మంచాల, నవంబర్ 7: దక్షిణ భారతదేశంలోనే మరో కాశీగా పేరొందిన బుగ్గరామలింగేశ్వరాలయం మహిమాన్విత క్షేత్రంగా విరాజిల్లుతున్నది. కాశీకి వెళ్లని వారు ఇక్కడ కార్తిక స్నానాలను ఆచరిస్తే పుణ్యం కలుగుతుందని భక్తుల నమ్మ కం. మండలంలోని ఆరుట్ల గ్రామం నుంచి ఐదు కిలోమీటర్ల దూరంలో ఈ ఆలయం ఉన్నది. ఈ దేవాలయం కార్తిక పవిత్ర స్నానాలకు పుణ్యక్షేత్రంగా నిలుస్తున్నది. నేటి నుంచి 15 రోజులపాటు జరుగనున్న ఆలయ ఉత్సవాలకు రాష్ట్రం నలుమూలల నుంచి లక్షలాది మంది భక్తులు ఇక్కడికి తరలివచ్చి కార్తిక స్నానాలు ఆచరించి స్వామివారిని దర్శించుకుంటారు. కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారంగా రామలింగేశ్వరస్వామి నిలుస్తున్నారు. ఇక్కడ నీరు తూర్పు నుంచి పడమరకు ప్రవహించి తిరిగి మళ్లీ తూర్పు వైపునకు వెళ్లడం ఆలయ ప్రత్యేకత. ఇక్కడ శ్రీరాముడు ప్రత్యేకంగా శివలింగానికి పూజలు చేశారని.. అందుకే ఈ పుణ్యక్షేత్రానికి బుగ్గరామలింగేశ్వరాలయంగా పేరొచ్చినట్లు చరిత్ర చెబుతున్నది. తూర్పు నుంచి పడమరకు ప్రవహించే నీటిలో భక్తులు పుణ్య స్నానాలను ఆచరించి అనంతరం కార్తిక పౌర్ణమి వ్రతాలను నిర్వహిస్తారు. ఈ ఆలయంలో పూజలు నిర్వహిస్తే కాశీకి వెళ్లినంతా పుణ్యం లభిస్తుందని భక్తుల విశ్వాసం. భక్తులు స్వామి వారిని దర్శించుకున్న తర్వాత కుటుంబ సభ్యులు, బంధువులతో కలిసి వంటావార్పు చేసుకుని వన భోజనాలు చేస్తారు. ఆలయం చుట్టూ ఎటు చూసినా ఎత్తైన కొండలు, గుట్టలు, పచ్చని పైర్లు, ప్రశాంత వాతావరణం కనిపిస్తుంది. భక్తులకు ఆహ్లాదాన్ని కలిగిస్తుంది.
జాతరకు ఇలా వెళ్లాలి…
మండలంలోని ఆరుట్ల గ్రామానికి ఐదు కిలోమీటర్ల దూరంలో బుగ్గరామలింగేశ్వరాలయం ఉన్నది. హైదరాబాద్ నుంచి ఆలయానికి చేరుకోవాలంటే ఎంజీబీఎస్ నుంచి 279, సాగర్ రింగురోడ్డు నుంచి 277నంబర్ గల బస్సుల ద్వారా ఇబ్రహీంపట్నానికి చేరుకోవాలి. అక్కడి నుంచి పది నిమిషాలకొకటి చొప్పున ఆరుట్లకు వెళ్లే బస్సుల్లో ఆలయానికి వెళ్లొచ్చు. నల్గొండ జిల్లా నారాయణపూర్, మునుగోడు, చౌటుప్పల్ తదితర ప్రాంతాల నుంచి వచ్చే వారు నారాయణపూర్ నుంచి ఆరుట్లకు బస్సుల్లో వచ్చి అక్కడి నుంచి ఆటోల్లో ఆలయానికి చేరుకోవచ్చు. అదేవిధంగా మహబూబ్నగర్ జిల్లా నుంచి వచ్చే వారు కూడా ఇబ్రహీంపట్నం బస్టాండ్కు వచ్చి అక్కడి నుంచి ఆరుట్లకు వెళ్లే బస్సుల్లో బుగ్గజాతరకు చేరుకోవచ్చు.
