కడ్తాల్, జూన్ 18: తెలంగాణ సర్కార్ చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి అన్నారు. శుక్రవారం మండలంలోని గాన్గుమార్ల, వాసుదేవ్పూర్, గోవిందాయిపల్లి, గడ్డమీది, పెద్దవేములోనిబావి, మైసిగండి, కొండ్రిగానిబోడు తండా, కడ్తాల్ గ్రామంలో రూ.17 కోట్లతో నిర్మించిన బీటీ రోడ్లు, ఓహెచ్ఎస్ఆర్ ట్యాంక్లను, ఎంపీ రాములు, ఎమ్మెల్యే జైపాల్యాదవ్, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి, జడ్పీ చైర్పర్సన్ అనితారెడ్డితో కలిసి మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి సబితారెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో రాష్ట్ర ప్రజలందరూ సంతోషంగా ఉన్నారన్నారు. పరిపాలన సౌలభ్యం కోసం 8 వేలున్న గ్రామ పంచాయతీలను 12,571 జీపీలుగా చేయడంతోపాటు, 137 కొత్త మండలాలు, 32 రెవెన్యూ డివిజన్లు, 33 కొత్త జిల్లాలను ఏర్పాటు చేసిందన్నారు. ప్రతి తండాకు, గ్రామానికి బీటీ రోడ్డు, మండల కేంద్రాలకు డబుల్ రోడ్లు, జిల్లా కేంద్రాల్లో నాలుగు లైన్ల రోడ్లను ప్రభుత్వం నిర్మిస్తున్నదన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ రైతుబంధు పథకాన్ని ప్రవేశపెట్టి, పెట్టుబడి సాయాన్ని రైతన్నల ఖాతాల్లో జమ చేస్తున్నట్లు చెప్పారు. అన్నదాతలు పండుగలా వ్యవసాయం చేసుకుంటున్నారని పేర్కొన్నారు.
ఈ యాసంగిలో 90 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని దిగుమతి చేసి, తెలంగాణ రాష్ట్రం దేశంలోనే నంబర్వన్ స్థానంలో నిలిచిందన్నారు. రైతులు వాణిజ్య పంటలైన పత్తి, కంది పంటలను సాగు చేయాలని సూచించారు. మిషన్ భగీరథ పథకంతో ఇంటింటికీ తాగునీటిని అందించి మహిళల కష్టాలు దూరం చేశామన్నారు. రాష్ట్రంలోని గురుకులాలను రూ.4 వేల కోట్లతో అభివృద్ధి చేస్తున్నామని, ప్రతి విద్యార్థిపై ప్రభుత్వం రూ. లక్ష ఖర్చు చేసి కార్పొరేట్ స్థాయి విద్యనందిస్తున్నదని చెప్పారు. నూతన మండలం కడ్తాల్ అభివృద్ధికి అన్ని విధాల సహకరిస్తామని మంత్రి వివరించారు. మండల కేంద్రంలో ఎంపీడీవో, గ్రంథాలయం కార్యాలయ భవనాలు, ప్రభుత్వ దవాఖాన, జూనియర్ కళాశాల ఏర్పాటుకు కృషి చేస్తామన్నారు. ఎంపీ రాములు మాట్లాడుతూ సీఎం కేసీఆర్ అత్యధికంగా నిధులు కేటాయించి గ్రామాలు, తండాలను అభివృద్ధి చేస్తున్నారని చెప్పారు. ఎమ్మెల్యే జైపాల్యాదవ్ మాట్లాడుతూ నియోజకవర్గంలోని ప్రతి తండాకు, పల్లెకు బీటీ రోడ్లను నిర్మిస్తామన్నారు. మండల కేంద్రంలో రూ.కోటితో పోలీస్స్టేషన్, రూ.68 లక్షలతో తాసిల్దార్ భవన నిర్మాణాలకు త్వరలో శంకుస్థాపన చేస్తామని చెప్పారు.
ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ గిరిజన తండాల అభివృద్ధికి పెద్దపీట వేస్తున్నారన్నారు. జడ్పీ చైర్పర్సన్ అనితారెడ్డి మాట్లాడుతూ దళారుల బెడద లేకుండా ప్రభుత్వం ధాన్యాన్ని కొనుగోలు చేసి, రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తున్నదన్నారు. ఈ సందర్భంగా ప్రజాప్రతినిధులు మొక్కలు నాటారు. అంతకుముందు మైసిగండి మైసమ్మతల్లిని మంత్రి, ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, జడ్పీ చైర్పర్సన్ దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో ఎంపీపీ కమ్లీమోత్యానాయక్, అనితావిజయ్, జడ్పీటీసీలు దశరథ్నాయక్, విజితారెడ్డి, డీసీసీబీ డైరెక్టర్ వెంకటేశ్గుప్తా, వైస్ ఎంపీపీ ఆనంద్, సర్పంచ్లు లక్ష్మీనర్సింహారెడ్డి, తులసీరాంనాయక్, శ్వేత, నాగమణి, చాందీ, రాములునాయక్, పాండునాయక్, సేవ్యాబావోజీ, ఎంపీటీసీలు లచ్చిరాంనాయక్, గోపాల్, శ్రీనివాస్రెడ్డి, రాజశేఖర్రెడ్డి, ఉప సర్పంచ్లు రామకృష్ణ, వినోద్, నాయకులు భాస్కర్రెడ్డి, చందోజీ, హన్మానాయక్, వీరయ్య, పరమేశ్, గంప శ్రీను, జహంగీర్అలీ, మోత్యానాయక్, యాదగిరిరెడ్డి, శ్రీకాంత్రెడ్డి, లాయక్అలీ, సేవ్యానాయక్, లక్పతినాయక్, శేఖర్గౌడ్, గణేశ్గౌడ్, భిక్షపతి, మహేశ్, మల్లయ్య, జహంగీర్బాబా, ఇర్షాద్, శ్రీనివాస్, రంగయ్య, రవికుమార్, సాయికుమార్, సీఐ ఉపేందర్, ఎస్సైలు సుందరయ్య, వరప్రసాద్, ఎంపీడీవో రామకృష్ణ, ఏంపీవో తేజ్సింగ్, పీఆర్ డీఈఈ తిరుపతిరెడ్డి, ఏఈలు వెంకట్రెడ్డి, కృష్ణయ్య, ఆర్డబ్ల్యూఎస్ ఈఈలు రాజేశ్వర్, పద్మలత, డీఈఈ జగన్మోహన్రెడ్డి, ఏఈలు సృజన, వాగ్దేవి, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.