మాతాశిశు ఆరోగ్య సంరక్షణ కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నది. ఇప్పటికే ఆరోగ్యలక్ష్మి పథకంలో భాగంగా గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు పౌష్టికాహారాన్ని అందించడంతో పాటు రక్తహీనతను నివారించేందుకు బాలామృతం ప్లస్ను అందజేస్తున్నది. మధ్యాహ్న భోజనానికి ఇప్పటివరకు దొడ్డు బియ్యం సరఫరా చేస్తుండగా, ఇక నుంచి సన్న బియ్యాన్ని పంపిణీ చేయాలని నిర్ణయించింది. వచ్చే నెల నుంచి అంగన్వాడీలకు సన్నబియ్యం పంపిణీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. రంగారెడ్డి జిల్లాలోని ఏడు ఐసీడీఎస్ ప్రాజెక్టుల పరిధిలోని 1600 అంగన్వాడీ కేంద్రాల్లో 28,644 మంది గర్భిణులు, బాలింతలు, 1,45,118 మంది చిన్నారులకు ప్రయోజనం చేకూరనున్నది. గర్భం దాల్చిన నుంచి ప్రసవం వరకు నాణ్యమైన వైద్యంతో పాటు పౌష్టికాహారాన్ని అందజేస్తున్నందుకు రంగారెడ్డి జిల్లావాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
షాబాద్, మే 26 : మాతాశిశు ఆరోగ్య సంరక్షణకు అధిక ప్రాధాన్యం ఇస్తున్న రాష్ట్ర ప్రభుత్వం మరో బృహత్తర పథకానికి శ్రీకారం చుట్టింది. అంగన్వాడీ కేంద్రాల్లో మధ్యాహ్న భోజనానికి ఇప్పటివరకు దొడ్డు బియ్యం సరఫరా చేస్తుండగా, వచ్చే నెల నుంచి సన్నబియ్యం పంపిణీ చేయనున్నారు. ఈ మేరకు నూతన సచివాలయ ప్రారంభోత్సవం సందర్భంగా ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే ఆరోగ్యలక్ష్మి పథకంలో భాగంగా గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు పౌష్టికాహారం అందుతుండగా, ఇప్పుడు సన్నబియ్యంతో కూడిన మధ్యాహ్న భోజనం అందించనున్నారు. దీంతో అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారుల సంఖ్య మరింత పెరుగనున్నది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో రంగారెడ్డిజిల్లాలో ఏడు ఐసీడీఎస్ ప్రాజెక్టుల పరిధిలోని 1600 అంగన్వాడీ కేంద్రాల్లో 28,644 మంది గర్భిణులు, బాలింతలు, 1,45,118 మంది చిన్నారులకు ప్రయోజనం కలగనున్నది.
రంగారెడ్డిజిల్లాలో 27 మండలాల పరిధిలోని ఏడు ఐసీడీఎస్ ప్రాజెక్టులు చేవెళ్ల, షాద్నగర్, ఇబ్రహీంపట్నం, హయత్నగర్, ఆమనగల్లు, శేరిలింగంపల్లి, మహేశ్వరం ప్రాజెక్టుల పరిధిలో మొత్తం 1380 పెద్ద అంగన్వాడీ కేంద్రాలు ఉండగా, 220 మినీ కేంద్రాలతో కలిపి 1600 కేంద్రాలున్నాయి. ఈ కేంద్రాల్లో 15,209 మంది గర్భిణులు, 13,435 మంది బాలింతలు, 1,45,118 మంది చిన్నారులున్నారు. అంగన్వాడీ కేంద్రాలను బలోపేతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు పౌష్టికాహారాన్ని అందజేస్తున్నది. దీంతో పాటు ఆరోగ్యలక్ష్మి పథకాన్ని ప్రవేశపెట్టగా ఆశించిన ఫలితాలు రావడంతో మరో బృహత్తర పథకానికి శ్రీకారం చుట్టింది. ఇప్పటివరకు అంగన్వాడీ కేంద్రాలకు దొడ్డుబియ్యం ఇస్తున్న ప్రభుత్వం వచ్చే నెల నుంచి సన్నబియ్యం పంపిణీకి కసరత్తు చేస్తున్నది.
మాతాశిశు సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగుతుంది. అంగన్వాడీ కేంద్రాలకు వచ్చే చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు సంపూర్ణ ఆరోగ్యాన్ని ఇవ్వాలన్న సదుద్దేశంతో 2015లో ఆరోగ్యలక్ష్మి పథకాన్ని ప్రవేశపెట్టింది. ఇందులో భాగంగా ఒక్కో గర్భిణి, బాలింతకు రోజుకు రూ.21.50 ఖర్చు చేస్తున్నది. మూడేండ్ల నుంచి ఆరేండ్లలోపు పిల్లలకు రోజుకు రూ.7.26 చొప్పున, ఏడు నెలల నుంచి మూడేండ్లలోపు చిన్నారులకు రోజుకు రూ.7.12 ఖర్చు చేస్తుంది. వీటితో పాటు బాలమృతం వంటి పౌష్టికాహారాన్ని అందిస్తుంది. కాగా, దొడ్డు బియ్యం భోజనం ఇస్తుండడంతో ఎవరూ సరిగ్గా అంగన్వాడీ కేంద్రాలకు రావడం లేదని భావించిన సర్కారు ఇటీవల రాష్ట్ర సచివాలయ ప్రారంభోత్సవ సందర్భంగా అంగన్వాడీ కేంద్రాల్లో సన్నబియ్యంతో మధ్యాహ్న భోజనం అందించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో పోషణలోపం, రక్తహీనతను నివారించేందుకు ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నది. ప్రసుత్తం అంగన్వాడీ కేంద్రాల ద్వారా చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు పౌష్టికాహారం అందిస్తూ వారిలో పోషణలోపం, రక్తహీనతను నివారించేందుకు ప్రత్యేకంగా కృషి చేస్తున్నది. మూడేండ్లలోపు చిన్నారులకు బాలామృతం ప్లస్ అందిస్తూ ఆరోగ్యమే మహాభాగ్యంగా అంగన్వాడీ టీచర్లు పనిచేస్తున్నారు. అంగన్వాడీ కేంద్రాల్లో సన్నబియ్యంతో కూడిన మధ్యాహ్న భోజనం అందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టడం సంతోషకరమని ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
గర్భిణులు, బాలింతలు, చిన్నారులు సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతో ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాలకు సన్నబియ్యం పంపిణీ చేసేందుకు చర్యలు చేపట్టింది. జిల్లా వ్యాప్తంగా మొత్తం 1600 అంగన్వాడీ కేంద్రాల్లో 28,644 మంది గర్భిణులు, బాలింతలు, 1,45,118 మంది చిన్నారులు ఉన్నారు. వీరికి సంబంధించిన పూర్తి వివరాలను ఉన్నాతాధికారులకు పంపించాం. ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చిన వెంటనే జిల్లాలోని అన్ని కేంద్రాలకు సన్నబియ్యం పంపిణీ చేస్తాం. పకడ్బందీగా బియ్యం పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం.
పద్మజారమణ, రంగారెడ్డిజిల్లా సంక్షేమాధికారి