ఏర్పాట్లు పూర్తి
నేటి నుంచి 15 రోజుల పాటు జరుగనున్న బుగ్గరామలింగేశ్వరాలయ ఉత్సవాల కోసం ఆలయ కమిటీ నిర్వాహకులు, గ్రామ పంచాయతీ పాలకవర్గ సభ్యులు ఏర్పాట్లు పూర్తి చేశారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి భక్తులు లక్షలాదిగా తరలి వచ్చి.. ఆలయం వద్ద ప్రవహించే నీటిలో పుణ్య స్నానాలు చేసి స్వామి వారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటారు. భక్తులు సత్యనారాయణ స్వామి వ్రతాలు ఆచరించేందుకు వీలుగా ప్రత్యేక షెడ్డును ఏర్పా టు చేశారు. స్నానాలు చేసేందు కు గుండం, స్నానాల అనంతరం బట్టలు మార్చుకునేందుకు గదులను ఏర్పాటు చేశారు. భక్తులు వన భోజనాలు చేసుకునేందుకు వీలుగా ప్రత్యేక వసతులు కల్పించారు. కార్తిక మాసంలో బుగ్గరామలింగేశ్వరాలయంలో సత్యనారా యణ స్వామి వ్రతాన్ని ఆచరిస్తే కోర్కెలు తీరుతాయని భక్తుల విశ్వాసం. కార్త్తిక పౌర్ణమి నుంచి అమావాస్య వరకు ఈ ఆలయ ప్రాంగణంలో ప్రతిరోజూ వందలాది మంది భక్తులు సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ఆచరిస్తారు.
నాగన్న పుట్ట-కబీర్దాస్ మందిరం..
భక్తులు పుణ్య స్నానాల అనంతరం ఆలయం పక్కనే ఉన్న కబీర్దాస్ మందిరం, నాగన్న పుట్టను దర్శించుకోవడం ఆనవాయితీ. ఈ మందిరంలో నాగన్న పుట్ట, శివపార్వతులు, కబీర్దాస్ ధ్యానమందిరం ఉన్నది. కాశీలో ఉపదేశం పొందిన సాదువు నర్సింహాబాబా 1975లో ఇక్కడ కబీర్దాస్ మందిరాన్ని నిర్మించారు. ప్రతి కార్తిక మాసంలో మహిళలు నాగన్న పుట్టకు ప్రత్యేక పూజలు చేస్తారు. పుట్టలో నాగేంద్రుడు దర్శనమిస్తారని భక్తుల నమ్మకం.
భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు
నేటి నుంచి ప్రారంభం కానున్న బుగ్గరామలింగేశ్వరాలయ జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాం. ఇప్పటికే అన్ని శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించి తగిన చర్యలు తీసుకోవాలని సూచించా. జాతర పూర్తి అయ్యే వరకు తాగునీరు, ఇతర వసతులను సక్రమం గా కల్పించాలని అధికారులకు ఆదేశించడం జరిగింది.
-మంచిరెడ్డి కిషన్రెడ్డి, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే
వైభవంగా నిర్వహిస్తాం
జాతరకు లక్షలాదిగా తరలివచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా పాలకవర్గంతోపాటు ఆల య కమిటీ సభ్యులతో కలిసి అన్ని ఏర్పాట్లు చేశాం. తాగునీరు, సత్యనారాయణ స్వామి వ్రతాలను ఆచరించే భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా వలంటీర్లను ఏర్పాటు చేశాం. 15 రోజులపాటు జాతరను వైభవంగా నిర్వహిస్తాం. -కొంగర విష్ణువర్ధన్రెడ్డి, సర్పంచ్
సీసీ కెమెరాలతో ప్రత్యేక నిఘా
ఆలయ ఉత్సవాల్లో భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు భారీ బందోబస్తును ఏర్పాటు చేస్తు న్నాం. మంచాల పోలీసుల ఆధ్వర్యంలో 100 మంది పోలీసులు, నలుగురు సీఐలు, పది మంది ఎస్ఐలు జాతర బందోబస్తులో ఉంటా రు. అలాగే 15 సీసీ కెమెరాలతో ప్రత్యేక నిఘాను ఏర్పాటు చేస్తున్నాం. మహిళలతో ఎవరైనా అసభ్యంగా ప్రవర్తిస్తే వారిని పట్టుకునేందుకు జాతరలో షీటీమ్స్ను ఏర్పాటు చేయడమే ట్రాఫిక్ కట్టడికి ట్రాఫిక్ పోలీసులు ఉంటారు.
-వెంకటేశ్గౌడ్, సీఐ
ఎమ్మెల్యే కృషితోనే ఆలయం అభివృద్ధి
ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి కృషితో భక్తుల సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం. కార్తిక స్నానాలకు తరలిరానున్న భక్తులకు అన్ని వసతులు కల్పిస్తాం. ఎమ్మెల్యే కృషితో ఆలయం ఎంతో అభివృద్ధి చెందుతున్నది.
-చీరాల రమేశ్, టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు