కొత్తూరు రూరల్, జూలై 25 : ప్రతి ఒక్కరూ భక్తి భావాన్ని కలిగి ఉండాలని జడ్పీటీసీ శ్రీలత అన్నారు. మండలపరిధిలోని శేరిగూడబద్రాయపల్లి గ్రామంలో ఆషాడమాసంలో నిర్వహించే బోనాల పండుగలో భాగంగా ఆదివారం మహంకాళి భవానమ్మ బోనాలను నిర్వహించారు. మహిళలు, యువతులు, శివసత్తుల పూనకాలు, పోతురాజుల ఆటలు డప్పు, దరువుల మధ్య ఊరేగింపుగా తీసుకెళ్లి భవానమ్మకు నైవేద్యం సమర్పించారు. ఈ సందర్భంగా జడ్పీటీసీ మాట్లాడుతూ.. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నదన్నారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ సత్యనారాయణ, వార్డుసభ్యులు పాల్గొన్నారు.
ఘనంగా మైసమ్మ బోనాలు
జిల్లెడు చౌదరిగూడ మండలంలోని గాలిగూడ గ్రామంలో ఆదివారం మైసమ్మ బోనాల పండుగను ఘనంగా జరుపుకున్నారు. గ్రామంలో పోతరాజు విన్యాసాలు అలరించాయి. మహిళలు బోనాలు ఎత్తుకుని మైసమ్మ దేవాలయం చుట్టూ ప్రదక్షణలు చేశారు. ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని కోరుకున్నారు. కార్యక్రమంలో సర్పంచ్ యాద య్య, ఉప సర్పంచ్ జంగయ్య పాల్గొన్నారు.
కేశంపేటలో..
మండలంలోని అల్వాలలో కురుమ కులస్తులు, భక్తులు ఘనంగా మహంకాళి బోనాలు నిర్వహించారు. బోనాల ఊరేగింపులో ఒగ్గు కళాకారుల నృత్యాలు ఆకట్టుకున్నాయి. బోనాల ఊరేగింపు చూసేందుకు ప్రజలు తరలివచ్చారు. కార్యక్రమంలో నాయకులు తిరుమలరెడ్డి శ్రీనివాస్, సుధాకర్, మల్లేశ్యాదవ్, భక్తులు పాల్గొన్నారు.