పరిగి, ఫిబ్రవరి 23 : జిల్లాలో పల్స్ పోలియో కార్యక్రమాన్ని అధికారులు విజయవంతం చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ మోతీలాల్ పేర్కొన్నారు. బుధవారం కలెక్టర్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో వైద్యాధికారులతో ఏర్పాటు చేసిన జిల్లా టాస్క్ఫోర్స్ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఈ నెల 27 నుంచి మార్చి 1 వరకు జిల్లాలో నిర్వహించే పల్స్ పోలియో కార్యక్రమంలో 5 సంవత్సరాల లోపు పిల్లలు 93232 మందికి చుక్కలు వేయించేందుకు డీఈవో, డీపీవో, డీడబ్ల్యూవో అధికారులు వైద్య సిబ్బందికి పూర్తి సహకారం అందించాలని సూచించారు. అన్ని గ్రామాలు, మున్సిపాలిటీల్లో 670 పోలియో బూత్లు ఏర్పాటు చేశారని.. అర్హతగల పిల్లలందరికీ డ్రాప్స్ వేసేలా అధికారులు అన్ని చర్యలు తీసుకోవాలన్నారు. పోలియోపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. మండలం, మున్సిపాలిటీ పరిధిలో ర్యాలీలు నిర్వహించాలని, గ్రామాల్లో ప్రజలకు పోలియో డ్రాప్స్ వేసే తేదీలను బూత్లవారీగా తెలియజేయాలని పేర్కొన్నారు. బూత్లను ముందుగానే సిద్ధం చేసుకోవాలని, నీటి వసతి, కుర్చీలు, ఇతర సౌకర్యాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. బస్టాండ్, రైల్వే స్టేషన్, రద్దీ ప్రాంతాల్లో తప్పనిసరిగా పల్స్ పోలియో బ్యానర్లు ఏర్పాటు చేయాలన్నారు. డ్రాప్స్ వేయించుకోని చిన్నారులకు ఈ నెల 28న, మార్చి 1న ఆశ వర్కర్లు, ఏఎన్ఎంలు, ఆరోగ్య కార్యకర్తలు ఇంటింటికీ వెళ్లి వేయాలని సూచించారు.
అంగన్వాడీ కేంద్రాల్లో ఉన్న 5 ఏండ్ల లోపు పిల్లలకు కూడా చుక్కలు వేయించాలన్నారు. జిల్లాను పోలియో ఫ్రీ జిల్లాగా మార్చేందుకు అందరూ సమిష్టిగా కృషిచేయాలన్నారు. 5 సంవత్సరాల్లో 7 టీకాలు అనే నినాదంతో (0-6-10-14 వారాలు, 10 నెలలు, 16 నెలలు, 5 సంవత్సరాలు) అవగాహన కల్పించాలన్నారు. కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి తుకారాంభట్, డిప్యూటీ డీఎంహెచ్వో జీవరాజ్, డీఈవో రేణుకాదేవి, డీపీవో మల్లారెడ్డి, డీడబ్ల్యూవో లలితాకుమారి, డాక్టర్ అరవింద్, ప్రోగ్రామ్ అధికారి డాక్టర్ లలిత, డబ్ల్యూహెచ్వో మెడికల్ అధికారి మురహరి, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.