మొయినాబాద్, జూలై 18 : తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో 5వ తరగతిలో ప్రవేశం పొందడానికి విశేష స్పందన లభిస్తుంది. ఆదివారం నిర్వహించిన 5వ తరగతి ప్రవేశ పరీక్షకు విద్యార్థులు 85 శాతం హాజరయ్యారు. మండల పరిధిలోని 5 గురుకుల విద్యా సంస్థల్లో పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. మండల పరిధిలోని తోలుకట్టా గ్రామం సమీపంలో ఉన్న చేవెళ్ల సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల స్వచ్ఛ పాఠశాలలో 400 మంది విద్యార్థులకు సెంటర్ ఏర్పాటు చేయగా 360 హాజరయ్యారని ప్రిన్సిపాల్ రమాదేవి తెలిపారు. తోలుకట్టాలో ఉన్న బంట్వారం సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాలలో 360 మందికి 300 మంది హాజరయ్యారని ప్రిన్సిపాల్ ఉష చెప్పారు. తహసీల్ కార్యాలయం ఆవరణలో ఉన్న శంకర్పల్లి సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాలలో 300 మంది విద్యార్థులకు సెంటర్ ఏర్పాటు చేయగా 245 మంది విద్యార్థులు హాజరయ్యారని ప్రిన్సిపాల్ జయమ్మ పేర్కొన్నారు. తోలుకట్టాలో ఉన్న వికారాబాద్ డిగ్రీ కళాశాలలో 300 మందికి పరీక్ష కేంద్రం ఏర్పాటు చేయగా 248 మంది విద్యార్థులు హాజరయ్యారని ప్రిన్సిపాల్ తెలిపారు. చిలుకూరులో ఉన్న సాంఘిక సంక్షేమ గురుకుల బాలుర పాఠశాలలో 400 మంది విద్యార్థులకుగాను 351 మంది హాజరైనట్లు ప్రిన్సిపాల్ పాపారావు తెలిపారు. పరీక్ష కేంద్రాల్లో అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. కొవిడ్ నిబంధనలకు అనుగుణంగా పరీక్ష హాల్స్ను ఏర్పాటు చేశారు.