సిటీబ్యూరో, అక్టోబరు 18(నమస్తే తెలంగాణ): పండుగ సీజన్ను ఆదాయ వనరుగా మార్చుకునేందుకు సైబర్ నేరస్తులు ‘ఆన్లైన్’లో కాచుకొని కూర్చున్నారు. దసరా, దీపావళిని వేదికగా మార్చుకొని ఓఎల్ఎక్స్లో తిష్ట వేశారు. అందులోని ప్రకటనలపై ప్రత్యేకంగా నజర్ పెట్టారు. పాత వస్తువులు కొంటామంటూ… డబ్బులు చెల్లించేందుకు క్యూ ఆర్ కోడ్లు పంపించి.. లక్షలు దండుకుంటున్నారు. ఈ నేపథ్యంలో పండుగల సందర్భంగా ఆన్లైన్ ద్వారా తమ పాత వస్తువులు అమ్మేసి కొత్తవి కొనేందుకు సిద్ధమవుతున్న వారు చాలా అప్రమత్తంగా ఉండాలని సైబర్ క్రైం పోలీసులు హెచ్చరిస్తున్నారు.
సింగిల్ డోర్ ఫ్రిడ్జి అమ్మకానికి పెడితే…
సనత్నగర్కు చెందిన ఓ డిజైనర్ దసరా పండుగ కంటే ముందు తన ఇంట్లో ఉన్న సింగిల్ డోర్ పాత ఫ్రిడ్జిని రూ.8 వేలకు అమ్ముతున్నట్లు ఓఎల్ఎక్స్లో ఫోన్ నంబర్తో ప్రకటన పెట్టాడు. యాడ్ పోస్ట్ చేసిన మూడు గంటలకే ఓ గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ చేసి.. ‘మీ ఫ్రిడ్జిని నేను కొంటాను’ అని చెప్పాడు. పూర్తి నగదును చెల్లిస్తాను.. ఆ తర్వాత చిరునామా పంపిస్తానని నమ్మించాడు. అయితే ముందుగా ఓ క్యూ ఆర్ కోడ్ పంపిస్తానని.. స్కాన్ చేసి ఓ రూ.20 పంపండి అని సూచించాడు. అలా చేయగానే మొత్తం రూ. 7 లక్షలు బాధితుడి ఖాతా నుంచి కాజేశాడు. మోసపోయానని సైబరాబాద్ సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
ఓ బ్యాంక్ ఉన్నతాధికారిని బోల్తా…
ఓల్అల్వాల్ ప్రాంతానికి చెందిన ఓ ప్రైవేటు బ్యాంక్ ఉన్నతాధికారిని తన ఇంట్లోని టేక్ వుడ్ సోఫాను విక్రయించాలని దసరా పండుగకు ముందు రోజు ఓఎల్ఎక్స్ ప్రకటన పెట్టి.. ఫోన్ నంబర్ ఇచ్చారు. ఆగంతకుడు ఫోన్ చేసి ‘మీ సోఫాను కొనుగోలు చేస్తాన’న్నాడు. ధరను మాట్లాడుకొని.. పేమెంట్ కోసం క్యూ ఆర్ కోడ్ పంపాడు. స్కానింగ్తో గందరగోళాన్ని సృష్టించి.. ఆ ఉన్నతాధికారిని నుంచి మొత్తం 3.88 లక్షలు కొట్టేశాడు.
బిజినెస్ ఆఫర్కు స్పందించి.. 46 లక్షలు పోగొట్టుకొని..
వాట్సాప్లో వచ్చిన బిజినెస్ ఆఫర్కు స్పందించిన ఓ వ్యాపారికి సైబర్ నేరగాళ్లు రూ. 46 లక్షలు టోకరా వేశారు. కౌకూర్కు చెందిన వ్యాపారికి వాట్సాప్లో ఓ మెసేజ్, ఈ-మెయిల్ ఐడీ వచ్చింది. అందులో వివరాలు పరిశీలించగా, ఓ అయుర్వేదిక్ ఆయిల్ను కొనుగోలు చేసేందుకు యూకేలోని బార్నెస్ ల్యాబోరేటరీ ఇంటర్నేషనల్ లిమిటెడ్ సిద్ధంగా ఉన్నట్లు పేర్కొన్నారు. అయితే ఆయిల్ నాగ్పూర్లోని ఓ సంస్థ దగ్గర ఉంది. ఆ సంస్థ నుంచి ఆయిల్ కొని మాకు సరఫరా చేయండని మెయిల్లో వివరించారు. 300 లీటర్లను ‘బార్నెస్’ సంస్థ ఖరీదు చేసేందుకు సిద్ధంగా ఉందని పేర్కొన్నారు. సదరు వ్యాపారి ఆయిల్ను కొనుగోలు చేసి సరఫరా చేసేందుకు సిద్ధమయ్యాడు. ఇలా వారి మాటలు నమ్మి మొత్తం రూ. 46 లక్షలు చెల్లించుకున్నాడు. ఆ తర్వాత వారు ఫోన్లు ఎత్తకపోవడం, మెయిల్స్కు స్పందించకపోవడంతో బాధితుడు సైబరాబాద్ సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
క్యూ ఆర్ కోడ్లను క్షుణ్ణంగా పరిశీలించండి:సైబర్ క్రైం పోలీసులు
ఎవరైనా క్యూ ఆర్ కోడ్ పంపిస్తే జాగ్రత్తగా పరిశీలించండి. అతడు డబ్బులు చెల్లించానని మనకు క్యూఆర్ కోడ్ పంపినప్పుడు అది మనకు రిసీవ్డ్ అని రావాలి. కానీ చాలా మంది అది గమనించకుండానే కోడ్ను క్లిక్ చేస్తున్నారు. గుర్తు తెలియని వ్యక్తులు పంపే క్యూఆర్ కోడ్లో పే అని పెట్టి పంపిస్తారు. దీంతో మనం దానిని క్లిక్ చేయగానే మన ఖాతా నుంచి డబ్బు వెళ్లిపోతుంది. ఇది గమనించుకోవాలి. అలాగే ఏదైనా డెలివరీలో ఆలస్యమైనా…లేదా తప్పుడు వస్తువు వచ్చిందని.. తిరిగి వాపసు ఇచ్చేందుకు ఇంకా ఏదైనా కారణాలతో గూగుల్ సెర్చ్లో కస్టమర్ కేర్ నంబర్లను కోసం వెతికి సైబర్ మోసగాళ్ల చేతిలో చిక్కొద్దు. నేరుగా సంబంధిత వెబ్సైట్లలో లావాదేవిలు జరుపాలి.