కొందుర్గు, జూలై 14 : జిల్లెడు చౌదరిగూడ మండల కేంద్రంలో సర్వసభ్య సమావేశం బుధవారం ఎంపీపీ యాదమ్మ అధ్యక్షతన నిర్వహించారు. గ్రామాల్లో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లకు కంచె ఏర్పాటు చేయాలని, వైకుంఠ ధామాలకు విద్యుత్ కనెక్షన్ ఇవ్వాలని సభ్యులు సభా దృష్టికి తీసుకువచ్చారు. స్పందించిన విద్యుత్ ఏఈ వినయ్కుమార్ ట్రాన్స్పార్మర్లకు కంచె ఏర్పాటు చేసే విషయాన్ని ఉన్నతాధికారులకు నివేదిస్తానన్నారు. వైకుంఠధామాలకు విద్యుత్ కనెక్షన్ ఇవ్వాలని తమకు ఎలాంటి ఆదేశాలు లేవన్నారు. వనంపల్లి గ్రామానికి బీటీ రోడ్డు వేయాలని సర్పంచ్ కవిత సమావేశంలో చర్చించారు. రెండు మండలాలకు ఒకే పీహెచ్సీ ఉండడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, జిల్లెడు చౌదరిగూడ మండలంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఏర్పాటు చేయాలని సర్పంచ్లు బాబురావు, భూపాలచారి కోరారు. డాక్టర్ ఝాన్సిలక్ష్మి స్పందిస్తూ ఉన్నతాధికారులకు నివేదిక ఇస్తానన్నారు. పాఠశాల భవనం శిథిలావస్థకు చేరుకున్నదని నూతన భవనం ఏర్పాటు చేసుకునేందుకు నిధులు మంజూరు చేయాలని చేగిరెడ్డి ఘనాపూర్ సర్పంచ్ శివమౌళి సభాలో ప్రస్తావించారు. ప్రభుత్వం నుంచి గ్రామాలకు వస్తున్న నిధులను పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని ఎంపీపీ యాదమ్మ అన్నారు. కార్యక్రమంలో జడ్పీటీసీ స్వరూప, ఎంపీవో విజయ్కుమార్పాల్, సర్పంచ్లు, ఎంపీటీసీలు, అధికారులు పాల్గొన్నారు.