బొంరాస్పేట, మార్చి 2 : తక్కువ నీటితో ఎక్కువ సాగు చేయొచ్చన్న ఆలోచన తక్కువ మంది రైతుల్లో ఉంటుంది. మండలంలోని రేగడిమైలారం గ్రామానికి చెందిన ఎంపీటీసీ జంగం జగదీశ్ తక్కువ నీటి వినియోగంతో ఎక్కువ సాగు చేస్తూ లాభాలను గడిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నాడు. జగదీశ్కు హైదరాబాద్-బీజాపూర్ జాతీయ రహదారికి పక్కన రెండున్నర ఎకరాల పొలం ఉన్నది. 2019 మే నెలలో బోరు వేస్తే ఐదు అంగుళాల నీళ్లు పడ్డాయి. సమృద్ధిగా ఉన్న నీటితో రెండున్నర ఎకరాల్లో లాభాలు వచ్చే కరివేపాకు పంటను సాగు చేయాలని నిర్ణయించుకున్నాడు. ఆ ఏడాది జూలై నెలలో రూ.15 వేలతో 40 కిలోల కరివేపాకు విత్తనాలను కొనుగోలు చేసి 30 గుంటల పొలంలో విత్తాడు. పొలం దున్ని విత్తనాలు వేసే వరకు రూ.50 వేలు ఖర్చయ్యాయి. సంకరజాతి విత్తనాలు కావడంతో ఆరు నెలల తరువాత 2020 జనవరిలో కరివేపాకు చెట్లు పెరిగాయి. జనవరి నుంచి నేటి వరకు కరివేపాకుతో రోజుకు రూ.వెయ్యి సంపాదిస్తున్నాడు. కరివేపాకు రెమ్మలను కట్టలుగా కట్టి తాండూరు, కొడంగల్, పరిగి పట్టణాలకు వెళ్లి రూ.2లకు ఒక కట్ట చొప్పున వ్యాపారులకు అమ్మి వస్తున్నాడు. కరివేపాకుతో ఏడాదికి రూ.1.60 లక్షల ఆదాయం వచ్చిందని జగదీశ్ తెలిపాడు. ఒకసారి విత్తనాలను నాటితే 25 సంవత్సరాల వరకు చెట్ల నుంచి కరివేపాకు తీసుకోవచ్చని పేర్కొంటున్నాడు. నీటి వినియోగం కూడా చాలా తక్కువని, వేసవి, చలి కాలంలో పదిహేను రోజులకు ఒకసారి నీళ్లు పెడితే సరిపోతుందని చెప్పాడు. వర్షాకాలంలో కురిసే వర్షంతోనే కరివేపాకు పెరుగుతుందని తెలిపాడు. తరుచూ కలుపు తీస్తూ, పురుగు రాకుండా మందులు పిచికారీ చేస్తూ మొక్కలను జాగ్రత్తగా కాపాడుతున్నానని వివరించాడు.
మరో ఎకరం పొలంలో రూ.15 వేల పెట్టుబడితో కొత్తిమీర, మెంతెం కూరను సాగు చేశాడు. ఫిబ్రవరి నుంచి మే వరకు రూ.200లకు కిలో చొప్పున కొనుగోలు చేస్తారని చెప్పాడు. విత్తనాలు చల్లిన 45 రోజుల్లోనే కొత్తిమీర చేతికి వస్తుందని తెలిపాడు. కొత్తిమీర, మెంతెం కూరతో మంచి లాభాలు వస్తున్నాయన్నారు. ఖర్చు తక్కువ, లాభాలు ఎక్కువగా వచ్చే ఉద్యాన పంటలను ఎంచుకోవాని జగదీష్ రైతులకు సూచిస్తున్నాడు.
ఆకు కూరల సాగు ఎంతో మేలు. తక్కువ పెటు ్టబడితో ఎక్కువ లాభాలను పొందవచ్చు. నీటి వినియోగం తక్కువగానే ఉంటుంది. నాకున్న రెండున్నర ఎకరాల్లో కరివేపాకు, కొత్తిమీర, మెంతెం కూర సాగు చేశా. మార్కెట్లో మంచి డిమాండ్ ఉండడంతో లాభాలు వస్తున్నాయి. ప్రతి రోజూ పొలం వద్దే ఉంటా. కూలీలతో కరివేపాకు, కొత్తిమీర, మెంతెం కూరను కట్టలుగా కట్టి మార్కెట్కు వెళ్లి అమ్మి వస్తా.
-జగదీశ్, రేగడిమైలారం