కంటి వెలుగు కార్యక్రమానికి విశేష స్పందన లభిస్తున్నది. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో శిబిరాలకు ప్రజలు పోటెత్తుతున్నారు. కంటి పరీక్షలు చేయించుకొని కండ్లద్దాలు పెట్టుకొని మురిసిపోతున్నారు. ఈ కార్యక్రమం రంగారెడ్డి జిల్లాలో జనవరి 19న ప్రారంభం కాగా.. ఇప్పటివరకు జిల్లాలో 80 వైద్య బృందాల సభ్యులు 5,94,263 మంది ప్రజలకు కంటి పరీక్షలు చేశారు. అందులో 85,183 మందికి అద్దాలను పంపిణీ చేయగా, 73,128 మందికి ప్రిస్క్రిప్షన్ అద్దాల కోసం ఆర్డర్ చేశారు. అందులో జిల్లాకు 44,005 ప్రిస్క్రిప్షన్ అద్దాలు రాగా వాటిని లబ్ధిదారులకు అందజేశారు. అదేవిధంగా వికారాబాద్ జిల్లాలో ఏర్పాటు చేసిన 40 వైద్య బృందాల సభ్యులు 3,54,591 మందికి నేత్ర పరీక్షలు నిర్వహించారు. 52,281 మందికి రీడింగ్ గ్లాసెస్ పంపిణీ చేశారు. 45,294 మందికి ప్రిస్క్రిప్షన్ అద్దాల కోసం ఆర్డర్ చేయగా అందులో 31,916 అద్దాలు రాగా వాటిని లబ్ధిదారులకు అందజేశారు. కంటి వెలుగు క్యాంపులను పకడ్బందీగా నిర్వహించేందుకు వైద్యారోగ్యశాఖ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు వెల్లువెత్తుతున్నాయి.
బొంరాస్పేట/షాబాద్, ఏప్రిల్ 30 : దృష్టి లోపాలను నివారించి అంధత్వ రహిత తెలంగాణే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన రెండో విడుత కంటి వెలుగు పేదల బతుకుల్లో కొత్త కాంతులు నింపుతున్నది. జనవరి 18న ప్రారంభమైన ఈ కార్యక్రమం ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఉత్సాహంగా కొనసాగుతున్నది. గ్రామాల్లో నిర్వహిస్తున్న కంటి వెలుగు వైద్య శిబిరాలకు ప్రజల నుంచి అనూహ్య స్పందన లభిస్తున్నది. కంటి చూపుతో ఇబ్బందులు పడుతున్న ప్రజలు శిబిరాలకు తరలివచ్చి కంటి పరీక్షలు చేయించుకుంటున్నారు. రూపాయి ఖర్చు లేకుండా కంటి పరీక్షలతోపాటు అద్దాలు, కావలసిన మందులు కూడా పూర్తి ఉచితంగా పంపిణీ చేస్తున్నారు. ప్రిస్క్రిప్షన్ అద్దాలను ఆశ కార్యకర్తలు ఇంటింటికీ తిరిగి పంపిణీ చేశారు. దూరపు చూపు సమస్యతో బాధపడుతున్న తమకు ఎంతో నాణ్యమైన అద్దాలు పంపిణీ చేశారని బాధితులు పేర్కొంటున్నారు. మరోవైపు మొదటి దశ కంటి వెలుగును విజయవంతంగా పూర్తి చేసిన వైద్య ఆరోగ్యశాఖ రెండో విడుతను కూడా అదే స్ఫూర్తితో ముగించాలని ముందుకుకెళ్తున్నది.
కంటి వెలుగు కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ప్రజా ప్రతినిధులు భాగస్వాములవుతున్నారు. ఎమ్మెల్యేలు, ఎంపీపీలు, మార్కెట్ కమిటీ చైర్మన్లు, మున్సిపల్ చైర్మన్లు, ఎంపీటీసీలు, సర్పంచ్లు, అధికారులు కంటి వెలుగు శిబిరాల్లో పాల్గొంటున్నారు. వికారాబాద్ జిల్లాలో 42 వైద్య బృందాలు, రంగారెడ్డి జిల్లాలో 80 వైద్య బృందాలు పట్టణాలు, గ్రామాల్లో శిబిరాలు నిర్వహిస్తుండగా ప్రతిఒక్కరూ కంటి పరీక్షలు చేయించుకునేలా ప్రజలను ప్రోత్సహిస్తున్నారు. జూన్ మొదటి వారం వరకు జిల్లాలోని మొత్తం ఆవాస ప్రాంతాలను కవర్ చేస్తూ కంటి వెలుగు శిబిరాలను నిర్వహిస్తారు.
