చేవెళ్ల ఎంపీ గడ్డం రంజిత్రెడ్డి, వికారాబాద్
జడ్పీ చైర్ పర్సన్ సునీతామహేందర్రెడ్డి
జిల్లాస్థాయి వాలీబాల్ పోటీలు ప్రారంభం
కులకచర్ల, ఫిబ్రవరి 19 : క్రీడల అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని వికారాబాద్ ఎంపీ రంజిత్రెడ్డి, జడ్పీ చైర్పర్సన్ సునీతామహేందర్రెడ్డి అన్నారు. శనివారం చౌడాపూర్ మండలం మక్తవెంకటాపూర్ గ్రామంలో జిల్లా స్థాయి వాలీబాల్ పోటీలను వారు ప్రారంభించడంతో పాటు మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ, జడ్పీ చైర్పర్సన్ మాట్లాడుతూ క్రీడల అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని అన్నారు. ఇప్పటికే పెద్ద ఎత్తున క్రీడల మైదానాలను క్రీడాకారులకు అందుబాటులోకి తీసుకువచ్చిందని అన్నారు. యువత చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలన్నారు. తెలంగాణ ప్రభుత్వం గ్రామాల అభివృద్ధికి చర్యలు తీసుకుంటుందని తెలిపారు. యువత నీతిరాజకీయాలు అలవర్చుకోవాలని సూచించారు. కులకచర్ల మండలంలో వివిధ అభివృద్ధి పనులకు గాను తమవంతుగా నిధులు కేటాయించేందుకు చర్యలు తీసుకుంటామని వివరించారు. గతంలో కూడా జిల్లాలో కులకచర్ల మండలానికి పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేసినట్లు గుర్తు చేశారు. చౌడాపూర్ గ్రామంలో కిచెన్ షెడ్ నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తానన్నారు. రోడ్ల అభివృద్ధికి ప్రభుత్వం పెద్ద పీటవేస్తుందని వివరించారు. కులకచర్ల మండలంలో క్రీడా మైదానానికి నిధులు మంజూరయ్యేవిదంగా చూస్తామని అన్నారు. గ్రామాల అభివృద్ధి తెలంగాణ ప్రభుత్వం భారీగా నిధులు కేటాయిస్తుందని తెలిపారు. గతంలో సమస్యలతో ఉన్న గ్రామాలు నేడు అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతున్నాయన్నారు. యువత రాజకీయాలకు అతీతంగా ఉండాలని, చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలని సూచించారు. గ్రామీణ ప్రాంతంలో ఉన్న మక్తవెంకటాపూర్ గ్రామస్తులు ఇలాంటి పెద్ద కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. మక్తవెంకటాపూర్ అభివృద్ధి, దేవాలయ నిర్మాణానికి తనవంతుగా నిధులు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. పోడు భూముల సమస్య పరిష్కరించేందుకు ప్రభుత్వం అన్ని విధాలా చర్యలు తీసుకుంటుందని వారం రోజుల్లో పోడుభూములకోసం దరఖాస్తులు చేసుకున్నవారి సమస్యలు పరిష్కారం అవుతాయని తెలిపారు. ఇప్పటికే మక్తవెంకటాపూర్ గ్రామంలో ఉన్న పోడు భూములను ప్రభుత్వం సర్వేచేయించినట్లు తెలిపారు. పరిగి నియోజకవర్గంలో పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి ఆధ్వర్యంలో ఉపాధిహామీ ద్వారా రూ.12 కోట్లతో వివిద అభివృద్ధి పనులు నిర్వహించినట్లు తెలిపారు. మక్తవెంకటాపూర్ గ్రామంలో వివిధ అభివృద్ధి పనులు పూర్తి చేసేందుకు తనవంతు సహకారం అందిస్తానని అన్నారు.
పోడుభూముల సమస్య పరిష్కారం…
త్వరలో పోడుభూముల సమస్యకు పరిష్కారం లభిస్తుందని ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి, డీసీసీసీబీ చైర్మన్ బుయ్యని మనోహర్రెడ్డి అన్నారు. యువతకు పెద్ద ఎత్తున పౌల్ట్రీ రుణాలు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని, భూముల మార్ట్గేజ్ ద్వారా రుణాలు అందిస్తున్నామని అన్నారు. అవసరమున్నవారు రుణాలు తీసుకోవాలని అన్నారు.
మక్తవెంకటాపూర్ గ్రామంలో ప్రతి ఒక్కరూ రాజకీయాలకు అతీతంగా గ్రామాభివృద్ధికి కృషిచేయడం అభినందనీయమని అన్నారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే రామ్మోహన్రెడ్డి, ఎంపీపీ సత్యహరిశ్చంద్ర, జడ్పీటీసీ రాందాస్నాయక్, మార్కెట్ కమిటీ చైర్మన్ హరికృష్ణ, టీఆర్ఎస్ జిల్లా నాయకులుఅనీల్రెడ్డి, కులకచర్ల మండల టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు సుధాకర్రెడ్డి, పీఏసీఎస్ వైస్ చైర్మన్ నాగరాజు, గిరిజన ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్నాయక్ తదితరులు పాల్గొన్నారు.