ఎల్బీనగర్, నవంబర్ 1: గడ్డి అన్నారం వ్యవసాయ మార్కెట్ కమిటీకి కొత్తగా వచ్చే పాలకవర్గంపై ఉత్కంఠ నెలకొన్నది. కమిటీ పాత పాలక వర్గం పదవీ కాలం ముగియడంతో అధికార పార్టీ నాయకులు చైర్మన్ పదవి దక్కించుకునేందుకు ఉవ్విళ్లూరుతున్నారు. నూతన మార్కెట్ కమిటీ పదవులకు నోటిఫికేషన్ రాకున్నప్పటికీ ప్రస్తుతం పాలకవర్గం పదవీ కాలం ముగియడంతో ఇక తమ వంతు అంటూ నాయకులు ఉద్యుక్తులవుతున్నారు. గడ్డిఅన్నారం వ్యవసాయ మార్కెట్ కమిటీ పరిధిలో ఎల్బీనగర్, మహేశ్వరం, ఇబ్రహీంపట్నం, ఉప్పల్, మేడ్చల్ నియోజకవర్గాలు వస్తాయి. ఆది నుంచి గడ్డిఅన్నారం వ్యవసాయ మార్కెట్ కమిటీకి ఓ ప్రత్యేక స్థానం ఉండటంతో ఈ పదవిని దక్కించుకునేందుకు నాయకులు ఆసక్తిని ప్రదర్శిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రెండు పర్యాయాలు మార్కెట్ కమిటీ చైర్మన్ స్థానాలను నేరుగా సీఎం కేసీఆర్ ఆదేశాలతోనే నియమితులయ్యారు. తెలంగాణ ఏర్పడ్డాక గడ్డిఅన్నారం వ్యవసాయ మార్కెట్ కమిటీ తొలి పాలకవర్గం చైర్మన్గా సర్దార్ పుటం పురుషోత్తంరావు నియమితులుకాగా రెండోసారి కూడా సీఎం కేసీఆర్ వీరమల్ల రాంనర్సింహాగౌడ్ను నియమించారు. తాజా కమిటీలో చైర్మన్ రాంనర్సింహాగౌడ్ నిబంధనలకు విరుద్దంగా లైసెన్స్ల కుంభకోణంలో ఇరుక్కుని పదవి నుంచి సస్పెండ్ అయ్యారు. ప్రస్తుతం కమిటీలోని వైస్ చైర్మన్ కందాళ ముత్యంరెడ్డి చైర్మన్ బాధ్యతను నిర్వహించారు. అయితే ప్రస్తుత పాలకవర్గం పదవీ కాలం ముగియడంతో నూతన చైర్మన్, డైరెక్టర్ స్థానాల కోసం అప్పుడే నాయకుల ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం గడ్డిఅన్నారం పండ్ల మార్కెట్ ప్రాంతాన్ని తెలంగాణ ప్రభుత్వం సీఎం కేసీఆర్ నాయకత్వంలో సూపర్ స్పెషాలిటీ దవాఖానను నిర్మించాలన్న లక్ష్యంతో ఖాళీ చేయించి బాటసింగారంలోని లాజిస్టిక్ పార్కు ప్రాంతానికి తాత్కాలికంగా తరలించింది. కోహెడలో అధునాతన పండ్ల మార్కెట్ నిర్మాణానికి శ్రీకారం చుట్టనున్న నేపథ్యంలో మార్కెట్ పాలకవర్గం ఎంపికలో ప్రాధాన్యతలు మారే అవకాశం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.