కంటి పరీక్షలు చేసిన తరువాత కంటి చూపుతో ఇబ్బందులు పడుతున్నవారికి అక్కడికక్కడే రీడింగ్ గ్లాసులు పంపిణీ చేస్తున్నారు. దూరపు చూపు సమస్య ఉన్నవారికి అద్దాలను ఆర్డర్ చేసి కొన్ని రోజుల తరువాత ఆశ కార్యకర్తలు అద్దాలకు కేటాయించిన బార్కోడ్ ఆధారంగా రోగి ఇంటికి వెళ్లి అందజేస్తున్నారు. ప్రిస్క్రిప్షన్ అద్దాలు బయట మార్కెట్లో వీటికి రూ.వెయ్యి నుంచి రూ.1500ల వరకు ఖర్చు చేయాల్సి వస్తే ప్రభుత్వం పూర్తి ఉచితంగా అందజేస్తున్నది. ప్రభుత్వం అందజేసిన అద్దాలతో దూరపు కంటి చూపు సమస్య తొలగిపోయిందని ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
వికారాబాద్ జిల్లాలో శుక్రవారం వరకు 3,54,591 మందికి కంటి పరీక్షలు నిర్వహించారు. జిల్లాకు 76109 రీడింగ్ గ్లాసులు రాగా 52,281 మందికి పంపిణీ చేశారు. దూరపు చూపు సమస్యతో బాధపడుతున్న 45,294 మందికి ప్రిస్క్రిప్షన్ అద్దాల కోసం ఆర్డర్ చేయగా 31,916 అద్దాలు జిల్లాకు రాగా 31906 కండ్లద్దాలను అందజేశారు. జిల్లాలోని 378 గ్రామాలు, 73 వార్డుల్లో కంటి వెలుగు శిబిరాలను నిర్వహించారు.
కంటి వెలుగు పరీక్షలు నిర్వహిస్తున్న వైద్య బృందాలకు రోజుకు భోజనం కోసం ప్రభుత్వం రూ.1500 చొప్పున ఖర్చు చేస్తున్నది. ఇందుకు సంబంధించిన నిధులు విడుదలయ్యాయి. బిల్లులు చేసి డీపీవో ద్వారా పంపిస్తే వైద్య ఆరోగ్య శాఖ అధికారులు నిధులు విడుదల చేస్తున్నారు. వైద్య బృందాలు ఒక్కో గ్రామంలో రెండు నుంచి వారం రోజులకుపైగా కంటి పరీక్షలు నిర్వహిస్తున్నాయి.
రంగారెడ్డి జిల్లాలో శుక్రవారం వరకు 5,94,263 మందికి కంటి పరీక్షలు నిర్వహించారు. ఇందులో 85,183 మందికి కంటి అద్దాలు పంపిణీ చేయగా, 73,128 మందికి ప్రిస్క్రిప్షన్ అద్దాల కోసం ఆర్డర్ చేయగా, 44,005 మందికి ప్రిస్కిప్షన్ అద్దాలు అందజేశారు.
– సుమిత్రమ్మ, బురాన్పూర్, బొంరాస్పేట్ మండలం
నాకు చూపు స్పష్టంగా కనిపించేది కాదు. కంటి వెలుగు శిబిరంలో పరీక్షలు చేసుకుంటే వెంటనే అద్దాలు ఇచ్చారు. ఇప్పుడు కంటి చూపు స్పష్టంగా కనిపిస్తున్నది. ప్రైవేటులో కంటి పరీక్షలు చేయించుకుంటే వేల రూపాయలు ఖర్చయ్యేవి. పైసా ఖర్చు లేకుండా ఉచితంగా కంటి పరీక్షలు చేసి అద్దాలు ఇచ్చారు. పేదలకు కేసీఆర్ ప్రభుత్వం ఎంతో మేలు చేస్తున్నది.
– బ్యాగరి సంగప్ప, బురాన్పూర్, బొంరాస్పేట్ మండలం
ప్రభుత్వం ఉచితంగా పంపిణీ చేసిన కంటి అద్దాలు చాలా బాగున్నాయి. దూరపు చూపు కనపడక కంటి వెలుగు శిబిరంలో పరీక్షలు చేయించుకున్నా. కొన్ని రోజులకు ఆశ కార్యకర్త ఇంటికి వచ్చి అద్దాలు ఇచ్చింది. అద్దాలు పెట్టుకున్న తరువాత చూపు మంచిగా కనిపిస్తున్నది. నయా పైసా ఖర్చు లేకుండా చూపు సమస్య తీరింది.
– ఒగ్గు నర్సింహులు, ముద్దెంగూడ
పేదల కంటి సమస్యలు పరిష్కరించేందుకు ప్రభుత్వం గ్రామాల్లో కంటి వెలుగు క్యాంపులను ఏర్పాటు చేయడం చాలా బాగుంది. మా గ్రామంలో నిర్వహించిన క్యాంపులో కంటి పరీక్షలు చేయించుకున్నాను. అద్దాలు, మందులు అందజేశారు. రూపాయి ఖర్చు లేకుండా ప్రభుత్వం పేదల కోసం ఇలాంటి పథకాలు అమలు చేయడం సంతోషకరం. పేదలకు కంటి వెలుగు కార్యక్రమం ఎంతగానో ఉపయోగపడుతున్నది.
– వెంకటేశ్వర్రావు, రంగారెడ్డిజిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి
జిల్లాలో కంటి వెలుగు కార్యక్రమం పకడ్బందీగా కొనసాగుతున్నది. మొత్తం 80 బృందాల ద్వారా ఆయా గ్రామాల్లో క్యాంపుల నిర్వహిస్తున్నాం. జిల్లా వ్యాప్తంగా ఇప్పటివరకు 5,94,263 మందికి కంటి పరీక్షలు నిర్వహించాం. ఇందులో 85,183 మందికి కంటి అద్దాలు పంపిణీ చేశారు. ఆయా మండలాల్లోని గ్రామాల్లో నిర్వహిస్తున్న కంటి వెలుగు క్యాంపులను ఎప్పటికప్పుడూ పరిశీలిస్తూ సిబ్బందికి సలహాలు, సూచనలు అందిస్తున్నాం.