు రూ.2500, 4వేలు పింఛన్ ఎందుకు అమలు చేయలేదో ఓట్ల కోసం వచ్చే కాంగ్రెస్ నాయకులను నిలదీయాలన్నారు.
సముద్రంలో మునిగితే.. సమస్యలు సమసి పోతాయా.?
బీజేపీ ఎలాంటి ఎజెండా లేకుండా రాముడి పేరుతో రాజకీయం చేసి ఓట్లు దండుకోవాలని చూస్తున్నదని ఆరోపించారు. మోదీ సముద్రంలో మునిగితే దేశంలోని అన్ని సమస్యలు సమసి పోతాయా అని ప్రశ్నించారు. దేవుడికి రాజకీయ రంగు పులుముతున్నారని విమర్శించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత నల్లధనం తేస్తామని, పేదల అకౌంట్లలో రూ.15లక్షలు వేస్తామని, సంవత్సరానికి రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని గత ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క హామీనీ నెరవేర్చలేదన్నారు.
రంజిత్ రెడ్డి అంటే ఎవరో ప్రజలకు తెలియదు మనసున్న ఎవ్వరూ కష్ట కాలంలో పార్టీ మారరని ఎమ్మెల్యే సబితారెడ్డి అన్నారు.చేవెళ్ల ప్రజలకు రంజిత్ రెడ్డి ఎవరో తెలియదని చెప్పారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎక్కడో ఉన్న వ్యక్తిని తీసుకొచ్చి చేవెళ్ల ఎంపీగా గెలిపించి ఉన్నత స్థానంలో కూర్చో బెడితే.. మానవత్వం లేని రంజిత్రెడ్డి తన స్వార్థం కోసం పార్టీ మారారని విమర్శించారు.
కేసీఆర్ నాయకత్వాన్ని ప్రజలు కోరుతున్నారు..
ప్రజా సంక్షేమానికి పెద్ద పీట వేసిన కేసీఆర్ను ఎందుకు ఓడించామని ప్రజలు మథన పడుతున్నారని, మరోసారి కేసీఆర్ నాయకత్వాన్ని బలపర్చేందుకు సిద్ధంగా ఉన్నారని సబితారెడ్డి అన్నారు. చేవెళ్ల పార్లమెంట్ నుంచి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ను భారీ మెజార్టీతో గెలిపించుకోవాల్సిన బాధ్యత పార్టీ నాయకులు, కార్యకర్తలపై ఉందని చెప్పారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు యాతం పవన్ కుమార్ యాదవ్, ఏనుగు రాంరెడ్డి, సూర్ణగంటి అర్జున్, సంరెడ్డి స్వప్నావెంకట్రెడ్డి, భీమిడి స్వప్నా జంగారెడ్డి, పెద్ద బావి శ్రీనివాస్ రెడ్డి, బడంగ్పేట బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు రామిడి రాంరెడ్డి, ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ రాజ్, ఎస్సీ సెల్ అధ్యక్షులు పుట్టగల్ల సంతోష్కుమార్, ముత్యాల కృష్ణ, బోయపల్లి శేఖర్ రెడ్డి, శ్రీనివాస్, రమేశ్, పెద్ద బావి ఆనంద్రెడ్డి, శివకుమార్ ఉన్నారు.