రంగారెడ్డి, అక్టోబర్ 18, (నమస్తే తెలంగాణ) : రంగారెడ్డి జిల్లాలో వానకాలం సీజన్కు సంబంధించి ధాన్యం సేకరణకు జిల్లా యంత్రాంగం సన్నద్ధమైంది. దొడ్డు వడ్లనూ కొనుగోలు చేసేందుకు సీఎం కేసీఆర్ గ్రీన్సిగ్నల్ ఇవ్వడంతో పౌరసరఫరాల అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. వరి ధాన్యాన్ని కొనుగోలు చేయము అని కేంద్రం తేల్చిచెప్పడంతో ఆందోళనలో ఉన్న రైతన్నలకు సీఎం కేసీఆర్ అండగా నిలిచారు. జిల్లాలో రికార్డు స్థాయిలో ధాన్యం దిగుబడి రానున్నదని అధికారులు అంచనా వేస్తున్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా క్షేత్రస్థాయిలో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు నిర్ణయించారు. ఒకేరోజు రైతులందరూ కొనుగోలు కేంద్రానికి రాకుండా రోజుకు 1000 క్వింటాళ్ల ధాన్యాన్ని సేకరించాలని నిర్ణయించారు. గ్రామాల వారీగా ఏఈవోలు రైతులకు టోకెన్లు జారీ చేయనున్నారు. జిల్లావ్యాప్తంగా 1.26 లక్షల ఎకరాల్లో వరి సాగు చేశారు. కరోనా నిబంధనలకు అనుగుణంగా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లోనే ప్రభుత్వం ఆన్లైన్ నుంచి చెల్లింపులను రెండు, మూడు రోజుల్లో జమ చేయనున్నది.
1.70 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యం..
జిల్లాలో ఈ నెలాఖరు నుంచి ధాన్యం సేకరణ ప్రారంభం కానున్నది. జిల్లాలో 29 ధాన్యం కొనుగోలు కేంద్రాలకుగాను పీఏసీఎస్ ఆధ్వర్యంలో 14, డీసీఎంఎస్ ఆధ్వర్యంలో 5, ఏఎంసీ ఆధ్వర్యంలో 3, పీఎస్సీఎస్ ఆధ్వర్యంలో 4 కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. ఈ సంఖ్యను పెంచే అవకాశమున్నది. రైతులకు ఇబ్బందులు కలుగకుండా గ్రామస్థాయిలోనే ధాన్యాన్ని సేకరించాలని ప్రభుత్వం ఆదేశించిన దృష్ట్యా ఆ దిశగా మరో ఐదారు కొనుగోలు కేంద్రాలను పెంచేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. వానకాలం సీజన్కుగాను జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారులు జిల్లాలో 1.70 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. రోజుకు 50 మంది రైతుల నుంచి 1000 క్వింటాళ్ల ధాన్యాన్ని సేకరించేలా అధికారులు నిర్ణయించారు. ధాన్యం సేకరణకు అవసరమయ్యే గోనె సంచులను ఇప్పటికే కొంతమేర అందుబాటులో ఉంచగా, వచ్చేనెల మొదటి వారంలోగా పూర్తి స్థాయిలో గోనె సంచులు అందుబాటులో ఉండేలా అధికారులు చర్యలు చేపట్టారు. ధాన్యాన్ని నిల్వ చేసేందుకు గోదాంలను సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే గోదాంలలో ఉన్న సీఎంఆర్ రైస్ను ఎఫ్సీఐకి తరలించే ప్రక్రియ వేగవంతం చేశారు. యాసంగిలో చాలా వరకు సన్నరకం వడ్లను సేకరించిన నేపధ్యంలో కొంతమేర నేరుగా రేషన్ దుకాణాలకు కూడా సరఫరా చేస్తున్నారు. వరి ధాన్యాన్ని క్వింటాలుకు ‘ఏ’ గ్రేడ్ క్వింటాలుకు రూ.1960, సాధారణ గ్రేడ్ క్వింటాలుకు రూ.1940ల కనీస మద్దతు ధర రైతులకు చెల్లించనున్నారు. జిల్లాలో వానకాలం సీజన్కుగాను 85,119 మంది రైతులు 1.26 లక్షల ఎకరాల్లో వరి సాగు చేయగా, 2.91 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని వ్యవసాయాధికారులు అంచనా వేస్తున్నారు.
వికారాబాద్ జిల్లాలో..
