బొంరాస్పేట, మే 16 : మండలంలోని లింగన్పల్లి గ్రామం జిల్లాలోనే ఆదర్శంగా నిలిచింది. గ్రామ ప్రజలు రెండున్నరేండ్ల నుంచి మద్యానికి దూరంగా ఉన్నారు. ప్రజలంతా ఐకమత్యంతో ఉండడంతో గ్రామంలో మద్యం బెల్టు దుకాణాలు మూతపడ్డాయి. దొంగచాటుగా ఎవరైనా మద్యం అమ్మితే వారికి రూ.10 వేలు జరిమానా విధించాలని, మద్యం అమ్మినవారిని పట్టిస్తే వారికి రూ.వెయ్యి బహుమతి ఇవ్వాలని గ్రామపంచాయతీ ఏకగ్రీవంగా తీర్మానం చేసింది. ఈ తీర్మానానికి ఊరంతా కట్టుబడి ఉండి మిగతా గ్రామాలకు ఆదర్శంగా నిలుస్తున్నది లింగన్పల్లి.
గ్రామంలో ఒకప్పుడు నాలుగు మద్యం గొలుసు దుకాణాలు ఉండేవి. వీటిలో విచ్చలవిడిగా మద్యం అమ్మకాలు జరిపేవారు. కూలీనాలి చేసుకుని బతికే బడుగు జీవులు, యువత మద్యానికి బానిసయ్యారు. సంపాదించినదంతా తాగుడుకు ఖర్చు చేయడంతో పేదల జేబులకు చిల్లులు పడేవి. సాయంత్రం అయిందంటే చాలు ఏ వీధిలో చూసినా తాగి కొట్లాడే సంఘటనలే కనిపించేవి. తెల్లవారిందంటే చాలు కొందరు టీ తాగే బదులు బెల్టు దుకాణానికి వచ్చి మద్యం తాగేవారు. ఫలితంగా ఎక్కడంటే అక్కడ పడిపోయేవారు. కుటుంబ యజమానులు తాగుడుకు బానిసై సంసారాన్ని, భార్యాపిల్లలను పట్టించుకునేవారుకాదు. దీంతో స్పందించిన సర్పంచ్ బడెంపల్లి కాశప్ప, యువకులు, గ్రామస్తులు 2019 డిసెంబర్ 25న గ్రామపంచాయతీలో సమావేశమై మద్య నిషేధంపై చర్చించారు. పచ్చని సంసారాల్లో చిచ్చుపెడుతున్న మద్యాన్ని 2020 జనవరి 1 నుంచి గ్రామంలో పూర్తిగా నిషేధించాలని, మద్యం అమ్మకాలు ఇకపై జరుపరాదని, ఎవరైనా మద్యం అమ్మితే రూ.10వేలు జరిమానా విధించాలని, మద్యం అమ్మినవారిని పట్టిస్తే వారికి రూ.వెయ్యి బహుమతి ఇవ్వాలని ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. దీంతో ప్రజలంతా ఆ తీర్మానానికి కట్టుబడి ఆనాటి నుంచి మద్యానికి దూరంగా ఉన్నారు.
మద్య నిషేధం అమలు చేసినప్పటి నుంచి గ్రామంలో ఎలాంటి గొడవలు, కొట్లాటలు లేకుండా ప్రశాంతంగా ఉందని ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వందశాతం మరుగుదొడ్లు నిర్మించుకుని సంపూర్ణ పారిశుధ్య గ్రామంగా నిలిచిన లింగన్పల్లి మద్య నిషేధం అమలులో కూడా భేష్ అనిపించుకుంది. మండలంలోని కొన్ని గ్రామాల్లో పేరుకు మద్యం అమ్మకాలు జరుపరాదని తీర్మానం చేసినా అమలులో మాత్రం విఫలమయ్యాయి.
రెండున్నరేండ్ల నుంచి మద్యం అమ్మకాలు లేవు రాములు, లింగన్పల్లి
మద్య నిషేధం విధించినప్పటి నుంచి గ్రామంలో ఎలాంటి మద్యం అమ్మకాలు జరుగడంలేదు. మద్య నిషేధానికి ప్రజలు, యువత అందరూ సహకరిస్తున్నారు. మద్య నిషేధం విధించి పలువురి జీవితాలు నాశనం కాకుండా కాపాడాం. గ్రామంలో మద్యం అమ్మకాలు లేకపోవడంతో దానికి అలవాటుపడ్డవారు క్రమంగా మానేసి మంచిగా పని చేసుకుంటున్నారు.
గ్రామం ప్రశాంతంగా ఉంది : మొగులాన్బీ, గృహిణి
మద్య నిషేధం విధించినప్పటి నుంచి లింగన్పల్లి గ్రామం ప్రశాంతంగా ఉంది. బెల్టు దుకాణాల్లో మద్యం అమ్మకాలు జరిపే సమయంలో తెల్లారితే చాలు చాయ్ తాగే బదులు మందు తాగేవారు. ఎప్పుడంటే అప్పుడు కొట్లాటలే. ఇప్పుడు ఎలాంటి గొడవలు లేవు. భర్తలు మద్యం మానేయడంతో మహిళలు కూడా సంతోషంగా ఉన్నారు.
నిషేధాన్ని కట్టుదిట్టంగా అమలు చేస్తున్నాం బడెంపల్లి కాశప్ప, సర్పంచ్
యువత, గ్రామస్తుల సహకారంతో గ్రామంలో మద్య నిషేధాన్ని కట్టుదిట్టంగా అమలు చేస్తున్నాం. మద్యం అమ్మకాలు బంద్ చేసినప్పటి నుంచి గ్రామంలో ఎలాంటి గొడవలు లేవు. ప్రశాంత వాతావరణం నెలకొంది. ఇదే స్ఫూర్తిని భవిష్యత్లో కూడా కొనసాగిస్తాం.