పరిగి, అక్టోబర్ 18 : వికారాబాద్ జిల్లాలో వానకాలంలో 58,787 మంది రైతులు సుమారు లక్షా 2వేల ఎకరాల్లో వరి పంట సాగు చేశారు. ఈసారి 2,27,676 మెట్రిక్ టన్నుల వరి ధాన్యం ఉత్పత్తి అవుతుందని వ్యవసాయాధికారులు అంచనా వేస్తున్నారు. ఇందులో స్థానిక అవసరాలకు సుమారు 34,151 మెట్రిక్ టన్నులు వాడుకోనున్నారని పేర్కొంటున్నారు. దీంతో 1,93,524 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని రైతులు విక్రయించనున్నారని అధికారుల అంచనా. ఇందుకు అనుగుణంగా జిల్లా వ్యాప్తంగా 192 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఈ నెలాఖరు లేదా నవంబర్ నెల మొదటి వారంలో ధాన్యం కొనుగోలు చేపట్టేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. గ్రేడ్ ‘ఏ’ రకం ధాన్యం క్వింటాలుకు రూ.1,960, సాధారణ రకానికి రూ.1,940 మద్దతు ధరగా నిర్ణయించారు.
ఊరూరా కొనుగోలు కేంద్రాలు..
ఇప్పటివరకు జిల్లా వ్యాప్తంగా 146 కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు సంబంధించి ప్రణాళికలు సిద్ధం చేశారు. వాటిలో పీఏసీఎస్ల ఆధ్వర్యంలో 51, డీసీఎంఎస్ ఆధ్వర్యంలో 61, వ్యవసాయ మార్కెట్ కమిటీల ఆధ్వర్యంలో 10, ఐకేపీ ఆధ్వర్యంలో 24 కొనుగోలు కేంద్రాలకు అన్ని ఏర్పాట్లు చేపట్టారు. అదనంగా మరో 46 కొనుగోలు కేంద్రాలు ఐకేపీ ద్వారా ఏర్పాటు చేయించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ప్రతి గ్రామంలో కొనుగోలు కేంద్రాలతో రైతులు తాము పండించిన వరి ధాన్యం తమ గ్రామంలోని కొనుగోలు కేంద్రాల్లో విక్రయించేందుకు సర్కారు ప్రత్యేక చర్యలు తీసుకుంటుంది. ఈసారి జిల్లావ్యాప్తంగా 1,93,524 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలుకు అవసరమైన విధంగా ఏర్పాట్లు చేపడుతున్నారు. జిల్లా పరిధిలో అత్యధికంగా పరిగి డివిజన్లో 69,650 మెట్రిక్ టన్నులు, కొడంగల్ డివిజన్లో 59,786 మెట్రిక్ టన్నులు, తాండూరు డివిజన్లో 52,039 మెట్రిక్ టన్నులు, వికారాబాద్ డివిజన్లో 12,048 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసే అవకాశం ఉన్నది.
కస్టమ్ మిల్లింగ్కు 50 రైస్ మిల్లులు..
ప్రభుత్వం కొనుగోలు చేసే ధాన్యం కస్టమ్ మిల్లింగ్కు ఇవ్వడానికి వికారాబాద్ జిల్లా వ్యాప్తంగా 50 రైస్ మిల్లులను ఎంపిక చేస్తున్నారు. ప్రస్తుతం జిల్లాలో 42 రైస్మిల్లులు ఉండగా, ధాన్యం సేకరణ ప్రారంభం నాటికి మరో 8 రైస్మిల్లులు అందుబాటులోకి రానున్నట్లు తెలిసింది. కొనుగోలు కేంద్రాల్లో విక్రయించి, తూకాలు పూర్తయిన తర్వాత సంబంధిత కేంద్రం వారు నమోదు చేయడం, ఆ తర్వాత రైస్మిల్లులకు చేరిన అనంతరం అక్కడి నుంచి తమ లాగిన్కు పూర్తి వివరాలు వచ్చిన 24 గంటల్లో రైతుల బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమ చేసేలా అధికారులు ఏర్పాట్లు చేపట్టారు. తద్వారా అత్యంత పారదర్శకంగా ధాన్యం కొనుగోలుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.
రైతులకు ఇబ్బందులు కలుగకుండా ఏర్పాట్లు..
రైతులకు ఇబ్బందులు కలుగకుండా ఏర్పాట్లు చేస్తున్నాం. ఈ నెలాఖరు నుంచి ధాన్యం సేకరస్తాం. సర్కార్ సూచన మేరకు చివరి గింజ వరకు కొనుగోలు చేస్తాం. గోనె సంచులతోపాటు ధాన్యం నిల్వ చేసేందుకుగాను గోదాంలనూ సిద్ధం చేస్తున్నాం. కరోనా నిబంధనలతో ధాన్యాన్ని సేకరిస్తాం.
ధాన్యం కొనుగోలుకు ఏర్పాట్లు..
వికారాబాద్ జిల్లా పరిధిలో ధాన్యం కొనుగోలుకు ఏర్పాట్లు చేపడుతున్నాం. ఈసారి 192కు పైగా కొనుగోలు కేంద్రాలు, డీసీఎంఎస్, పీఏసీఎస్, ఏఎంసీ, ఐకేపీల ఆధ్వర్యంలో కేంద్రలను ఏర్పాటు చేస్తున్నాం. నాణ్యమైన ధాన్యం తీసుకొచ్చి మద్దతు ధర పొందాలి.